Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: సేద్యం కోసం కొత్త అధ్యాయానికి 'శ్రీకారం' చుట్టిన యువ రైతు..!

By:  Tupaki Desk   |   5 March 2021 1:05 PM GMT
ట్రైలర్ టాక్: సేద్యం కోసం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన యువ రైతు..!
X
టాలీవుడ్‌ లో వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వర్సటైల్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ''శ్రీకారం''. వాస్తవ సంఘటనల ఆధారంగా నూతన దర్శకుడు బి.కిశోర్ రెడ్డి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట - గోపీ ఆచంట కలసి నిర్మిస్తున్నారు. ఇందులో ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌ గా నటిస్తోంది. రూపొందుతున్న ఈ చిత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ - టీజర్ మరియు సాంగ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'శ్రీకారం' ట్రైలర్ ని విడుదల చేశారు.

నేచురల్ స్టార్ నాని - యూత్ స్టార్ నితిన్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసి చిత్ర యూనిట్ కి విషెస్ తెలియజేసారు. అమెరికాలో మంచి ఉద్యోగ అవకాశం వచ్చినా ఆ ఆఫర్ ని వద్దనుకొని వ్యవసాయం చేయాలని నిర్ణయించుకునే యువకుడిగా శర్వా నటించాడు. 'ఉమ్మడిగా చేసిన యుద్ధంలో రాజ్యాలే గెలిచాం.. సేద్యం కూడా గెలవొచ్చు' అంటూ ఏడాది పొడవునా పంట చేతికొచ్చే ఓ కొత్త వ్యవసాయ పద్ధతికి హీరో శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా రాసిన 'కార్పొరేట్ మీద నడవాల్సిన వాడిని బురదలో నడుస్తానంటావేంటి' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. దీనికి 'వ్యవసాయం మనకు కొత్త కాదు మన తాతల కృషి..' అంటూ మిక్కీ జె మేయర్ అందించిన నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. మొత్తం మీద రైతులు - వ్యవసాయం ప్రాధాన్యతను తెలియజెప్పాలా ఉన్న 'శ్రీకారం' ట్రైలర్ అన్ని వర్గాల వారిని అలరిస్తోంది.

ఈ చిత్రానికి జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నరేష్ - సాయికుమార్‌ - మురళి శర్మ - రావు రమేష్ - ఆమని - సత్య - సప్తగిరి తదితరులు నటించారు. సందేశాత్మక అంశాలతో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్న శర్వా ఎలాంటి విజయానికి 'శ్రీకారం' చుడతాడో చూడాలి.