Begin typing your search above and press return to search.

మీనా భ‌ర్త మ‌ర‌ణంపై త‌ప్పుడు ప్ర‌చారం ఆపండి

By:  Tupaki Desk   |   29 Jun 2022 4:32 PM GMT
మీనా భ‌ర్త మ‌ర‌ణంపై త‌ప్పుడు ప్ర‌చారం ఆపండి
X
న‌టి మీనా భర్త విద్యాసాగర్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్ష‌న్ కి చికిత్స పొందుతూ వ్యాధి తిర‌గ‌బెట్ట‌డంతో మృతి చెందిన‌ సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మ‌ర‌ణంపై మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలొచ్చాయి. అత‌డు క‌రోనాతో మ‌ర‌ణించార‌న్న ప్ర‌చారం సాగింది. ఈ ప్ర‌చారాన్ని ఫ్యామిలీ ఫ్రెండ్ ఖుష్బు సుందర్ ఖండించారు. అత‌డి మరణానికి గల కారణాన్ని ఖుష్బూ ప్రజలకు ఒక ట్వీట్ లో స్పష్టం చేస్తూ మీడియా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని అభ్య‌ర్థించారు.

తన స్నేహితురాలు.. సహనటి అయిన మీనా భర్త విద్యాసాగర్ మ‌ర‌ణం త‌న‌ని క‌ల‌చివేసింద‌ని దిగ్భాంతిని వ్య‌క్తం చేసిన ఖుష్బూ .. కోవిడ్ -19 కారణంగా అత‌డు చనిపోలేదని స్పష్టం చేశారు. అయితే మూడు నెలల క్రితమే సాగర్ కు వైరస్‌ సోకినట్లు పరీక్షల్లో తేలిందని దీంతో అతని ఊపిరితిత్తులు క్షీణించాయని కూడా తెలిపారు. ఆయన మృతిపై మీడియా తప్పుడు స‌మాచారం ఇవ్వొద్ద‌ని ఖుష్బూ కోరారు.

విద్యాసాగర్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అతను తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడు. గత కొన్ని నెలలుగా దీనికి చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఊపిరితిత్తుల్ని మార్చాల‌ని డాక్ట‌ర్లు ప్ర‌య‌త్నించారు. ఎవ‌రైనా బ్రెయిన్ డెడ్ అయిన వ్య‌క్తి ఊపిరితిత్తుల దానం కోసం కూడా ప్ర‌య‌త్నించినా వీలుప‌డ‌లేదు. ఇంత‌లోనే అత‌డు మ‌ర‌ణించారు. అయితే ఇంత‌లోనే మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలొచ్చాయి.

ఖుష్బూ ట్వీట్ చేస్తూ త‌ప్పుడు ప్ర‌చారాన్ని ఖండించారు. వేకువ‌ఝామున మేల్కొన‌గానే భ‌యంక‌ర వార్త విన్నాను. మీనా భర్త సాగర్ మన‌ మధ్య లేరని తెలియ‌గానే నా గుండె పగిలింది. అతను చాలా కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో పోరాడుతున్నాడు. మీనాను .. త‌న‌ చిన్న కుమార్తెని త‌ల‌చి త‌ల్ల‌డిల్లాను. జీవితం క్రూరమైనది. బాధను వ్యక్తం చేయడానికి మాట‌లు రావ‌డం లేదు. మీనా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి'' అని రాసారు. మరో ట్వీట్ లో సాగర్ కోవిడ్ తో చనిపోలేదని ఆమె స్పష్టం చేసారు.

మీడియా కొంచెం బాధ్యతగా వ్య‌వ‌హ‌రించాల‌ని నేను చాలా వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను అని అన్నారు. మీనా భర్తకు 3 నెలల క్రితం కోవిడ్ వచ్చింది. కోవిడ్ అతని ఊపిరితిత్తుల పరిస్థితిని మరింత దిగజార్చింది. కోవిడ్‌ వల్ల సాగర్ ని కోల్పోయాం అని చెప్పి తప్పుడు సందేశాన్ని పంపకండి. ఎలాంటి భయాన్ని కలిగించకండి. మనం జాగ్రత్తగా ఉండాలి.. కానీ ప్లీజ్!! అంటూ అభ్య‌ర్థించారు. న‌టి మీనా భర్త విద్యాసాగర్ మృతి వార్త వెలువ‌డ‌గానే న‌టులు శరత్ కుమార్ - వెంకటేష్ స‌హా ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులంతా నివాళులు అర్పించారు.

విద్యాసాగర్ బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త. 2009 లో అతడు మీనాను వివాహం చేసుకున్నాడు. వారికి నైనికా అనే కుమార్తె ఉంది. మీనా సినీరంగ ప్ర‌వేశం గురించి ప్ర‌స్థావిస్తే.. త‌ను చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. 90వ దశకం .. 2000వ దశకం ప్రారంభంలో అత్యంత డిమాండ్ ఉన్న క‌థానాయిక‌గా మీనా ఎదిగారు. సౌత్ లో అగ్ర‌ హీరోలందరితో కలిసి మీనా పనిచేసారు. ఇటీవల మలయాళంలో అత్యంత విజయవంతమైన దృశ్యం ఫ్రాంచైజీలో న‌టించారు.

2009లో వ్యాపారవేత్త విద్యాసాగర్ ని మీనా పెళ్లి చేసుకున్నారు. వారి కూతురు నైనికా కూడా తన తల్లిలాగే చైల్డ్ ఆర్టిస్ట్. సమంత రూత్ ప్రభు నటించిన బ్లాక్ బస్టర్ 'తేరి'లో నైనిక‌ విజయ్ కూతురి పాత్రను పోషించింది. త‌న‌కు కుమారులు లేక‌పోవ‌డంతో భ‌ర్త అంత్య‌క్రియ‌ల్ని త‌నే స్వ‌యంగా నిర్వ‌హించారు మీనా. ఆ దృశ్యాలు అభిమానుల్ని కంట‌త‌డి పెట్టించాయి.