Begin typing your search above and press return to search.

ఓటీటీ రాజ్యాన్ని ఏలుతున్న సౌత్ హీరోయిన్లు..!

By:  Tupaki Desk   |   21 July 2021 5:30 PM GMT
ఓటీటీ రాజ్యాన్ని ఏలుతున్న సౌత్ హీరోయిన్లు..!
X
ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ హవా మొదలయ్యాక అనేక మంది స్టార్ యాక్టర్స్ వెబ్ వరల్డ్ లో అడుగులు వేస్తున్నారు. వెబ్ సిరీస్ లు - ఒరిజినల్ మూవీస్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఎప్పటి నుంచో వెబ్ కంటెంట్ లో నటిస్తుండగా.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో కూడా ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. వెండితెర మీద ఫుల్ ఫార్మ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లు.. ఇప్పుడు ఓటీటీలలో ఫుల్ బిజీగా మారిపోతున్నారు.

టాలీవుడ్ టూ బాలీవుడ్.. ప్రతి హీరోయిన్ కూడా ఓటీటీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని దృష్టిలో పెట్టుకుని లేడీ ఓరియెంటెడ్ సినిమాల తరహాలోనే.. ఫీమేల్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ లను మేకర్స్ రూపొందిస్తున్నారు.

దక్షిణాది అగ్ర కథానాయిక సమంత అక్కినేని 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ తో ఓటీటీ వరల్డ్ లో ఎంటర్ అయింది. ఇది సక్సెస్ ఫుల్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ కు కొనసాగింపుగా వచ్చింది. రాజ్ నిడిమోరు - కృష్ణ డీకే రూపొందించిన ఈ సిరీస్.. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలై విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది.

రాజీ అలియాస్‌ రాజ్యలక్ష్మి అనే తమిళ ఈలం సోల్జర్ పాత్రలో సామ్ అద్భుతంగా నటించిన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. యాక్షన్ సీన్స్ తో పాటుగా బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో సమంత కు వెబ్ కంటెంట్ లో మరిన్ని అవకాశాలు అందుతున్నాయని తెలుస్తోంది.

వరుస సినిమాతో బిజీగా ఉండే మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా 'లైవ్ టెలికాస్ట్' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి అడుగు పెట్టింది. స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు రూపొందించిన ఈ హారర్ సిరీస్ డిస్నీ + హాట్ స్టార్ లో విడుదలైంది. ఇందులో ఆమె జర్నలిస్ట్ క్యారెక్టర్ ప్లే చేసింది. అయితే కాజల్ నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఆడియన్స్ ఆశించిన స్థాయిలో లేదని కామెంట్స్ వచ్చాయి.

తెలుగులో స్టార్ హీరోలందరితో నటించిన హీరోయిన్ ప్రియమణి కూడా ఓటీటీ వరల్డ్ లో సత్తా చాటుతోంది. 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ లో నటించిన ప్రియమణి నేషనల్ వైడ్ పాపులర్ అయింది. ఈ క్రమంలో 'హిజ్ స్టోరీ' 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ లలో నటించింది.

ఏడాది పొడవునా సినిమాలతో బిజీగా ఉండే మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గతేడాది 'నవంబర్ స్టోరీస్' అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ తో ఓటీటీ డెబ్యూ ఇచ్చింది. డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ మంచి ఆదరణ తెచ్చుకుంది. అలానే తెలుగు ఓటీటీ 'ఆహా' కోసం '11త్ అవర్' అనే ఒరిజినల్ సిరీస్ చేసింది.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కార్పొరేట్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్.. తమన్నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మరో అగ్ర కథానాయిక శృతి హాసన్ 'పిట్ట కథలు' ఆంథాలజీతో ఓటీటీలోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ నిరాశపరిచింది.

అలానే 'బ్రీథ్' అనే హిందీ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ తో బబ్లీ బ్యూటీ నిత్యామీనన్ కూడా వీరి బాటలోనే నడిచింది. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్ పోషించిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల అయింది. 'పిట్టకథలు' సిరీస్ లో నటించిన హీరోయిన్ అమలా పాల్.. లేటెస్టుగా 'కుడి ఎడమైతే' అనే సైకాలజికల్ థ్రిల్లర్ సిరీస్ తో మెప్పించింది.

'యూ టర్న్' ఫేమ్ పవన్ కుమార్ రూపొందించిన ఈ సిరీస్.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 'Rx 100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్ 'అనగనగా ఓ అతిథి' వెబ్ సిరీస్ తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఆహా యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్.. అదే ఓటీటీలో మరో వెబ్ సిరీస్‌ చేసే అవకాశం కల్పించిందని సమాచారం.

స్టార్ హీరోయిన్ రాశిఖన్నా కూడా ఇప్పుడు ఓటీటీ రంగంలో అడుగుపెడుతోంది. దర్శకద్వయం రాజ్ & డీకే రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో రాశీ కీలక పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. అలానే అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌ నెస్‌' అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్ లో రాశీ ఓ సైకో కిల్లర్ పాత్ర చేస్తోంది.

రెజీనా కసండ్రా కూడా తెలుగులో 'అన్యాస్ ట్యుటోరియల్' అనే హార్రర్ థ్రిల్లర్ సిరీస్ తో ఓటీటీలోకి ప్రవేశిస్తోంది. ఈషా రెబ్బా - అషిమా నర్వాల్ వంటి హీరోయిన్లు కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా హీరోయిన్లు అందరూ కంటెంట్ నచ్చితే ఓటీటీలకు రెడీ అంటున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఓటీటీ వరల్డ్ లో కూడా స్టార్స్ గా వెలుగొందుతున్నారు.