Begin typing your search above and press return to search.

రాజకీయాల ఆధారంగా సినిమాలను టార్గెట్ చేస్తున్నారు..!

By:  Tupaki Desk   |   17 May 2022 3:05 AM GMT
రాజకీయాల ఆధారంగా సినిమాలను టార్గెట్ చేస్తున్నారు..!
X
స్టార్ హీరోల సినిమాల రిలీజులప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ అనేవి కామన్ గా జరిగేవే. సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గర నుంచి.. ప్రీమియర్ షోలు మరియు ఫస్ట్ డే టాక్.. రివ్యూలు.. ఓపెనింగ్ కలెక్షన్స్ వరకూ.. ప్రతీ దాని మీద నెట్టింట ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకుంటూ గొడవకు దిగుతుండటం మనం చూస్తుంటాం. ఇప్పుడు లేటెస్టుగా 'సర్కారు వారి పాట' విషయంలోనూ అదే జరిగింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు - కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. మే 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మొదటి షో పడకముందు నుంచే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

యూఎస్ఏలో ప్రీమియర్ షోలు పడకముందే ఏకంగా 'డిజాస్టర్SVP' అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ చేశారు. సినిమా చూడకుండానే యాంటీ ఫ్యాన్స్ ఇలా చాలా వ్యతిరేకంగా ప్రచారం చేశారు. సినిమా అస్సాం అంటూ మీమ్స్ పోస్ట్ చేస్తూ ట్రోల్ చేశారు. ఈ ట్రెండ్ లో 95K పైగా ట్వీట్స్ ఉన్నాయంటే.. ఎంతగా టార్గెట్ చేసారనేది అర్థం అవుతుంది. కాకపోతే సినిమా మీద ఎంత నెగిటివిటీ ప్రచారం చేసినా.. అది వసూళ్లపై ప్రభావం చూపలేదని తెలుస్తోంది.

అయితే రాజకీయాల కారణంగానే సోషల్ మీడియాలో సినిమాలను టార్గెట్ చేస్తున్నారని సీనియర్ సినీ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ చిత్రాలను వైసీపీ ప్రభుత్వం మరియు ఆ పార్టీ అభిమానులు టార్గెట్ చేసారని అన్నారు. ఇప్పుడు 'సర్కారు వారి పాట' సినిమాలో 'నేను ఉన్నాను.. నేను ఉన్నాను' అనే డైలాగ్ ఉండటం వల్ల వైసీపీ వ్యతిరేకులు దీనిపై నెగిటివ్ ప్రచారం చేశారని అభిప్రాయ పడ్డారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి మరియు జగన్ ల నోటి నుంచి వచ్చిన మాటను సినిమాలో మహేశ్ చేత చెప్పించడం వల్ల దర్శకుడు పరశురాం తాను వైయస్సార్ అభిమానిని అని బహిరంగంగా ఒప్పుకున్నట్లు అయిందని.. దీంతో SVP చిత్రాన్ని టీడీపీ మరియు జనసేన సానుభూతిపరులు టార్గెట్ చేసి నెగిటివ్ ట్వీట్లు పెట్టారని విశ్లేషించారు. ఫిలిం మేకర్స్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటే ఇలాంటి పరిస్థితులు రావని సూచిస్తున్నారు.

సినీ ఇండస్ట్రీకి రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. నందమూరి తారకరామారావు దగ్గర నుంచి ఇప్పటి బాలకృష్ణ - రోజా వరకూ చాలా మంది పాలిటిక్స్ లో ఉన్నారు. ఎంతోమంది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. రాజకీయ నాయకులు నిర్మాతలుగా మారి చిత్ర పరిశ్రమలో పెట్టుబడి పెట్టడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. కాబట్టి సినిమాలను రాజకీయాలను వేరు చేయడం సాధ్యం కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇక 'సర్కారు వారి పాట' విషయానికొస్తే.. మిశ్రమ స్పందనతోనూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతోంది. ఈ నేపథ్యంలో నెగిటివిటీని స్ప్రెడ్ చేసినవారికి కౌంటర్ గా నిర్మాతలు ట్వీట్ కూడా చేసారు. ''SVP షోలు ఇంకా పడకముందే నెగెటివ్ ట్రెండ్స్‌ - మీమ్స్ - ట్రోల్స్ చేశారు.. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు బ్లాక్ బస్టర్ అనే స్థాయికి సినిమా వచ్చింది.. షోలన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి.. సూపర్ స్టార్ స్వాగ్ సీజన్‌ ను ఎంజాయ్ చేయండి.. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్'' అని మేకర్స్ పేర్కొన్నారు.