Begin typing your search above and press return to search.

అగ్ర బ్యాన‌ర్ల మ‌ధ్య `స్టార్ వార్`!!

By:  Tupaki Desk   |   12 March 2019 5:41 AM GMT
అగ్ర బ్యాన‌ర్ల మ‌ధ్య `స్టార్ వార్`!!
X
టాలీవుడ్ అగ్ర బ్యాన‌ర్ల మ‌ధ్య స్టార్ వార్ న‌డుస్తోందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. స్టార్ల‌కు గాలం వేయ‌డంలో ప‌లు అగ్ర నిర్మాణ సంస్థ‌లు వేస్తున్న ఎత్తుగ‌డ‌లు ఈ సంగ‌తిని అర్థ‌మ‌య్యేలా చెబుతున్నాయి. ఇక్క‌డ ఎప్పుడు ఏ క‌ల‌యిక ఎలా సాధ్య‌ప‌డుతుందో చెప్ప‌లేని స‌న్నివేశం నెల‌కొంది. ఒక్కోసారి తానొక‌టి త‌లిస్తే అన్న చందంగా డీల్ రివ‌ర్స్ అవుతుంది. ఈ స‌న్నివేశాన్ని ప‌లు నిర్మాణ సంస్థలు క్యాష్ చేసుకునే ఎత్తుగ‌డ‌లు వేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఇటీవ‌ల `మ‌హేష్ - సుకుమార్ - అల్లు అర్జున్` త్ర‌యం ఎపిసోడ్ ని అల్లు అర‌వింద్ ఫేవ‌ర్ గా మార్చుకోబోతున్నార‌న్న‌ది తాజా అప్ డేట్. మ‌హేష్ త‌న 26వ చిత్రం కోసం అనీల్ రావిపూడికి క‌మిటై సుక్కూని వ‌దులుకున్నాడు. అటుపై అల్లు అర్జున్ తో సుకుమార్ ప్రాజెక్టును ఆక‌స్మికంగా ప్ర‌క‌టించారు. ఇదే స‌న్నివేశంలో బాస్ అల్లు అర‌వింద్ మాస్ట‌ర్ మైండ్ తెలివిగా పావులు క‌దుపుతోంద‌ట‌.

మ‌హేష్ 26వ సినిమా ఫిక్స‌యినా ఇంకా 27వ సినిమా ఫిక్స‌వ్వ‌లేదు. మ‌హేష్ లో ర‌క‌ర‌కాల డైలెమా కొన‌సాగుతోంది. అందుకే ఈ సందు చూసి బాస్ అల్లు అర‌వింద్ అదిరిపోయే పాచిక విసురుతున్నార‌ట‌. ఈ పాచిక నెర‌వేరేట్టే ఉంద‌ని గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి ఓ లీక్ అందింది. అయితే మ‌హేష్ కి గీతా ఆర్ట్స్ త‌ర‌పున క‌థ వినిపించేది ఎవ‌రు? అంటే `గీత గోవిందం` ఫేం ప‌ర‌శురామ్ ఇప్ప‌టికే వంద శాతం బౌండ్ స్క్రిప్టు ప‌ట్టుకుని మ‌హేష్ ని క‌లిసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట‌. వాస్త‌వానికి ఈ క‌థ‌ను అల్లు అర్జున్ కోసం ప‌ర‌శురామ్ రాసుకున్నా.. ఆ క‌థ‌లో సెన్సిబిలిటీస్ మ‌హేష్ కే సూట‌వుతాయ‌ని బ‌న్ని- అర‌వింద్ భావించార‌ట‌. అందుకే ఆ క‌థ‌ను మ‌హేష్ కి చెప్పాల్సిందిగా ప‌ర‌శురామ్ కి సూచించార‌ని తెలుస్తోంది. ఒక‌వేళ మ‌హేష్ ఆ క‌థ‌కు ఓకే అంటే గీతా ఆర్ట్స్ లో ఈ సినిమాని తెర‌కెక్కించాల‌న్న‌ది అల్లు అరవింద్ మాస్ట‌ర్ ప్లాన్ అని తెలుస్తోంది. సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే మ‌హేష్ కి క‌థ వినిపించేందుకు ప‌ర‌శురామ్ ప్రిపేర‌వుతున్న‌డ‌ని క్లోజ్ సోర్స్ చెబుతోంది. మ‌హేష్ - అనీల్ రావిపూడి ప్రాజెక్టు త‌ర్వాత గీతా ఆర్ట్స్ కి మ‌హేష్ అంగీక‌రించే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకుంటున్నారు.

అయితే మ‌హేష్ తో సుకుమార్ ప్రాజెక్ట్ ఫెయిల్ కాకుండా ఉండేందుకు మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఇప్ప‌టికీ ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌న్న స‌మాచారం ఉంది. సుకుమార్- మహేష్ ల‌ను క‌న్విన్స్ చేసి చివ‌రి ఎటెంప్ట్ చేస్తోంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. దీంతో గీతా ఆర్ట్స్, మైత్రి సంస్థ‌ల మ‌ధ్య ఊహించ‌ని పోటీ నెల‌కొంది. సంద‌ట్లో స‌డేమియాగా మ‌రోవైపు దిల్ రాజు శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నుంచి బ‌య‌టికి పోకుండా మ‌హేష్ ని రాజుగారు లాక్ చేస్తున్న వైనం బ‌య‌ట‌ప‌డుతోంది. అనీల్ సుంక‌ర - అనీల్ రావిపూడితో క‌లిసి దిల్ రాజు మ‌హేష్ 26ని లాక్ చేశారు. మ‌హేష్ 25 మ‌హ‌ర్షి త‌ర్వాత వెంట‌నే లాక్ చేయ‌గ‌లిగారు. దీనిని బ‌ట్టి మ‌రో ఆసక్తిక‌ర కోణం బ‌య‌ట‌ప‌డుతోంది. స‌క్సెస్ లో ఉన్న ద‌ర్శ‌కుల‌తో క‌థ‌లు వండించి స్టార్ హీరోల వ‌ద్ద‌కు పంప‌డం ద్వారా అగ్ర నిర్మాణ సంస్థ‌లు ఆస‌క్తిక‌ర గేమ్ ర‌న్ చేస్తున్నాయి. ఆ క్ర‌మంలోనే స‌ద‌రు నిర్మాణ సంస్థ‌ల మ‌ధ్య ఊహించ‌ని రీతిలో అదిరిపోయే కాంపిటీష‌న్ న‌డుస్తోంద‌న్న సంగ‌తి రివీలైంది.