Begin typing your search above and press return to search.

తమిళ 'మహర్షి' ఉన్నట్లా? లేనట్లా?

By:  Tupaki Desk   |   28 July 2021 6:59 AM GMT
తమిళ మహర్షి ఉన్నట్లా? లేనట్లా?
X
తమిళ హీరోలు మరియు దర్శకులు టాలీవుడ్‌ కు క్యూ కడుతున్నారు. తెలుగు సినిమా అంటే పాన్‌ ఇండియా గుర్తింపు ఉంటుంది అనే ఉద్దేశ్యంతోనో లేదా మరేదైనా కారణమో కాని ఇప్పటికే శంకర్ తెలుగు లో చరణ్ తో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల ఒక పాన్ ఇండియా సినిమాను చేయబోతున్నాడు. తమిళ స్టార్‌ సూర్య కూడా ఒక తెలుగు సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. కార్తీ మరియు ఇంకా ఇద్దరు ముగ్గురు హీరోలు కూడా టాలీవుడ్‌ సినిమాలకు ఓకే చెప్పారు.

దర్శకుల్లో శంకర్‌ మాత్రమే కాకుండా లింగు స్వామి ఇంకా కొందరు కూడా తెలుగు సినిమాలను చేస్తున్నారు. ఇక తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా దిల్‌ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కబోతుంది అంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దర్శకుడు ఇప్పటికే రెండు మూడు సార్లు విజయ్‌ తో కథా చర్చలు జరిపారనే సమాచారం కూడా అందుతోంది. ఈ ఏడాదిలోనే వీరి కాంబో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని అంతా భావిస్తున్న సమయంలో అనూహ్యంగా సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వీరి కాంబో సినిమా కంటే వెనుక ప్రకటన వచ్చిన సినిమాలు కార్యరూపం దాల్చుతున్నాయి.

మెల్ల మెల్లగా షూటింగ్‌ లు జరుగుతున్నాయి. ఈ సమయంలో వీరి కాంబో సినిమా గురించి ఇప్పటి వరకు కనీసం అధికారిక ప్రకటన కూడా రాలేదు. దాంతో వంశీ పైడిపల్లి ఇంకా ఎన్నాళ్లు వెయిట్ చేయాలంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల వంశీ పైడిపల్లి పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఆ సమయంలో విజయ్ తో సినిమా అంటూ అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. దిల్‌ రాజు నుండి విజయ్ మూవీ కి సంబంధించిన బర్త్‌ డే పోస్టర్ వంశీ పైడిపల్లి బర్త్‌ డే సందర్బంగా విడుదల అవుతుందని భావించిన వారిని నిరాశ తప్పలేదు.

మహేష్‌ బాబుతో రెండేళ్ల క్రితమే సినిమా అనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్‌ అయ్యింది. దాంతో వంశీ పైడిపల్లి సినిమాల కోసం అభిమానులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నారు. 2019 ఆరంభంలో వచ్చిన మహర్షి సినిమా తర్వాత వంశీ పైడిపల్లి ఇప్పటి వరకు తన తదుపరి సినిమా ను అధికారికంగా ప్రకటించలేదు. మహర్షి తర్వాత మహేష్‌ బాబుతోనే ఒక భారీ మాఫియా సినిమా ను వంశీ పైడిపల్లి చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇద్దరి మద్య మంచి స్నేహం ఉన్నా కూడా ఆ సినిమా ఏదో కారణం వల్ల క్యాన్సిల్‌ అయ్యింది.

ఆ తర్వాత రామ్‌ చరణ్‌ ను కలిసిన వంశీపైడిపల్లి సినిమాను చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని అది కూడా నిజం కాదని తేలిపోయింది. అలాంటి సమయంలో స్వయంగా వంశీ పైడిపల్లి మాట్లాడుతూ తాను తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా ఒక భారీ పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

దిల్‌ రాజు ఏకంగా వంద కోట్ల ఆఫర్‌ ను విజయ్ కు ఇవ్వడం.. ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పడం జరిగిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు సినిమా గురించి ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. విజయ్‌ లేదా వంశీల పుట్టిన రోజు సందర్బంగా ఎలాంటి పోస్టర్‌ లు ఇవ్వక పోవడంతో అసలు సినిమా ఉందా లేదా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

దిల్ రాజు ఆఫీస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కరోనా వల్ల కాస్త ఆలస్యం అవుతున్నాయి. కనుక వంశీ పైడిపల్లితో చేయబోతున్న సినిమాకు డేట్లను ఆయన ఇచ్చేందుకు కాస్త ఎక్కువ సమయం పట్టేలా ఉంది. అందుకే సినిమా గురించి ఎలాంటి ప్రకటనలు అధికారికంగా చేయడం లేదని వారు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు.