Begin typing your search above and press return to search.

సుశాంత్ మృతిపై ఎయిమ్స్ రిపోర్ట్ ఇదీ

By:  Tupaki Desk   |   29 Sep 2020 9:30 AM GMT
సుశాంత్ మృతిపై ఎయిమ్స్ రిపోర్ట్ ఇదీ
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం చుట్టూ ఇప్పుడు ఎన్నో వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. అతడి హత్య అని కొందరు.. ఆత్మహత్య అని మరికొందరు అనడం.. ఆ తర్వాత ఆ కేసు చుట్టూ డ్రగ్స్ మూలాలు బయటపడడం తెలిసిందే. పలువురు హీరోయిన్లు జైలు పాలవడం.. మరికొందరు విచారణను ఎదుర్కొంటుండడం.. మొత్తం బాలీవుడ్ మొత్తం ఇప్పుడు షేక్ అవుతోంది.

ఈ క్రమంలో సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజాగా ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) కీలక రిపోర్టు సమర్పించింది. సుశాంత్ మృతికి గల కారణాలను మంగళవారం ప్రభుత్వానికి నివేదికగా సమర్పించింది.

సుశాంత్‌ సింగ్‌ శరీరంలో ఎటువంటి విష పదార్థం కనుగొనలేదని ఇండియన్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఏయిమ్స్‌) పేర్కొంది. సోమవారం సుశాంత్‌ పోస్టుమార్టం రిపోర్టు మరోసారి పరిశీలించిన ఏయిమ్స్‌ బృందం తాజాగా తన నివేదనిక సీబీఐకి అందించింది. సుశాంత్ మృతికి ఉరివేసుకోవడమే కారణమని ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. సుశాంత్ డీఎన్ఏను పరిశీలించిన తర్వాతే ఈ నివేదికను సమర్పించామని.. దీనిలో ఎలాంటి సందేహాలు లేవని పేర్కొన్నారు.

గతంలో మహారాష్ట్ర వైద్యుల నివేదికలో తేలిన విషయాలే తమ పరిశీలనలో కూడా తేలాయని సుశాంత్ ఉరివేసుకొని చనిపోయాడని తేల్చారు. మానసిక ఒత్తిడి కారణంగానే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని వైద్యులు భావిస్తున్నారు.

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14న తన ఇంటిలో సూసైడ్‌ చేసుకున్నాడు. అయితే మొదట ఆత్మహత్యే అని అనుకున్నా ఆ తరువాత అనుమానాస్పద మృతి కేసుగా పోలీసులు నమోదు చేసుకొని పలువురిని విచారించారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కేసును సీబీఐ విచారణ చేస్తోంది.

మరోవైపు కూపర్‌ ఆసుపత్రికి క్లీన్‌చిట్‌ ఇంకా ఇవ్వలేదు. ఆ హాస్పిటల్‌ పోస్టుమార్టం నివేదికను పరిశీలించాల్సి ఉందని, తుది నివేదిక కోసం చట్టపరమైన విధానాలను చూడాల్సి ఉందని వైద్య బృందం చైర్మన్‌ డాక్టర్‌ సుదీర్‌గుప్తా అన్నారు. అయితే సుశాంత్ గొంతు నులమడం వల్లనే మరణించాడని సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ నివేదిక సుశాంత్ ది ఆత్మహత్య అని కన్ఫం చేసింది.