Begin typing your search above and press return to search.

బాలయ్య 'అన్ స్టాపబుల్' షో ను లాంచ్ చేసిన ఆహా..!

By:  Tupaki Desk   |   14 Oct 2021 1:04 PM GMT
బాలయ్య అన్ స్టాపబుల్ షో ను లాంచ్ చేసిన ఆహా..!
X
నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదికగా స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను అలరించనున్న సంగతి తెలిసిందే. 100 శాతం తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' కోసం బాలయ్య 'అన్ స్టాపబుల్ విత్ NBK' అనే టాక్ షో చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న ఈ షో నవంబరు 4వ తేదీన ఆహా ఓటీటీలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ''ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలోనూ ఎత్తు పల్లాలుంటాయి. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే 'అన్ స్టాపబుల్'. ఈ కాన్సెప్ట్ నాకు నచ్చడంతో వెంటనే చేయడానికి అంగీకరించాను'' అని అన్నారు.

''సాంఘికం, జానపదం, సోషియో ఫాంటసీ, కుటుంబ కథాచిత్రాల్లో వివిధ పాత్రలు పోషించి మీకు వినోదాన్ని అందించటానికి ప్రయత్నిస్తున్నాను. మీరు అంతులేని ప్రేమాభిమానాలతో నన్ను ఆదరిస్తున్నారు. ఇంకా ఎంతో చేయాలని ప్రేరణ ఇస్తోంది మన తెలుగు జాతి. 'ఆహా' ఓటీటీ మాధ్యమం అల్లు అరవింద్ మానస పుత్రిక. అంతర్జాతీయ దిగ్గజ ఓటీటీలకు దీటుగా 'ఆహా' ను స్థాపించారు. పొట్టివాళ్లకు పుట్టెడు బుద్ధులు అని అంటారు. ఆయనతో ఎందుకు అంత సన్నిహితంగా మాట్లాడతానంటే.. అల్లు అరవింద్ గారికి మా కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. ది గ్రేట్ లెజెండ్ అల్లు రామలింగయ్య గారి అబ్బాయి. నా చిన్న చిన్నప్పుడు మద్రాస్ వెళ్ళినప్పుడు మా ఇంట్లోకి నేరుగా వెళ్లి, మా అమ్మగారితో టీ పెట్టించుకుని, బండోడికి ఏమన్నా ఉన్నాయా? మోయడానికి? అనే వారు. అలాంటి చనువు ఇండస్ట్రీలో ఒక్క అల్లు రామలింగయ్య గారికి మాత్రమే ఉంది. ఇండస్ట్రీలో ఆ స్థాయి చనువు మరెవరికీ లేదు'' అని బాలకృష్ణ చెప్పారు.

''దర్శకుడు ప్రశాంత్ వర్మతో సహా ఎంతో మంది ఈ షోకు కష్టపడి పని చేస్తున్నారు. ఒక మనిషి ప్రజెంటేషన్ 'ఆహా' లో వస్తున్న 'అన్ స్టాపబుల్'. నటన అంటే ఒక పాత్రలోకి వెళ్లడం. దాని ఆత్మలోకి ప్రవేశించటం. ఎంతో ఒత్తిడితో కూడుకున్నది. తెలుగువారు గర్వించదగ్గ ఓటీటీ 'ఆహా'. ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుంది. అది ఉన్నప్పుడే అసలు మజా ఉంటుంది. మనుషులుగా మనమంతా ఒకటే. బావిలో కప్పలా ఉండకుండా బయటకు వచ్చినప్పుడు అసలు మనిషి ఆవిష్కరించబడతాడు. అలా ఆవిష్కరించే ప్రయత్నమే ఈ షో. మనిషి మనిషికీ జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఎత్తు పల్లాలుంటాయి. వాటిని అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరడమే 'అన్ స్టాపబుల్'. ఈ కార్యక్రమానికి వచ్చే నటీనటులతో కలిసి మాట్లాడతా.. వాళ్ల భావోద్వేగాలు పంచుకుంటా.. మాటలతో వాళ్లను ట్విస్ట్ చేస్తా.. కలుద్దాం 'ఆహా' లో అన్ స్టాపబుల్'' అని బాలకృష్ణ అన్నారు.

ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ''బాలకృష్ణ వెండి తెర మీద నటుడేమో కానీ, నిజ జీవితంలో కాదు. భావోద్వేగాలను దాచుకోరు. కోపం, బాధ, ప్రేమ, నవ్వు ఏదైనా ఉన్నది ఉన్నట్లు వెంటనే చూపిస్తారు. అలాంటి వ్యక్తి 'అన్ స్టాపబుల్' షో చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ఒకరోజు 'ఆహా' టీమ్ తో కలిసి ఏదో మాట్లాడుతూ బాలకృష్ణ తో షో చేస్తే ఎలా ఉంటుంది అని అన్నాను. అందరూ ఎగ్జైట్మెంట్ తో అరిసారు. అప్పుడే వాళ్ల ముందే బాలకృష్ణ గారికి ఫోన్ చేశా. ఆయన కూడా ఓకే అన్నారు. అలా ఈ షో పట్టాలెక్కింది. ఈఈ షో తో పాటుగా బాలయ్య గారు నటిస్తున్న 'అఖండ' సినిమా కూడా అఖండమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. ఆహాకు ప్రస్తుతం 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారని.. ఈ ఏడాది చివరి నాటికి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ లక్ష్యంగా పెట్టుకొని టీమ్ అంతా కష్టపడుతున్నారని అల్లు అరవింద్ పేర్కొన్నారు. తెలుగు సినిమాకు దేశవ్యాప్తంగా 'బాహుబలి' ఎంత గౌరవాన్ని తెచ్చిందో.. అలాంటి గౌరవాన్ని నిలబెట్టేందుకే 'ఆహా' కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా చెబుతున్నానని మెగా ప్రొడ్యూసర్ అన్నారు.