Begin typing your search above and press return to search.

సుధీర్ వర్మ సినిమా పట్టాలెక్కేనా...?

By:  Tupaki Desk   |   31 May 2020 6:46 AM GMT
సుధీర్ వర్మ సినిమా పట్టాలెక్కేనా...?
X
టాలీవుడ్ లో టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లలో సుధీర్ వర్మ ఒకరు. కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన 'స్వామిరారా' సినిమాతో డైరెక్టర్ గా మారాడు సుధీర్. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత నాగచైతన్య తో 'దోచెయ్‌'.. నిఖిల్ తో 'కేశవ'.. శర్వానంద్ తో 'రణరంగం' చిత్రాలను రూపొందించాడు. థ్రిల్లర్ కాన్సెప్ట్స్‌ ని డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో అద్భుతంగా తెరపై చూపిస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా 'కిరాక్ పార్టీ' సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా వ్యవహరించాడు. అయితే సుధీర్ వర్మ కమర్షియల్ సక్సెస్ అందుకొని చాలా కాలం అవుతోంది. ఒక్క 'స్వామిరారా' తప్ప మిగతా సినిమాలు ఏవీ కమర్షియల్ గా వర్కౌట్ అవలేదు. ఈ నేపథ్యంలో సుధీర్ వర్మ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ లో ఒక సినిమా రాబోతోందని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీని కోసం 'మిడ్ నైట్ రన్నర్స్' అనే కొరియన్ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారని.. ఏప్రిల్ మొదటి వారం నుండి ఈ మూవీ షూటింగ్ కూడా మొదలు కానుందని న్యూస్ వచ్చింది. గతేడాది 'ఓ బేబి' అంటూ కొరియన్ మూవీని తెలుగులో రీమేక్ చేసిన సురేశ్ ప్రొడక్షన్స్‌ తమిళ్ 'అసురన్' ని కూడా తెలుగులో రీమేక్ చేస్తున్నారు.. ఈ క్రమంలో ఇప్పుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో కొరియన్ మూవీ రీమేక్ చేస్తూ సురేశ్ ప్రొడక్షన్స్ సేఫ్ గేమ్ ఆడుతోందని కామెంట్స్ కూడా వినిపించాయి.

యాక్షన్ అండ్ కామెడీ ఎంటెర్టైనర్‌ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రధాన పాత్రలకు రెజీనా కాసాండ్రా - నివేదా థామస్ లను ఎంపిక చేసారు. ఇందులో వీరిద్దరూ లేడీ పోలీస్ ఆఫీసర్స్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఇద్దరూ కొరియన్ యాక్షన్ కొరియోగ్రఫర్ల వద్ద శిక్షణ కూడా తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీలో తానేంటో మరోసారి నిరూపించుకోవాలనుకున్న సుధీర్ వర్మకి అసలు ఇప్పుడు ఈ సినిమా ఉంటుందా లేదా అనే బెంగ పట్టుకుందట. ఈ సినిమా ఎప్పుడో షూట్ స్టార్ట్ చెయ్యాలని అనుకున్నప్పటికీ కరోనా మహమ్మారి వలన పోస్ట్ ఫోన్ అయింది. అంతేకాకుండా అప్పటి నుంచి ఈ సినిమా గురించి అటు డైరెక్టర్ నుండి కానీ ఇటు ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ ఎటువంటి అప్డేట్ లేదు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా క్యాన్సల్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంభందించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 'రణరంగం' ఏడాది కావస్తున్నా ఇంకా సుధీర్ వర్మ తన నెక్స్ట్ సినిమా స్టార్ట్ కాకపోవడంతో ఆయన కెరీర్ కి బ్రేక్ పడుతుందేమో అని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.