Begin typing your search above and press return to search.

'ఆకాశవాణి': టీజర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన జక్కన్న శిష్యుడు..!

By:  Tupaki Desk   |   5 March 2021 2:42 PM GMT
ఆకాశవాణి: టీజర్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన జక్కన్న శిష్యుడు..!
X
దర్శకధీరుడు రాజమౌళి వద్ధ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ''ఆకాశవాణి''. విల‌క్షణ న‌టుడు సముద్రఖని‌ - విన‌య్ వ‌ర్మ - తేజ కాకుమాను - ప్రశాంత్ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎ.పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాజమౌళి 'ఆకాశవాణి' సినిమా టీజర్ ‏ను విడుదల చేశాడు. ''అశ్విన్ డెబ్యూ మూవీ 'ఆకాశవాణి'తో సృష్టించిన ఇటువంటి ఫ్రెష్ విజువల్స్ మరియు గ్రూవి సౌండ్ చూడటానికి నేను సంతోషిస్తున్నాను!'' అని రాజమౌళి ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

'ఆకాశవాణి' టీజర్ ప్రారంభం నుంచి డైలాగ్స్ లేకుండా.. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ‏తోనే నడిచింది. అడవిలో జీవించే ఆదివాసీలు, కళ్లాకపటం తెలియని పిల్లలు, రాత్రివేళ కాగడలతో అన్వేషణ, అందరూ దేన్నో చూసి భ‌య‌భ్రాంతులకు గురవుతుండటం వంటి అంశాలను ఈ టీజర్ లో చూపించారు. 'ఇక్కడేదో తప్పు జరుగుతుంది శీను' అంటూ సముద్రఖని చెప్పే డైలాగ్ తో టీజర్ ని ఎండ్ చేశారు. ఇందులో మర్రి ఊడలను పట్టుకుని వేలాడుతున్న బాలుడు.. ఎదురుగా మరో ఊడకు వేలాడుతున్న రేడియో మంచి అనుభూతిని కలిగిస్తున్నాయి. దీనికి ఎం.ఎం కీరవాణి తనయుడు కాలభైరవ సమకూర్చిన నేపథ్య సంగీతం.. సురేశ్ ర‌గుతు సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. ప్రముఖ ర‌చ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందించిన ఈ చిత్రానికి శ్రీక‌ర్ ప్రసాద్ ఎడిట‌ర్‌ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న 'ఆకాశవాణి' చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.