Begin typing your search above and press return to search.

స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అందుకే వెన‌క్కి త‌గ్గారా?

By:  Tupaki Desk   |   7 July 2022 5:30 PM GMT
స్టార్ ప్రొడ్యూస‌ర్స్ అందుకే వెన‌క్కి త‌గ్గారా?
X
క‌రోనా కార‌ణంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్న సినిమా ఇండ‌స్ట్రీకి ఓటీటీ ప్లాట్ ఫామ్ లు ఊర‌ట‌నిచ్చాయి. థియేట‌ర్లు తెరుచుకోలేని ప‌రిస్థితుల్లో సినిమాల రిలీజ్ ల‌కు కీల‌క వేదిక‌లుగా నిలిచి చాలా మంది నిర్మాత‌ల‌కు ఊర‌ట‌నిచ్చాయి. క‌రోనా కార‌ణంగా థియేట‌ర్ల‌లో సినిమాలు రిలీజ్ చేయ‌లేని ప‌రిస్థితులు త‌లెత్త‌డంతో చాలా మంది ఇక థియేట‌ర్లు మూసివేయాల్సిందేనా అనే సందేహాల్ని వ్య‌క్తం చేశారు. కొంత మంది సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ ల‌ని ప్రారంభించాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు.

స్టార్ ప్రొడ్యూస‌ర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ మైహోమ్ గ్రూప్ తో క‌లిసి సొంతంగా 'ఆహా' పేరుతో కొత్త‌గా ఓటీటీ ప్లాట్ ఫామ్ ని ప్రారంభించారు. తెలుగులో ప్రారంభ‌మైన మొట్ట‌మొద‌టి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇదే కావ‌డంతో అన‌తి కాలంలోనే ఈ ఓటీటీ క్లిక్ అయింది. ఇదే త‌ర‌హాలో టాలీవుడ్ కు చెందిన మ‌రో ఇద్దురు స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్ రాజు, డి. సురేష్ బాబు ఓటీటీ ప్లాట్ ఫామ్ ల‌ని ప్రారంభించాల‌ని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇంత వ‌ర‌కు ఆ వైపుగా అడుగులు వేయ‌లేక‌పోతున్నారు.

అయితే అప్ప‌ట్లో ఈ ఇద్ద‌రు అల్లు అర‌వింద్ ప్రారంభించిన 'ఆహా'లో భాగ‌స్వాములు అవుతార‌ని ప్రాచ‌రం జ‌రిగింది. అయితే అది జ‌ర‌గ‌లేదు. డి. సురేష్ బాబు చేతిలో రామానాయుడు స్టూడియో, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లాంటి దిగ్గ‌జ నిర్మాణ సంస్థ వుండ‌టంతో ఆయ‌నే స్వ‌యంగా కొత్త ఓటీటీ ప్లాట్ ఫామ్ ని ప్రారంభించాల‌ని ప్లాన్ చేసుకున్నారు. ఇందు కోసం చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయ‌ని ఓ సంద‌ర్భంలో ఇండైరెక్ట్ గా వెళ్ల‌డించారు. ఫ్యూచ‌ర్ మొత్తం ఇక ఓటీటీల‌దే అంటూ స్టేట్ మెంట్ లు కూడా ఇచ్చారు. దీంతో 'ఆహా'కు పోటీగా సురేష్ బాబు భారీ స్థాయిలో ఓటీటీ ప్లాట్ ఫామ్ ని ప్రారంభించ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపించాయి.

ఇదే త‌ర‌హాలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కూడా ఓటీటీ ప్ర‌య‌త్రాల‌లో వున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఓ యురోపియ‌న్ ఓటీటీ యాప్ ఆర్కిటెక్చ‌ర్ ఆధారంగా ఓ యాప్ ని కూడా రెడీ చేస్తున్నార‌ని, దీని కోసం సాఫ్ట్ వేర్ అప్లికేష‌న్ ని కూడా కొన‌బోతున్నార‌ని వార్త‌లు వినిపించాయి. కట్ చేస్తే థియేట‌ర్లు మ‌ళ్లీ రీఓపెన్ కావ‌డం.. సినిమాలకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌టంతో ఈ ఇద్ద‌రు స్టార్ ప్రొడ్యూస‌ర్లు త‌మ ఓటీటీ ప్లాన్స్ ని ప‌క్క‌న పెట్టేశార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

అయితే ఓటీటీల కోసం కంటెంట్ ని క్రియేట్ చేయ‌డం, సేక‌రించ‌డం పెద్ద ప్రాసెస్ తో కూడుకున్న ప‌ని, ఓ ప‌క్క సినిమాలు నిర్మిస్తూ ఓటీటీ కోసం కంటెంట్ ని క్రియేట్ చేయ‌డం స్టార్ ప్రొడ్యూస‌ర్ లు దిల్ రాజు, సురేష్ బాబుల‌కు పెద్ద త‌ల‌నొప్పి వ్య‌వ‌హారం.

అందుకే సొంత ఓటీటీని క్రియేట్ చేయాల‌న్న ఆలోచ‌న‌కు ఈ ఇద్ద‌రు ప్రొడ్యూస‌ర్ లు ఫుల్ స్టాప్ పెట్టేశార‌ట‌. పైగా ఓటీటీలు ఎక్కువైతే థియేట‌ర్ వ్య‌వ‌స్థ కుప్ప‌కూలే ప్ర‌మాదం వుంది. ప్ర‌ధాన థియేట‌ర్ల‌న్నీ ఈ ఇద్ద‌రి చేతుల్లోనే వుండ‌టంతో ఓటీటీ ఐడియా మొద‌టికే మోసం అయ్యేలా వుంద‌ని ఈ ఇద్ద‌రు ఆ ఆలోచ‌న‌ని ప‌క్క‌న పెట్టేశార‌ట‌.