Begin typing your search above and press return to search.

బాలయ్య విషయంలో ఇండస్ట్రీ పెద్దలు చేసిన మిస్టేక్ ని కవర్ చేసుకుంటున్నారా...?

By:  Tupaki Desk   |   30 May 2020 3:30 AM GMT
బాలయ్య విషయంలో ఇండస్ట్రీ పెద్దలు చేసిన మిస్టేక్ ని కవర్ చేసుకుంటున్నారా...?
X
సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని షూటింగ్‌ లు ప్రారంభించాలి.. థియేటర్లు మళ్లీ ఎలా ఓపెన్‌ చేయాలి.. తదితర విషయాల గురించి తెలంగాణ ప్రభుత్వంతో పలువురు సినీ ప్రముఖులు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి హీరో నందమూరి బాలకృష్ణ వద్ద మీడియా ప్రస్తావించగా ''ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయట. నాకు దాని గురించి మీడియా ద్వారా పత్రికల ద్వారా విషయం తెలిసింది'' అన్నారు. అనంతరం బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ లో మాట్లాడిన బాలయ్య ''చాలా మీటింగులు జరిగాయి. నన్ను ఎవ్వరూ పిలవలేదు. ఎవరు పిలిచారు నన్ను.. వీళ్లందరూ ఏమైనా భూములు పంచుకుంటున్నారా... శ్రీనివాస్‌ యాదవ్‌ తో కూర్చుని. నన్ను ఒక్కడూ పిలవలేదు'' అన్నారు. ఇప్పుడు బాలయ్య వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే బాలయ్య కామెంట్స్ పై పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు స్పందిస్తూ వస్తున్నారు. అయితే వీరందరూ ఒకరి కామెంట్స్ కి ఒకరు సంభందం లేకుండా పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

ముందుగా ఈ ఇష్యూ పై మాట్లాడిన సి. కళ్యాణ్ ''గత కొన్ని రోజులుగా చిత్రసీమలో జరుగుతున్న పరిణామాలను బాలకృష్ణ దృష్టికి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నానని.. చిరంజీవి గారి ఫేస్ వ్యాల్యూ పనికొస్తుందని ఆయనను మేం అడిగాం. అలాగే నాగార్జున గారు కూడా ముందుకు వచ్చారు. మీకు అవసరమైతే చెప్పండి నేను వస్తాను అని బాలకృష్ణ గారు అన్నారు. ఎక్కడికి ఎవరు అవసరమైతే వాళ్లను తీసుకెళ్తాం. ఎవరితో పని జరుగుతుందంటే వాళ్లను తీసుకెళ్తాం. బాలయ్య గారు వస్తానంటే ఎవరైనా కాదంటారా..? అయినా ఇది ఆర్టిస్టులను పిలిచే మీటింగ్ కాదు. నిర్మాతల సమావేశమని.. చిరంజీవి తన సినిమా షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వమని అడగడానికి లీడ్ తీసుకున్నారు'' అని చెప్పుకొచ్చారు. అయితే సి. కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో ఒకదానికొకటి పొంతనలేదనేది నెటిజన్ల వాదన. బాలయ్య నిర్మాత కాకపోతే 'ఎన్.బీ.కే ఫిలిమ్స్' స్థాపించి సినిమాలు నిర్మించింది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా నాగబాబు స్పందిస్తూ ''బాలయ్య కింగేమీ కాదు జస్ట్ హీరో మాత్రమే.. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది.. మీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎవరూ చూస్తూ ఊరుకోరు'' అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై నందమూరి ఫ్యాన్స్ కూడా నాగబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బాలయ్య అసహనం వ్యక్తం చేసింది ఇండస్ట్రీ పెద్దలు ప్రైవేట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని తనని పిలవలేదని.. కానీ నాగబాబు ఎందుకు ఇలా రియాక్టయ్యాడని నందమూరి ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

అంతేకాకుండా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ బాలయ్య లేకుండా ఇండస్ట్రీ లేదంటూనే.. అందరినీ బొట్టు పెట్టి పిలవాలా అని.. అలానే అవసరం అనుకున్నవారిని పిలుస్తారు లేకపోతే లేదు అంటూ పరస్పర విరుద్ధ స్టేట్మెంట్స్ ఇచ్చాడని వారు కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో అసలు ఫిలిం ఛాంబర్ లో పెట్టాల్సిన మీటింగ్ ఒక హీరో ఇంట్లో పెట్టడమేంటని.. ఇండస్ట్రీ వ్యవహారాలు చూసుకునే 'మా' అధ్యక్షుడిని మీటింగ్ కి ఎందుకు పిలవలేదు.. కొందరిని మాత్రమే ఎందుకు పిలవాల్సి వచ్చింది అని ప్రశ్నిస్తే ఎవరూ సమాధానం చెప్పడం లేదని.. ఇలా ఎవరికి వారు విరుద్ధ స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారని.. ఇవన్నీ కేవలం ఇండస్ట్రీ పెద్దలు చేసిన మిస్టేక్ ని కవర్ చేసుకోడానికేనా.. ఇంకేమైనా కారణం ఉందా.. అని నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. మరి రాబోయే రోజుల్లో వీరి ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయేమో చూడాలి.