Begin typing your search above and press return to search.

ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌ను గ‌దిలో బంధించిన చిలిపి హీరోలు

By:  Tupaki Desk   |   21 April 2021 2:30 AM GMT
ఆ ఇద్ద‌రు హీరోయిన్ల‌ను గ‌దిలో బంధించిన చిలిపి హీరోలు
X
ఇద్ద‌రు హీరోయిన్ల మ‌ధ్య మాట‌ల్లేన‌ప్పుడు క‌నీస ప‌ల‌క‌రింపులు అయినా లేన‌ప్పుడు ఆ ఇద్ద‌రినీ ఒకే గ‌దిలో బంధించాల‌న్న చిలిపి ఆలోచ‌న వ‌స్తే .. అది మైండ్ బ్లాక్ ఐడియానే. క్లాసిక్ డేస్ లో అలాంటి ఆలోచ‌నే చేశారు ఆ ఇద్ద‌రు హీరోలు. ఈగోల గోల లేక‌పోయినా పోటీ ప్ర‌పంచంలో ఒక‌రంటే ఒక‌రికి స‌రిప‌డ‌ని స‌న్నివేశంలో అస్స‌లు మాట‌ల్లేని ఓ ఇద్ద‌రు టాప్ హీరోయిన్లను ఒకే గ‌దిలో బంధించార‌ట ఆ ఇద్ద‌రు చిలిపి హీరోలు. ఇంత‌కీ ఈ ఎపిసోడ్ లో హీరోయిన్లు ఎవ‌రు? అంటే.. శ్రీ‌దేవి- జ‌య‌ప్ర‌ద‌. ఆ ఇద్ద‌రు హీరోలు ఎవ‌రు అంటే జితేంద్ర‌- రాజేష్ ఖ‌న్నా.

ఇటీవ‌ల ఇండియ‌న్ ఐడ‌ల్ 12 కార్య‌క్ర‌మంలో నాటి సంఘటనను గుర్తుచేసుకున్న జ‌య‌ప్ర‌ద ఇప్పుడు అందుకు ఎంతో బాధ‌ప‌డుతున్నాన‌ని అన్నారు. కాంపిటీట‌ర్ అయిన శ్రీ‌దేవితో ఎక్కువ‌గా మాట్లాడ‌నందుకు ఎంతో బాధ‌గా ఉంద‌ని త‌న పోటీదారు ఇహ‌లోకంలో లేక‌పోవ‌డంతో తాను ఒంట‌రిన‌య్యాన‌ని జ‌య‌ప్ర‌ద ఎమోష‌న్ కి గుర‌య్యారు.

1984లో ఆ ఇద్దరు హీరోయిన్లు రాజేష్ ఖన్నా-జీతేంద్రలతో కలిసి మక్సాద్ చిత్రం షూటింగ్ లో ఉన్నారు. శ్రీదేవి - జయప్ర‌ద ఒకరితో ఒకరు మాట్లాడరని గ్రహించిన స‌ద‌రు హీరోలు ఆట‌ప‌ట్టించేందుకు ఒక ప్రణాళికను రూపొందించారు. ముందే ప్లాన్ చేసిన‌ట్టే గ‌దిలో బంధించారు.

నిజానికి ఒక‌రిపై ఒక‌రికి వ్య‌క్తిగ‌త ప‌గ ఉండ‌క‌పోయినా త‌మ మ‌ధ్య దేనిలోనూ కుద‌ర‌లేద‌ని జ‌య‌ప్ర‌ద తెలిపారు. పోటీలో ఉండ‌డం వ‌ల్ల ఒక‌రితో ఒక‌రికి పొస‌గ‌లేద‌ని ఎంపిక చేసుకునే దుస్తులు నృత్యం దేనిలోనూ త‌మ మ‌ధ్య పోలిక లేద‌ని జ‌య‌ప్ర‌ద అన్నారు. మేము కలిసిన ప్రతిసారీ సెట్లో ఒకరికొకరు నమస్తే అని చెప్పి ముందుకు వెళ్లేవాళ్లం అని జయ గుర్తు చేసుకున్నారు. మక్సాద్ షూటింగ్ సమయంలో జీతూజీ - రాజేష్ జీ మమ్మల్ని ఒక గంట పాటు మేకప్ గదిలో బంధించారు. కానీ మేమిద్దరం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ త‌ర్వాత మ‌మ్మ‌ల్ని హీరోలు ఆడుకున్నారు.. అని జ‌య‌ప్ర‌ద తెలిపారు.

2018 లో కన్నుమూసిన శ్రీదేవిని మిస్స‌య్యారా? అంటే... తనతో తగినంతగా మాట్లాడకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. నేడు ఆమె ఇక్కడ లేనందున నేను చాలా మిస్స‌య్యాను. ఆమె బాలీవుడ్ లో గొప్ప పోటీదారు కాబ‌ట్టి నేను ఒంటరిగా ఉన్నాను. ఈ వేదిక ద్వారా ఎక్కడో ఉన్న త‌ను నా మాట వింటుంద‌నే అనుకుంటున్నా.. అని అన్నారు. మేము ఒకరితో ఒకరు మాట్లాడాలని కోరుకుంటున్నాను అని ఎమోష‌న్ కి గుర‌య్యారు. టీవీలో త‌న‌ని ల‌క్ష‌లాది మంది శ్రీ‌దేవి అభిమానులు వీక్షిస్తుండ‌గా.. జ‌య‌ప్ర‌ద జీవితంలోనే మ‌ర‌పురాని గ్రేట్ మూవ్ మెంట్ ఇది అన‌డంలో ఎలాంటి సందేహం అవ‌స‌రం లేదు.