Begin typing your search above and press return to search.

MAA వార్.. ఆయ‌న‌పై సీనియ‌ర్ల అస‌హ‌నం నిజ‌మా?

By:  Tupaki Desk   |   16 Sep 2021 4:32 AM GMT
MAA  వార్.. ఆయ‌న‌పై సీనియ‌ర్ల అస‌హ‌నం నిజ‌మా?
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల హంగామా గురించి తెలిసిన‌దే. అక్టోబర్ 10న `మా` అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈసారి నువ్వా నేనా? అంటూ ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు మ‌ధ్య వార్ న‌డుస్తోంది. ఇద్ద‌రిలో ఎవ‌రు అధ్య‌క్షుల‌వుతారు? అంటూ డిబేట్లు న‌డుస్తున్నాయి. విందు రాజ‌కీయాలు ప్ర‌స్తుతం ప‌రాకాష్ట‌కు చేరుకున్నాయి.

తాజా స‌మాచారం మేరకు ప్ర‌కాష్ రాజ్ పై సీనియ‌ర్ ఆర్టిస్టులు అస‌హ‌నంగా ఉన్నారంటూ ఒక సెక్ష‌న్ మీడియా ప్ర‌చారం చేస్తోంది. దీనికి కొన్ని కార‌ణాల్ని తెర‌పైకి తెస్తున్నారు. య‌థావిధిగా ప్ర‌కాష్ రాజ్ స్థానికేత‌ర న‌టుడ‌ని ప్ర‌చారం చేయ‌డంతో పాటు.. అత‌డు సాటి స్టార్ల‌తో స‌రిగా ఉండ‌రని క్ర‌మ‌శిక్ష‌ణ నియ‌మాల్ని ఉల్లంఘించి గ‌తంలో `మా` తాఖీదులు దండ‌నకు గుర‌య్యార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అంతేకాదు క‌ర్నాట‌క‌లో తెలుగు సినిమాల్ని బ్యాన్ చేసిన‌ప్పుడు ప్ర‌కాష్ రాజ్ ఏదీ మాట్లాడ‌లేద‌ని సైలెంట్ గా ఉన్నార‌ని కూడా కొత్త ప్ర‌చారం తెర‌పైకి తెచ్చారు.

అయితే ఇందులో స్థానికేత‌రుడు అనేదానికి ఎవ‌రూ అంగీక‌రించ‌డం లేదు. అత‌డు తెలుగుతో పాటు అన్ని భాష‌ల్లోనూ న‌టిస్తూ హైద‌రాబాద్ లో స్థిర‌ప‌డ్డారు. ఇక్క‌డే పొలం ఇల్లు కొనుక్కుని కుటుంబంతో ఉన్నారని నాగ‌బాబు ఇంత‌కుముందు స‌మ‌ర్థించారు. ఇక ఇతర విష‌యాల‌న్నీ చాలా స‌హ‌జంగా చాలా మంది ఎదుర్కొనేవే అని కూడా ప్ర‌కాష్ రాజ్ అనుచ‌ర గ‌ణం చెబుతోంది.

ఎన్నిక‌ల్లో పోటీ ముందు ఇలాంటి ప్ర‌చారం స‌హ‌జంగా జ‌రిగేదే. అయితే ఎవ‌రి బ‌లం ఎంత అన్న‌ది ఎన్నిక‌ల త‌ర్వాతే తేలుతుంద‌ని విశ్లేషిస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌కాష్ రాజ్ కి ధీటుగా మంచు విష్ణు వ‌ర్గం క‌థ‌న‌రంగంలో ఉంది. ధీటైన ప్ర‌చారం చేసుకుంటోంది. విష్ణుకు వీకే న‌రేష్ వ‌ర్గం మ‌ద్ధ‌తు ఉంది. అలాగే మంచు ఫ్యామిలీ బ్యాన‌ర్ సినిమాల ద్వారా ఉపాధి పొందే న‌టీన‌టుల మ‌ద్ధ‌తు ఉంది.. అని చెబుతున్నారు. సినీపెద్ద‌ల అండ‌దండ‌లు.. సీనియ‌ర్లతో స్నేహం ఉన్నాయి. అవ‌న్నీ విష్ణుకి ప్లస్ కానున్నాయి.

ప్ర‌త్య‌ర్థుల‌కు ధీటైన ప్ర‌చారం..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌ళ్లీ మాట‌ల యుద్ధం ముదిరే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే జీవితా రాజ‌శేఖ‌ర్ ఎంట్రీతో ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీ చేయాల‌నుకున్న బండ్ల గ‌ణేష్ త‌ప్పుకుని సంచ‌ల‌నానికి తెర లేపారు. అటుపై బండ్ల వ్యాఖ్య‌లు.. జీవిత కౌంట‌ర్లు చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. రెండు..మూడు రోజులుగా మీడియాలో అదే అంశంపై ప్ర‌త్యేక డిబేట్లు న‌డిచాయి.

