Begin typing your search above and press return to search.

థియేట‌ర్ల‌లో మాత్ర‌మే రిలీజ్ చేయాల్సిన సినిమా

By:  Tupaki Desk   |   15 Sep 2021 5:30 AM GMT
థియేట‌ర్ల‌లో మాత్ర‌మే రిలీజ్ చేయాల్సిన సినిమా
X
డార్లింగ్ ప్ర‌భాస్ - సైఫ్ అలీఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న చిత్రం ఆదిపురుష్ 3డి. తానాజీ 3డి ఫేం ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా న‌టిస్తుండ‌గా.. కృతి స‌నోన్ సీత‌గా న‌టిస్తోంది. ల‌క్ష్మ‌ణుడిగా స‌న్నీసింగ్.. రావ‌ణుడిగా సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందించ‌నున్నారు. 2022లోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తారా లేదా ఓటీటీలో రిలీజ్ చేస్తారా? ప్ర‌స్తుత ప‌రిస్థితిలో టీసిరీస్ స‌హా నిర్మాత‌ల ఆలోచ‌న ఎలా ఉంది? అన్న‌దానికి స‌రైన ఆన్స‌ర్ లేదు ఇంత‌కాలం.

తాజాగా ఓ స‌మావేశంలో సైఫ్ కి ఇదే ప్ర‌శ్న ఎదురైంది. దీనికి అత‌డు ఆన్స‌ర్ ఇచ్చారు. ఈ భారీ చిత్రాన్ని OTT లో విడుదల చేయలేమని సైఫ్ ఖాన్ చెప్పారు. ఆదిపురుష్ 3డిని అత్యంత‌ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నార‌ని ఓటీటీలో విడుదల చేసే ఉద్దేశం ద‌ర్శ‌క‌నిర్మాత‌ ఓం రౌత్ కు లేదని అన్నారు. ``ఆదిపురుష్ అద్భుత‌మైన విజువల్ ఎఫెక్ట్స్ .. అసాధార‌ణ ప‌నిత‌నం కలిగి ఉన్న పెద్ద మూవీ. ఈ చిత్రం థియేటర్లలో తప్ప ఎక్కడా విడుదల చేయలేరు. మేకర్స్ దానిపై చాలా ఆలోచించాల్సి ఉంటుంది. సినిమా థియేటర్లు పూర్తిగా పనిచేసే వరకు ఆగాల్సిందే`` అని సైఫ్ ఖాన్ పున‌రుద్ఘాటించారు.

ఓం రౌత్ పై ప్రశంసల వర్షం కురిపించిన‌ సైఫ్ అతడిని గొప్ప ప‌నిమంతుడిగా అభివ‌ర్ణించారు. మొఘల్-ఇ-అజామ్ ఫేమ్ కె ఆసిఫ్ తో ఓంరౌత్ ని పోల్చాడు. ఓం రౌత్ కె ఆసిఫ్ పునర్జన్మ. అతను కనిపించని చ‌రిత్ర‌ను విజువ‌లైజ్ చేసి ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఆదిపురుష్ గొప్ప అంశాలతో విలక్షణమైనది. దర్శక రచయిత .. మొత్తం సృజనాత్మక సంస్థ గొప్ప ప‌ని చేస్తోంది. ఈ సినిమాకి పనిచేసిన వారిలో అంద‌రూ ఉన్నత విద్యావంతులే అయినందున అతను ఆదిపురుష్ గురించి కనీసం ఆందోళన చెందలేదు`` అని వివ‌ర‌ణ ఇచ్చారు.

ఓంరౌత్ తెర‌కెక్కించిన ప్రారంభ చిత్రం తానాజీ 3డి అద్భుత విజ‌యం సాధించింది. వీఎఫ్ ఎక్స్ బేస్డ్ లో అసాధార‌ణ ప‌నితనంతో మెస్మ‌రైజ్ చేసిన ఘ‌నుడు ఓంరౌత్. అందుకే అత‌డికి వెంట‌నే ప్ర‌భాస్ ఆఫ‌ర్ ఇచ్చారు. ఈ సినిమాకి ఎంచుకున్న క్యాస్టింగ్ కానీ సాంకేతిక నిపుణులు కానీ అసాధార‌ణ ప‌నిమంతులు. అవ‌తార్ సాంకేతిక నిపుణుల‌ను ఈ మూవీకోసం ఉప‌యోగిస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.

ప్ర‌భాస్.. సైఫ్ సాహసాలు అన్నీ ఇన్నీ కావు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ `ఆదిపురుష్ 3డి` బాలీవుడ్ ఎంట్రీ మూవీ కానుంది. తెలుగు..హిందీ భాష‌ల్లో చిత్రాన్ని తెర‌కెక్కించి ఇత‌ర‌ అన్ని ద‌క్షిణాది భాష‌ల్లో అనువాద రూపంలో రిలీజ్ చేస్తారు. ఇతిహాసం `రామాయాణం` ఆధారంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్ర‌భాస్ ఆదిపురుష్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ లంకేష్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

మిగ‌తా న‌టుల్ని ప‌క్క‌న‌బెడితే ప్ర‌భాస్.. సైఫ్ మ‌ధ్య కీల‌క స‌న్నివేశాల కోస‌మే బోలెడంత రిస్క్ చేయాల్సి ఉంది. ప్ర‌భాస్.. సైఫ్ అన‌గానే పాన్ ఇండియా స్టార్ డ‌మ్ బాక్సాఫీస్ వ‌సూళ్ల‌పై ఒక న‌మ్మ‌కం. జాతీయ స్థాయిలో వారికి ఉన్న గుర్తింపు సినిమాకు ప్ల‌స్ కానుంది. ఇప్ప‌టికే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌భాస్ 60 రోజుల పాటు రాముడు గెట‌ప్ లోనే చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నార‌ని క‌థనాలు రాగా సైఫ్ పాత్ర‌కు ఇంచుమించు అంతే శ్ర‌మ ఉండ‌నుంది. రామాయణాన్ని ర‌చించిన వాల్మికి రాముడి పాత్ర‌కు రావ‌ణుడి పాత్ర‌కు రామాయ‌ణంలో ఇచ్చిన ప్రాముఖ్య‌త అలాంటింది . ర‌చ‌న మొద‌లైన‌ ద‌గ్గ‌ర నుంచి చివ‌రి వ‌ర‌కూ రామ‌నామ స్మ‌ర‌ణ చేస్తూ వాల్మీకి ఈ క‌థ‌నాన్ని పూర్తి చేశారు. ప్ర‌తీ పేజీలోనూ రాముడి ఔన్న‌త్యం క‌నిపిస్తుంది. అంటే సినిమాలో ప్ర‌భాస్ పాత్ర ఎంత కీల‌కంగా ఉండ‌బోతుండ‌గా.. లంకేయుడిగా సైఫ్ పాత్ర స‌మ‌తూగుతుంది.

రాముడిలోని సెన్సిబుల్ అంశాల‌తో పాటు.. యుద్ద విన్యాసాల్లో రాముడి శౌర్యాన్ని లంకేయుని అసాధార‌ణ మాయా పాఠ‌వాన్ని తెర‌పై అదే స్థాయిలో హైలైట్ చేయ‌బోతున్నారని తెలుస్తోంది. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. చిత్రీక‌ర‌ణ కొన్ని నెల‌లు పాటు సాగ‌నుంది. అన్ని ప‌నులు పూర్తిచేసి 2022 ఆగ‌స్ట్ 14న రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు.