Begin typing your search above and press return to search.

పొలిటికల్ ఎంట్రీ గురించి చరణ్ తో చర్చించిన తారక్..?

By:  Tupaki Desk   |   2 Aug 2021 4:30 PM GMT
పొలిటికల్ ఎంట్రీ గురించి చరణ్ తో చర్చించిన తారక్..?
X
నందమూరి తారకరామారావు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ రాణిస్తారని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ ని ఈ దారుణమైన స్థితి నుంచి బయట పడేయడానికి జూనియర్ రావాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు - లోకేష్ సభల్లో ఫ్యూచర్ సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయడమే కాకుండా ఫ్లెక్సీలు కూడా కడుతున్నారు. తారక్ మాత్రం పొలిటికల్ రీఎంట్రీ పై ఎక్కడా స్పందించలేదు. అయితే హీరో రామ్ చరణ్ వల్ల ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి మళ్ళీ చర్చలు జరుగుతున్నాయి.

''ఎవరు మీలో కోటీశ్వరుడు'' గేమ్ షో ద్వారా ఎన్టీఆర్ మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. 'కౌన్ బనేగా కరోడ్ పతి' గేమ్ షో తరహాలో ఉండే ఈ ప్రోగ్రామ్ లో అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పిన కంటెస్టెంట్ కి కోటి రూపాయలు ఇవ్వనున్నారు. RRR కో స్టార్ రామ్ చరణ్ గెస్టుగా ఎన్టీఆర్ హోస్టింగ్ లో ఇప్పటికే ఓ స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. ఇందులో తారక్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పిన చరణ్.. 25 లక్షల దాకా గెలుచుకున్న విషయం బయటకు వచ్చింది. అయితే సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ లో ఓ సందర్భంలో రాజకీయ పునః ప్రవేశం గురించి ఎన్టీఆర్ ను చరణ్ అడిగారట.

ఓ ప్రశ్న గురించి డిస్కష్ చేస్తున్న సందర్భంలో 'నువ్వు కూడా రాజకీయాల్లోకి వెళ్తున్నావంట కదా? అని ఎన్టీఆర్ ను చరణ్ నవ్వుతూ ప్రశ్నించాడట. దీనిపై నందమూరి వారసుడు స్పందిస్తూ.. పొలిటికల్ ఎంట్రీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడట. అయితే దీన్ని ఎడిటింగ్ లో తొలగించాలని నిర్వాహకులకు ఎన్టీఆర్ ఆదేశాలిచ్చారట. అంటే తారక్ ఏమి చెప్పాడో చరణ్ కు అక్కడున్న వారికి తప్ప ఆడియన్స్ కి తెలిసే అవకాశం లేదన్నమాట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించే చర్చలు జరుగుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెమినీ టీవీలో 'ఎవరు మీలో కోటీశ్వరుడు' కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఇదిలా ఉండగా తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ ఎన్నిక‌ల్లో ప్రచారం కూడా చేశారు. అయితే ఆ తర్వాత నుంచి ఎందుకో టీడీపీ అధిష్టానం తారక్ ను పార్టీ వ్యవహారాలకు దూరం పెడుతూ వచ్చింది. తారక్ రాజకీయాల్లోకి వస్తే లోకేష్ కి కాంపిటీషన్ వస్తాడని.. నారా వారసుడికి ఇబ్బందులు తలెత్తుతాయని చంద్రబాబు - బాలయ్య కావాలనే అతన్ని పార్టీకి దూరం పెట్టారని కొందరు అభిమానులే కామెంట్స్ చేస్తుంటారు. బాలకృష్ణ సైతం ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. జూ.ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ప్లస్ అవ్వచ్చు. మైనస్ అవ్వచ్చు. ప్లస్ అయ్యి మైనస్ అవ్వొచ్చు. మైనస్ అయ్యి ప్లస్ అవ్వొచ్చు అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి తారక్ పార్టీలో యాక్టీవ్ గా ఉండటం బాలకృష్ణ కు ఇష్టం లేదనేది స్పష్టం అయింది.

ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన స్థితిలో ఉన్న టీడీపీ ని.. చిన్న ఎన్టీఆర్ ఒక్కడే గట్టెక్కించగలదని మెజారిటీ ఫ్యాన్స్, కార్యకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన తెలుగు దేశం పార్టీ.. తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగయ్యే పరిస్థితులు వచ్చాయనేది ఎక్కువ మంది అభిప్రాయం. అందుకే ఎన్టీఆర్ పార్టీలో కీలకంగా వ్యవహరించాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి. మరి నందమూరి వారసుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటురో చూడాలి.