మా ఎన్నిక‌లు ఏక‌గ్రీవం త‌న‌కు ఎంత మాత్రం ఇష్టం లేద‌ని ప్ర‌క‌టించిన ప్ర‌కాష్ రాజ్.. ఎన్నిక ఏదైనా కానీ ఎన్నిక‌ల వేళ చ‌ర్చ జ‌ర‌గాలి అని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లు ఈ రెండేళ్లు ఏం చేసారో చూడాలి. త‌దుప‌రి ఏం చేయాల‌న్న‌ది ఆలోచించాలి. అలాంటి వాతావ‌ర‌ణ‌మే అసోసియేష‌న్ కి మంచింది. మంచి ..చెడులు విశ్లేషించుకోవాలంటే పోటీ ఉండాలి. . అని అన్నారు. ఏక‌గ్రీవాల‌కు తాను వ్య‌తిరేకిన‌ని ఆయ‌న ఇంత‌కుముందే బాహాటంగా ప్ర‌క‌టించారు.

ఎన్నిక‌లంటే ఓడిపోవ‌డం.. గెల‌వ‌డం కాదు. అస‌లు గ‌తంలో ఏం జ‌రిగిందో చూడాల‌న్నారు. మంచి అభ్య‌ర్ధిని ఎన్నుకునే ప‌క్రియ ఎన్నిక‌లు మాత్ర‌మే క‌ల్పిస్తాయ‌న్నారు. గ‌తంలో విష్ణుతో మాట్లాడాను. అంకుల్ మీరు పోటీ చేస్తున్నారా? ఆ విష‌యం తెలిస్తే మానేసేవాడిని అన్నారు. న‌రేష్ తో మాట్లాడాను. ఆయ‌న ఆల్ ది బెస్ట్ చెప్పారు. త‌న‌ని నాన్ లోక‌ల్ అన్న‌వారు అదే ఎజెండాతో ఎన్నిక‌లకు వెళ్లాల‌ని.. నాన్ లోక‌ల్ కి ఓటు వేయొద్ద‌ని క్యాపెనింగ్ చేయ‌గ‌ల‌రా? అని స‌వాల్ విసిరారు ప్ర‌కాష్ రాజ్.

అయితే ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ పై గెలుపే ధ్యేయంగా ఇప్పుడు మంచు విష్ణు ప్యానెల్ తో క‌లిసి వీ.కే.న‌రేష్ కూడా ప‌ని చేస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అధికార‌మే ప‌రమావ‌ధిగా ఎవ‌రికి వారు ప్ర‌చారం సాగిస్తున్నారు. ఎవ‌రికి వారు రాజ‌కీయాలు చేస్తున్నారు. అక్టోబ‌ర్ 10 ఎన్నిక‌ల డే వ‌ర‌కూ ఇరు వ‌ర్గాల న‌డుమా మాట‌ల యుద్ధం ఇలానే సాగ‌నుంది. 950 మంది ఆర్టిస్టుల్లో ప్ర‌తిదానిపైనా చర్చ సాగుతోంది. ప్ర‌స్తుతానికి విందు రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయి. నైట్ పార్టీలు హుషారుగానే సాగుతున్నాయి.

జీవిత వ‌ర్సెస్ బండ్ల ఎపిసోడ్..

ఇంత‌కుముందు మూవీ ఆర్టిస్టుల‌కు ఎన్నిక‌లు అన‌గానే తొలిగా మ‌హిళా అధ్య‌క్షురాలిని ఎన్నుకుంటారంటూ ప్ర‌చార‌మైంది. ఏక‌గ్రీవం చేస్తే ఒక మ‌హిళ‌ను అధ్య‌క్షురాలిని చేయాల‌ని మంచు విష్ణు కూడా అన్నారు. ఆ క్ర‌మంలోనే జీవిత హేమ కాకుండా స‌హ‌జ‌న‌టి జ‌య‌సుధ‌కు అధ్య‌క్ష ప‌ద‌వి క‌ట్ట‌బెడ‌తార‌ని అంతా భావించారు. కానీ ఇప్పుడు వీళ్లెవ‌రూ లేనే లేదు. ఇక జీవిత జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వికి ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ త‌ర‌పున పోటీ చేస్తుంటే హేమ అదే ప్యానెల్ నుంచి మ‌రో కీల‌క‌ ప‌ద‌వికి పోటీ ప‌డ‌నుంద‌ని తెలుస్తోంది.