Begin typing your search above and press return to search.

మరో కొత్త ప్రాజెక్టుకి జెండా ఊపిన ప్లాప్ హీరో!

By:  Tupaki Desk   |   2 Jun 2020 10:10 AM GMT
మరో కొత్త ప్రాజెక్టుకి జెండా ఊపిన ప్లాప్ హీరో!
X
తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న సినిమాలు ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. కొంతకాలంగా హిట్ల రేసులో కాస్త వెనకబడ్డాడనే చెప్పాలి. 2017లో వచ్చిన శతమానం భవతి సినిమా తర్వాత శర్వానంద్ మళ్లీ మంచి హిట్ అందుకోలేక పోయాడు. గతేడాది భారీ అంచనాలతో విడుదలైన రణరంగం, ఇటీవల స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి జాను చేశాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన 96 చిత్రాన్ని తెలుగులో జాను పేరుతో రీమేక్ చేసినా అది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో శర్వా తన తదుపరి సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు. నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శ్రీకారం అనే సినిమా చేస్తున్నాడు శర్వా.

ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న సమయంలో కరోనా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుండటంతో, ఈ సినిమా కథ ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ప్రస్తుతం మహమ్మారి ఇచ్చిన సెలవులను ఫ్యామిలీతో గడుపుతున్నాడు. అంతేకాదు తన తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెడుతున్నాడట. ఈ లాక్ డౌన్ సమయంలో చక్కగా కథలు వింటూ కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడట శర్వా. ఇప్పటికే శర్వా నుంచి 'శ్రీకారం' మూవీ రిలీజ్ కు సిద్ధం అవుతుండగా.. ఇక అజయ్‌ భూపతితో చేయాల్సిన 'మహా సముద్రం' షూటింగులకు పర్మిషన్ ఇస్తే సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీగా ఉంది.

ఆ తర్వాత కిషోర్‌ తిరుమల దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు శర్వా. అయితే తాజాగా ఈ శర్వా మరో క్రేజీ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపినట్టు సమాచారం. అది కూడా ఓ కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కునున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ కథ ఫస్ట్ రామ్‌చరణ్ దగ్గరికి వెళ్తే.. చరణ్ శర్వాను రిఫర్ చేసాడని సమాచారం. ఈ ఇద్దరు హీరోలు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కథను చరణ్, శర్వాల మిత్రుడైన శ్రీరామ్‌ రెడ్డి అనే వ్యక్తి రాసినట్లు తెలుస్తుంది. చూడాలి మరి శర్వాకి చరణ్-శ్రీరామ్ లైనా హిట్ స్టోరి ఇచ్చారేమో!