Begin typing your search above and press return to search.

ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ!

By:  Tupaki Desk   |   11 Feb 2022 10:30 AM GMT
ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ మూవీ!
X
హారిక అండ్ హాసిని .. సితార ఈ రెండు కూడా త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ వంటివే. ఈ రెండు బ్యానర్లపై వచ్చే ఇతర సినిమాల విషయంలోను త్రివిక్రమ్ జోక్యం ఉంటుంది. సితార బ్యానర్ లోనే 'భీమ్లా నాయక్' సినిమా నిర్మితమైంది. మలయాళంలో హిట్ కొట్టిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా, ఒక పాట కూడా రాశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు.

"మొదటి నుంచి కూడా నాకు పవన్ కల్యాణ్ గారంటే ఇష్టం. ఆయనతో ఒక సినిమా చేయాలని ఉందని నేను త్రివిక్రమ్ గారితో చెప్పాను. అప్పటికే నేను 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాను ఓటీటీలో చూడటం .. ఆ సినిమా రైట్స్ తీసుకోవడం జరిగిపోయింది. ఈ సినిమాను పవన్ కల్యాణ్ గారితో చేసేలా త్రివిక్రమ్ గారు చూశారు. మలయాళంలోని మూలకథ దెబ్బతినకుండా త్రివిక్రమ్ గారు అనేక మార్పులు చేర్పులు చేశారు. అసలు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఇది రీమేక్ అనే విషయం మీకు గుర్తుకు రాదు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ విశ్వరూపం చూస్తారు.

మళ్లీ పవన్ కల్యాణ్ గారితో ఒక సినిమా చేయాలనుంది. ఆయనను అడగాలని అనుకుంటున్నాను. వరుస సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. ఎప్పుడు వర్కౌట్ అవుతుందనేది చెప్పలేను గానీ, మరో సినిమాను ఆయనతో చేయాలనే అనుకుంటున్నాను. ఇక త్రివిక్రమ్ గారితో ఎన్టీఆర్ చేయాలనుకున్న సినిమా ఆగిపోయిందని అనుకుంటున్నారు. అందులో ఎంతమాత్రం నిజం లేదు.

ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చాలా పెద్ద బడ్జెట్ సినిమా చేయాలనుకుంటున్నారు. ఇండియాలోని బిగ్గెస్ట్ సినిమాల్లో ఒకటిగా ఆ సినిమా ఉంటుంది. అందువలన అందుకు సంబంధించిన సమయం కోసం ఆ ప్రాజెక్టును వాయిదా వేసుకోవడం జరిగిందంతే.

ఇక బన్నీతో .. చరణ్ తో మా బ్యానర్ పై సినిమాలు చేయాలనుంది. చరణ్ తో సినిమా చేసే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. చరణ్ హీరోగా చేసే సినిమా కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉంటుంది. ఇక మా బ్యానర్ పై రూపొందిన 'డీజే టిల్లు' ఈ నెల 12వ తేదీన విడుదలవుతోంది. ఇది చిన్న సినిమానే కదా అని అంతా అంటున్నారు.

ఓ మాదిరి బడ్జెట్ లో ఓ మూడు సినిమాలు చేద్దామని లాక్ డౌన్ సమయంలో అనుకున్నాము. అప్పుడు ఓకే చేసిన ప్రాజెక్టు ఇది. మా బ్యానర్ కి గల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకి కూడా ఎక్కువగానే ఖర్చుపెట్టడం జరిగింది" అని చెప్పుకొచ్చారు.