Begin typing your search above and press return to search.

థియేటర్లో విజిల్స్ వేస్తూ 'రిపబ్లిక్' చూడాలని ఉంది: ఐశ్వర్య రాజేశ్

By:  Tupaki Desk   |   26 Sep 2021 8:47 AM GMT
థియేటర్లో విజిల్స్ వేస్తూ రిపబ్లిక్ చూడాలని ఉంది: ఐశ్వర్య రాజేశ్
X
దేవ కట్టా దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా 'రిపబ్లిక్' సినిమా రూపొందింది. అవినీతి రాజకీయాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. అందుకు సహకరించని నిజాయితీ పరుడైన కలెక్టర్ కథ ఇది. చివరికి విజయం సాధించేది మంచి మాత్రమే అని మరోసారి నిరూపించే సినిమా ఇది. వచ్చేనెల 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. ఇండస్ట్రీకి చెందిన పలువురు దర్శకులు ఈ వేడుకకి హాజరయ్యారు.

క్రిష్ .. మారుతి .. హరీశ్ శంకర్ .. గోపీచంద్ మలినేని .. బీవీఎస్ రవి వీళ్లంతా కూడా సాయితేజ్ తో తమకి గల సాన్నిహిత్యాన్ని గురించి ప్రస్తావించారు. దేవ కట్టా దర్శక ప్రతిభను గురించి ప్రశంసించారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా నటించిన ఐశ్వర్య రాజేశ్ కూడా మాట్లాడింది. "సాయితేజ్ త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డారనేది నాకు తెలుసు.

దేవ కట్టా గారిది ఒక ప్రత్యేకమైన స్కూల్ .. ఈ సినిమా షూటింగుకు మేము ఒక స్కూల్ కి వెళ్లినట్టుగానే వెళ్లాము. ఈ సినిమాలో పాత్ర కోసం ఆయన నన్ను అనుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు ఎంతో మంచివాళ్లు .. వాళ్లలా ఎవరూ ఉండరు. ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. మీ అందరికి మాదిరిగానే నేను కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు కూడా థియేటర్లో విజిల్స్ వేస్తూ ఈ సినిమాను చూడాలని ఉంది" అంటూ చెప్పుకొచ్చింది.

కెరియర్ మొదట్లో తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చిన ఐశ్వర్య రాజేశ్, ఈ మధ్యనే తెలుగు సినిమాలు చేయడానికి ఆసక్తినీ .. ఉత్సాహాన్ని చూపుతోంది. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో తన పాత్ర పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మాయి, ఇటీవల వచ్చిన 'టక్ జగదీష్' సినిమాలో నాని మేనకోడలి పాత్రను చేసింది. నిడివి తక్కువే అయినా ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక చాలా తక్కువ గ్యాప్ లోనే 'రిపబ్లిక్' సినిమాతో పలకరించనుంది. ఈ సినిమా హిట్ అయితే, ఐశ్వర్య రాజేశ్ కెరియర్ పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.