Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా స్టార్ల‌తో శంక‌ర్ కంబ్యాక్?

By:  Tupaki Desk   |   30 Jun 2022 6:38 AM GMT
పాన్ ఇండియా స్టార్ల‌తో శంక‌ర్ కంబ్యాక్?
X
స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ గ‌త కొంత‌కాలంగా ఆశించిన స్థాయి విజ‌యాలను చూడ‌లేక‌పోతున్న సంగ‌తి తెలిసిందే. ప‌రిమితిని మించి అధిక బ‌డ్జెట్ల వ‌ల్ల‌ ఐ - 2.0 చిత్రాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ గా మార‌డంతో భారీ వ‌సూళ్ల‌ను సాధించినా కానీ న‌ష్టాలు త‌ప్ప‌లేదు. అయితే ఇప్పుడు అత‌డు గాడిన ప‌డాలంటే ఏం చేయాలో అది చేస్తున్నార‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా భార‌తీయుడు 2 తో పాటు రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఆర్.సి 15 చిత్రాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాల త‌ర్వాత కూడా అత‌డు కేజీఎఫ్ స్టార్ య‌శ్ తో భారీ పాన్ ఇండియా చిత్రానికి ప‌ని చేస్తార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అంటే అత‌డు వ‌రుస‌గా పాన్ ఇండియా హీరోల‌తో స‌త్తా చాటేందుకు ఉత్కంఠ‌గా ఉన్నాడు. దానికోసం క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నాడు.

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ 'విక్ర‌మ్' లాంటి మాస్ థ్రిల్ల‌ర్ తో మాసివ్ హిట్ అందుకుని ఇప్పుడు శంక‌ర్ తో భార‌తీయుడు 2 ని పూర్తి చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఇది శంక‌ర్ కి పెద్ద ప్ల‌స్ కానుంది. అత‌డు కంబ్యాక్ అయ్యేందుకు ఈ ప్రాజెక్ట్ స‌హ‌క‌రిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక‌పోతే ప్ర‌స్తుత పాన్ ఇండియా ట్రెండ్ లో భార‌తీయుడు 2 వెయ్యి కోట్ల క్ల‌బ్ లో నిలిచేంత గొప్ప‌ కంటెంట్ తో వ‌స్తోందా? అన్న‌దే వేచి చూడాలి.

అలాగే స‌మ‌కాలీన రాజ‌కీయ అంశాల‌ను మేళ‌వించి సోషియో పొలిటిక‌ల్ డ్రామాతో చ‌ర‌ణ్ ఆర్.సి 15 ని శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తో చ‌ర‌ణ్ కూడా వెయ్యి కోట్ల క్ల‌బ్ హీరోగా పాన్ ఇండియా స్టార్ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నారు. ఈ క్రేజ్ శంక‌ర్ సినిమాకి ప్ల‌స్ కానుంది. ఆర్.సి 15కి బ‌జ్ తెచ్చేందుకు శంక‌ర్ కి అవ‌కాశం ఉంది. వ‌రుస‌గా ఈ రెండు చిత్రాల‌తో విజ‌యాలు అందుకుంటే దేశంలోనే ద‌మ్మున్న ద‌ర్శ‌కుడిగా శంక‌ర్ మ‌రోసారి చ‌ర్చ‌ల్లోకొస్తారు.య‌శ్ తో ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చింది?

క‌మ‌ల్ హాస‌న్ .. చ‌ర‌ణ్ ల త‌ర్వాత మ‌రో పాన్ ఇండియా స్టార్ య‌శ్ తో సినిమా చేయాల‌న్న‌ది శంక‌ర్ ప్లాన్. కానీ ఇది ఇంకా పుకార్ల ద‌శ‌లోనే ఉంది. యష్ తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇటీవ‌ల అత‌డు తన కుటుంబంతో గడపడానికి వెకేష‌న్ కి వెళ్లాడు. వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నాడు. త‌దుప‌రి కెజిఎఫ్ స్టార య‌ష్ దర్శకుడు నర్తన్ తదుపరి చిత్రంలో నటించే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో య‌ష్‌ నేవీ ఆఫీసర్ పాత్రను పోషిస్తాడు. ఈ భారీ బడ్జెట్ కన్నడ చిత్రాన్ని ఆయన అభిమానుల కోసం ఇతర భాషల్లోకి కూడా డబ్ చేయనున్నారు. ద‌ర్శ‌క‌హీరోలు ఇరువురూ కలిసి చాలా సార్లు కనిపించారు కానీ ఇంకా ఈ ప్రాజెక్ట్ పై ఏదీ ధృవీకరించలేదు. కథానాయికగా నటించేందుకు పూజా హెగ్డేని సంప్రదించినట్లు సమాచారం.

శంక‌ర్ తో య‌ష్ పాన్ ఇండియా సినిమా ఇంకా క‌న్ఫామ్ కాలేదు. కానీ అందుకు ఆస్కారం లేక‌పోలేదు. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ ప్రాజెక్ట్ తో పాటు భారతీయుడు 2తో బిజీగా ఉన్నారు. యష్.. శంకర్ ఎవ‌రికి వారు బిజీ బిజీ. అందుకే ప్ర‌స్తుత‌ ప్రాజెక్ట్ లను పూర్తి చేసిన తర్వాత క‌లిసి ప‌ని చేసేందుకు ఆస్కారం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. మరోవైపు అగ్ర నిర్మాత దిల్ రాజు యశ్ కోసం 100 కోట్ల బ‌డ్జెట్ తో ద్విభాషా చిత్రానికి ఆఫర్ చేసినట్లు గ‌తంలో వార్తలు వచ్చాయి. శంక‌ర్ తో య‌శ్ ని క‌లిపేది కూడా ఆయ‌నేన‌న్న టాక్ ఉంది. అయితే ఈ పుకార్లు అన్నిటిపైనా య‌శ్ అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది.

ఆసక్తికరంగా కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడవ పార్ట్ ఉంటుంద‌ని అన‌డం వేడెక్కించింది. మూడో భాగం తెర‌కెక్కిస్తామ‌ని.. అయితే ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పడుతుందని ఆయన ధృవీకరించారు. "చాప్టర్ 3 వచ్చే అవకాశం ఉంది. అది కూడా బలవంతం వల్ల వస్తుంది. ప్రజలు కేజీఎఫ్ ప్రపంచాన్ని ఇష్టపడ్డారు. వారు ఆ పాత్రను ఇష్టపడ్డారు. అందుకే దానిని మేం కొనసాగించబోతున్నాం. ఈ విష‌యంలో మాకు చాలా కాలం గా ఆలోచన ఉంది. కానీ ఇప్ప‌టికి మేం పెద్ద విరామం తీసుకోవాలనుకుంటున్నాము. మూడో భాగం కోసం మ‌ళ్లీ వ‌స్తాం" అని అన్నాడు. ఒక‌వేళ శంక‌ర్ తో సినిమా వెంట‌నే సాధ్య‌ప‌డ‌క‌పోతే య‌ష్ త‌దుప‌రి కేజీఎఫ్ 2 పై దృష్టి సారిస్తార‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. సౌత్ లో రాజ‌మౌళి- శంక‌ర్ పాన్ ఇండియా ఫీట్ ని ఇలానే కొన‌సాగిస్తార‌న‌డంలో సందేహం లేదు. అయితే ఆ ఇద్ద‌రూ వ‌ర‌స విజ‌యాల‌తో బాలీవుడ్ కి వ‌రుస‌ ఛాలెంజ్ లు విస‌రాల్సి ఉంటుంది.