Begin typing your search above and press return to search.

సుశాంత్ అస్థికలు నిమజ్జనం చేసిన కుటుంబ సభ్యులు..!

By:  Tupaki Desk   |   18 Jun 2020 11:10 AM GMT
సుశాంత్ అస్థికలు నిమజ్జనం చేసిన కుటుంబ సభ్యులు..!
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎంతో భవిష్యత్ ఉన్న టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సుశాంత్ మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అశ్రు నయనాల మధ్య ముంబైలో సుశాంత్ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా కుటుంబ సభ్యులు నిన్న సుశాంత్ అస్థికలను నిమజ్జనం చేయడానికి స్వస్థలం పాట్నాకు చేరుకొన్నారు. ఈ సందర్భంగా సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ కృతి ఫేస్‌ బుక్‌ లో పోస్ట్ పెట్టింది. ''మా ప్రియమైన సోదరుడు భౌతికంగా మనతో లేరనే విషయం నాకు బాధగా ఉంది. నీ మనసులో బాధ ఉందనే విషయం తెలుసు. నీవు వాటిని ఎదురించే ఫైటర్ అని తెలుసు. నీకు ఎదురైన సంఘటనలను సమర్ధంగా ఎదురిస్తున్నావని తెలుసు. కానీ మరీ ఎక్కువ బాధ అనుభవిస్తున్నావనే విషయాన్ని తెలుసుకోలేకపోయాం. ఒకవేళ మా సంతోషాలు నీకు ఇచ్చి.. నీ బాధలను మేము పంచుకొంటే చిరకాలం నీవు మాతోనే ఉండేవాడివేమో'' అని సుశాంత్ సోదరి ఆవేదన వ్యక్తం చేశారు.

''మా సోదరుడి అస్థికలను నిమజ్జనం చేయడానికి పాట్నాలోని మా ఇంటికి వచ్చాం. సుశాంత్ మరణం తర్వాత నెలకొన్న పరిస్థితులను ప్రశాంతంగా ముగించడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి మా కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు. సుశాంత్‌ పై ప్రేమానురాగాలు.. అతడితో ఉన్న జ్ఞాపకాలను మీ హృదయాల్లో చిరకాలం దాచుకోవాలని.. అతడి ఆత్మ శాంతికి ప్రార్థించాలి. అతడి జీవితం సంపూర్ణంగా ముగియడానికి ప్రేమతో కన్నీటి వీడ్కోలు పలుకుదాం'' అని సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కోరారు. కాగా భావోద్వేగాలు అశ్రునయనాల మధ్య సుశాంత్ అస్థికల నిమజ్జనాన్ని సంప్రదాయ పద్ధతుల్లో ముగుంచినట్లు బంధువులు తెలిపారు. ఇదిలా ఉండగా సుశాంత్ మరణంపై తన మేనకోడలు స్పందించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 'మామ ఇక లేరు' అని శ్వేతాసింగ్ తన కూతురుకు చెబితే.. 'మామ ఎక్కడికి వెళ్లలేదు. మన హృదయాల్లో ఉంటారు' అని చెప్పింది. ఈ విషయాన్ని సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ తన సోషల్ మీడియా అకౌంట్‌ లో వెల్లడించారు.