Begin typing your search above and press return to search.

2022లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలు ఇవే..!

By:  Tupaki Desk   |   15 May 2022 3:30 AM GMT
2022లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలు ఇవే..!
X
కరోనా పాండమిక్ తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమ తిరిగి పుంజుకుంది. జనాల్లో వైరస్ భయం పోయి ఎప్పటిలాగే థియేటర్లకు వస్తుండటంతో.. పాన్ ఇండియా సినిమాలు - భారీ బడ్జెట్ చిత్రాలన్నింటినీ ఒక్కటొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అందులో కొన్ని బ్లాక్ బస్టర్స్ గా నిలిస్తే.. మరికొన్ని డిజాస్టర్స్ గా మిగిలాయి. 2022లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

1. 'కేజీయఫ్: చాప్టర్-2' : కన్నడ హీరో యష్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ ఇది. పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించిన 'కేజీఎఫ్' చిత్రానికి సీక్వెల్. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.

ఇప్పటికే 'కేజీఎఫ్ 2' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని ఈ ఏడాది టాప్ గ్రాసర్ గా నిలిచింది. అంతేకాదు వరల్డ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన మూడో భారతీయ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక బాలీవుడ్ లో ఈ చిత్రం రూ. 420 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. లాంగ్ రన్ లో ఈ మూవీ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

2. 'ఆర్.ఆర్.ఆర్' : దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. మార్చి 25న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మల్టీస్టారర్.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి, సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకుంది.

RRR మూవీ వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. 1132 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో ఇండియన్ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. త్వరలో చైనా - జపాన్ వంటి పలు దేశాల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. లైఫ్ రన్ ముగిసే నాటికి ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.

3. 'ది కాశ్మీర్ ఫైల్స్' : వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన సినిమా ఇది. మార్చి 11న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ఎవరూ ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన ఈ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా 340 కోట్లకు పైగా కలెక్షన్స్ తో ఈ ఏడాది టాప్ 3 గ్రాసర్ గా నిలిచింది. ఇటీవల కాలంలో అత్యధిక వసూళ్ళు సాధించిన హిందీ మూవీ కూడా ఇదే.

4. 'బీస్ట్' : తమిళ హీరో తలపతి విజయ్ - పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా ఇది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హోస్టెజ్ యాక్షన్ థ్రిల్లర్ ను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిథి మారన్ నిర్మించారు. ఏప్రిల్ 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ లాంగ్ రన్ లో రూ. 250 కోట్ల క్లబ్ లో చేరి ఈ ఏడాది హయ్యెస్ట్ గ్రాసర్ సినిమాల లిస్టులో నాలుగో స్థానంలో నిలిచింది.

5. 'గంగూబాయి కతియావాడి' : పాపులర్ డైరెక్టర్ సంజయ్ లీలా భనాల్సీ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమిది. ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి జీవితకథ ఆధారంగా రూపొందింది. కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ఫిబ్రవరి 25న విడుదలైంది. జయంతి లాల్ గడ తో కలిసి బన్సాలీ నిర్మించిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్ గా 190 కోట్ల వరకూ రాబట్టిందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది 175 - 180 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా కావడంతో నిర్మాతలకు మిగిలిందేమీ లేదు.