Begin typing your search above and press return to search.

తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు...!

By:  Tupaki Desk   |   20 Oct 2020 11:50 AM GMT
తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు...!
X
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రాణ నష్టం జరగడంతో పాటు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరద బాధితులకు తక్షణ సాయంగా తెలంగాణ ప్రభుత్వం రూ.550 కోట్లను ప్రకటించింది. అందరూ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వెంటనే స్పందించే టాలీవుడ్.. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి మరోసారి ముందుకొచ్చింది. ముందుగా సీనియర్ హీరో అక్కినేని నాగార్జున స్పందించి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నాడు. అలానే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రభుత్వానికి అండగా ఉంటానంటూ వరద బాధితులకు సహాయార్థంగా రూ. 1 కోటి రూపాయలను ప్రకటించారు.

మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కు కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. క్లిష్ట సమయం‍లో ప్రతి ఒక్కరూ తమకు వీలైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు చిరు. జూనియర్ ఎన్టీఆర్ తన వంతు సాయంగా రూ.50 లక్షలు అందించటానికి ముందుకు వచ్చారు. విజయ్‌ దేవరకొండ 10 లక్షలు.. డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ 10 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ 10 లక్షలు.. స్టార్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి - హరీష్ శంకర్ చెరో 5 లక్షల రూపాయలను విరాళంగా అందించనున్నట్లు తెలిపారు. వీరితో పాటు మంచు లక్ష్మీ - అక్కినేని సమంత వరద బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నారు. తెలంగాణా మంత్రి కేటీఆర్‌ ఆపత్కాల సమయంలో రాష్ట్ర ప్రజలకు, ప్రభుత్వానికి అండగా నిలిచి దాతలకు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.