Begin typing your search above and press return to search.

డైరెక్టర్ గా ఈసారైనా హిట్టు కొడతాడా..?

By:  Tupaki Desk   |   28 Nov 2022 11:31 AM GMT
డైరెక్టర్ గా ఈసారైనా హిట్టు కొడతాడా..?
X
టాలీవుడ్ లో రచయితలుగా గుర్తింపు తెచ్చుకున్న అనేక మంది మెగా ఫోన్ పట్టుకొని దర్శకులుగా మారారు. అందులో కొందరు సక్సెస్ అవ్వగా.. మరికొందరి కెరీర్ మాత్రం రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు కొరటాల శివ సైతం మొదట్లో రైటర్స్ అనే సంగతి తెలిసిందే. వక్కంతం వంశీ కూడా రచయిత నుంచి దర్శకుడిగా మారిన క్యాటగిరీలో ఉన్నారు.

టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన వక్కంతం వంశీ.. దాసరి నారాయణ రావు డైరెక్ట్ చేసిన 'కల్యాణ ప్రాప్తిరస్తు' అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసాడు. అయితే ఫస్ట్ మూవీ విజయాన్ని అందుకోలేదు. వంశీకి ఆశించిన గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దీంతో తనలోని రైటింగ్ స్కిల్స్ ని బయటకు తీసి, రచయితగా కొన్ని సినిమాలు చేసాడు. ఈ క్రమంలో 'కిక్' చిత్రంతో రచయితగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత వక్కంతం వంశీ 'రేసుగుర్రం' 'టెంపర్' 'ఎవడు' వంటి విజవంతంగా చిత్రాలకు కథలు అందించాడు. అయితే దర్శకుడిగా మారాలనే ఆశతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయడానికి ట్రై చేసారు. కొన్నాళ్ళు ట్రావెల్ చేసారు. కానీ కథ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను మెప్పించి.. 2018లో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు.

లగడపాటి శ్రీధర్ నిర్మించిన 'నా పేరు సూర్య' చిత్రం.. భారీ అంచనాల నడుమ విడుదలై, బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. డెబ్యూతోనే ప్లాప్ అందుకోవడంతో వక్కంతం వంశీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి టైం పట్టింది. పలువురు స్టార్ హీరోలతో వర్క్ చేయడానికి ప్రయత్నించాడు.. కానీ ఏదీ వర్కౌట్ అవ్వలేదు. దీంతో మళ్ళీ రచయితగా అక్కినేని అఖిల్ మరియు డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ కోసం 'ఏజెంట్' కథను అందించారు.

అదే సమయంలో యూత్ స్టార్ నితిన్ కు ఓ లైన్ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు వంశీ. స్క్రిప్ట్ కోసం కాస్త ఎక్కువ టైం తీసుకున్న దర్శకుడు.. ఇటీవలే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. దీంతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకొని మళ్ళీ ట్రాక్ లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాపై నితిన్ - వంశీ ఇద్దరూ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. ఇది కూడా నిరాశ పరిస్తే.. దర్శకుడిగా వంశీ గడ్డుకాలం ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే Nithin32 మంచి కథా బలం ఉన్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ అని.. ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్ర బృందం ధీమాగా ఉన్నారు. ఇందులో నితిన్ రగ్గుడ్‌ లుక్‌ లో కనిపించనున్నారు. ఇందులో అతను ఒక లారీ డ్రైవర్‌ అని టాక్. 'పెళ్ళిసందD' బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. హరీస్ జయరాజ్‌ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.

శ్రేష్ఠ్ మూవీస్‌ బ్యానర్‌ పై నితిన్‌ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. నితిన్ తన బ్యాక్ సైడ్ లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన కొత్త సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలోపు షూటింగ్‌ పూర్తి చేసి.. సమ్మర్‌ కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనుకుంటున్నారు. మరి ఈ సినిమాతో వక్కంతం వంశీ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.