Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో విషాదం.. నిర్మాత సందీప్ కొరిటాల హఠాన్మరణం..!

By:  Tupaki Desk   |   28 Feb 2021 2:51 PM GMT
టాలీవుడ్ లో విషాదం.. నిర్మాత సందీప్ కొరిటాల హఠాన్మరణం..!
X
తెలుగు చిత్రప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. నిర్మాత సందీప్ కొరటాల గుండెపోటుతో కన్నుమూశారు. ఆదివారం ఉద‌యం ఈ దుర్ఘ‌ట‌న సంభ‌వించింది. సందీప్ కొరిటాల మృతిప‌ట్ల సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తంచేస్తున్నారు. ప్ర‌ముఖ హీరో నారా రోహిత్, దర్శకుడు సుధీర్ వర్మ సంతాపం తెలిపారు. సందీప్ తో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు.

నారా రోహిత్ హీరోగా వచ్చిన 'రౌడీ ఫెలో' చిత్రానికి సందీప్ కొరిటాల సహ నిర్మాతగా వ్యవహరించారు. అదేవిధంగా.. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన 'స్వామిరారా' చిత్రానికి కూడా కో-ప్రొడ్యూసర్ గా ఉన్నారు సందీప్. ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాల సమయంలో సందీప్ తో తమకు ఏర్పడిన అనుబంధాన్ని తలుచుకుంటూ నారా రోహిత్, సుధీర్ వర్మ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

సందీప్ కొరిటాల మరణాన్ని నారా రోహిత్ అందరికీ తెలియజేశారు. ఆయన ట్వీట్ చేయడంతోనే ఈ విషాద వార్త సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలిసింది. సందీప్ ఫోటోను షేర్ చేసిన రోహిత్.. ''నా రౌడీ ఫెలో సినిమా సహనిర్మాత, నా శ్రేయోభిలాషి సందీప్ కొరిటాల ఇకలేరనే వార్త విని చాలా బాధపడ్డాను. ఈరోజు ఇంత బాధాకరంగా ప్రారంభమవుతుందని అనుకోలేదు. ఓం శాంతి'' అని ట్వీట్ చేశారు.

సందీప్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేసిన దర్శకుడు సుధీర్ వర్మకూడా ట్విటర్ వేదికగా పోస్ట్ చేశారు. ''నా ఆత్మీయ స్నేహితుడు సందీప్ కొరిటాల మరణవార్త విని చాలా బాధపడ్డాను. 'స్వామిరారా' రూపొందించడంలో మీ ప్రోత్సాహాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సోదరా. నిన్ను మేం కోల్పోతున్నాం'' అని భావోద్వేగానికి గురయ్యారు సుధీర్ వర్మ.

ఈ పోస్టుకు 'స్వామిరారా' షూటింగ్ సందర్భంలో సెట్‌లో దిగిన ఫొటోను షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు సుధీర్. సందీప్ కొరిటాల మరణ వార్త తెలుసుకున్న చాలా మంది సెలబ్రిటీలు, సన్నిహితులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.