Begin typing your search above and press return to search.

'సీతా రామం' విజయంతో రాధాకృష్ణను ట్రోల్ చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్..!

By:  Tupaki Desk   |   8 Aug 2022 7:47 AM GMT
సీతా రామం విజయంతో రాధాకృష్ణను ట్రోల్ చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్..!
X
దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ - రష్మిక మందన్నా - సుమంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన 'సీతా రామం' సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. తొలిరోజు కలెక్షన్స్ పరంగా కొంచం అంచనాలు తప్పినా.. రెండు మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని వసూళ్లను రాబట్టింది. ఒక కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ అందించాడని దర్శకుడు హను రాఘవపూడి పై సర్వత్రా ప్రశంసలు వర్షం కురుస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా 'సీతా రామం' సక్సెస్ మరో డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ను ట్రోల్ చేసేలా చేసింది.

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా 'రాధే శ్యామ్' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. బ్యూటీఫుల్ పీరియాడిక్ లవ్ స్టోరీగా పేర్కొనబడిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకుంది. ముఖ్యంగా ఈ సినిమా ప్లాప్ కు డైరెక్టర్ రాధాకృష్ణ ను బాధ్యున్ని చేస్తూ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ విపరీతమైన ట్రోలింగ్ చేసారు.

ఇండియన్ టైటానిక్ తీసినట్లు బిల్డప్ ఇచ్చి.. నిజంగా మునిగిపోయే సినిమా ఇచ్చారని కామెంట్స్ చేశారు. రాధాకృష్ణ ట్విట్టర్ లో కామెంట్ సెక్షన్ ని రిస్ట్రిక్ట్ చేశారంటే డార్లింగ్ ఫ్యాన్స్ ట్రోల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 'రాధే శ్యామ్' సినిమా వచ్చి నాలుగున్నర నెలలు గడిచిపోయింది. చిత్ర బృందంతో పాటుగా అభిమానులు సైతం నెమ్మదిగా దాన్నుంచి బయటకు వస్తున్నారు. అయితే ఇప్పుడు 'సీతా రామం' విజయంతో మరోసారి రాధాకృష్ణ తెర మీదకు వచ్చాడు.

వాస్తవానికి పాండమిక్ తర్వాత సినీ అభిమానులు ఎలాంటి చిత్రాలని ఆదరిస్తున్నారనే విషయాన్ని ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. కాకపోతే మంచి కంటెంట్ తో వచ్చిన చిత్రాలను మాత్రం కచ్చితంగా హిట్ చేస్తారని తెలియజెప్పారు. ఇప్పుడు లేటెస్టుగా 'సీతా రామం' సినిమాతో మరోసారి ప్రూవ్ చేశారు. సరైన కంటెంట్ తో సాలిడ్ కలెక్షన్స్ అందిస్తామని చెప్పకనే చెప్పారు.

ఓ అందమైన ప్రేమకథతో ప్రధాన నటీనటుల మధ్య మంచి కెమిస్ట్రీతో 'సీతా రామం' సినిమాని ఆవిష్కరించి ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించారు హను రాఘవపూడి. 'రాధే శ్యామ్' విషయంలో ఇవే మిస్సయ్యాయి. అద్భుతమైన కథపై దృష్టి పెట్టడానికి బదులుగా భారీ సెట్‌లు మరియు గ్రాండ్ విజువల్స్‌ పై ఖర్చు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారని.. అందుకే అలాంటి డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

'సీతా రామం' మరియు 'రాధేశ్యామ్' సినిమాలను కంపేర్ చేస్తూ కేవలం బడ్జెట్ - స్టార్ కాస్ట్ ఉంటే సరిపోదని.. లవ్ స్టోరీ చేయడానికి తగిన కంటెంట్ కూడా ఉండాలని రాధాకృష్ణ ను ట్యాగ్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటివేమీ ఆలోచించకుండా.. భారీతనం మీదే దృష్టిపెట్టి ఒక పేలవమైన సినిమాని ప్రభాస్ తో చేశారని విమర్శిస్తున్నారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 'రాధే శ్యామ్' తీసిన రాధాకృష్ణ.. 'సీతా రామం' డైరెక్టర్ హను రాఘవపూడి ఇద్దరూ విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి శిష్యులు. అయితే ఒకరు 30 కోట్లలో ఒక మ్యాజికల్ లవ్ స్టొరీతో బ్లాక్ బస్టర్ హిట్ కొడితే.. మరొకరు మాత్రం 300 కోట్లు ఖర్చు చేసి డిజాస్టర్ సినిమా అందించారని నెటిజన్లు మీమ్స్ చేస్తున్నారు.

'సీతారామం' చూసిన తర్వాత ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ రాధాకృష్ణ ను బాగా ట్రోల్ చేస్తున్నారు. ఒక బ్యూటీఫుల్ లవ్ స్టోరీని ఇలా తీయాలని దర్శకుడికి సూచిస్తున్నారు. 'ఈ కథ ప్రభాస్ రాసి పెట్టింది' అంటూ డిజాస్టర్ సినిమా ఇచ్చారని.. అవకాశం ఇచ్చిన ప్రభాస్ నమ్మకాన్ని వమ్ము చేశారని.. గ్రాండియర్ కోసం నిర్మాతలతో డబ్బును నీళ్ళలా ఖర్చు చేయించారని విమర్శిస్తున్నారు. అదే సమయంలో తక్కువ బడ్జెట్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా తీసిన హను ని ప్రశంసిస్తున్నారు.