Begin typing your search above and press return to search.

రెండో వారంలో సర్కారు వారి పరిస్థితేంటో..?

By:  Tupaki Desk   |   17 May 2022 5:35 AM GMT
రెండో వారంలో సర్కారు వారి పరిస్థితేంటో..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ''సర్కారు వారి పాట" సినిమా ఫస్ట్ వీకెండ్ ని పూర్తి చేసుకుంది. తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమా వారాంతంలో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టగలిగింది. అయితే ఈ మూవీ సేఫ్ జోన్ లోకి రావాలంటే రెండో వారం కలెక్షన్స్ కీలకమని చెప్పాలి.

యూఎస్ఏలో 'సర్కారు వారి పాట' సినిమా ఇప్పటికే 2 మిలియన్లకు పైగా కలెక్షన్స్ సాధించి .. ఓవర్సీస్ లో మహేశ్ బాబు స్టామినా ఏంటో మరోసారి చాటిచెప్పింది. అయితే ఈ మూవీ బ్రేక్-ఈవెన్ మార్కును చేరుకోవడానికి మరో $500K పైగా వసూళ్ళు రాబట్టాల్సి ఉంటుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో 5వ రోజు రూ. 5.01 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రూ. 80.04 కోట్ల షేర్ అందుకున్నట్లు తెలుస్తుంది. అయితే సోమవారం నుంచి వసూళ్ళలో భారీగా డ్రాప్ కనిపించడం కాస్త కలవరపరిచే విషయం.

ఇటీవల కాలంలో విడుదలైన ఏ తెలుగు సినిమా కూడా మిక్స్‌డ్ టాక్‌ తో రెండో వారంలో బాక్సాఫీస్ వద్ద నిలవలేదు. ఇప్పుడు సర్కారు వారి చిత్రానికి కూడా ఈ వీక్ డేస్ వసూళ్ళు కీలకం కానున్నాయి. అయితే ఈ వారంలో మరో క్రేజీ మూవీ రిలీజ్ ఏదీ లేకపోవడం మహేశ్ చిత్రానికి కలిసొచ్చే అంశమని చెప్పాలి.

మే 27న షెడ్యూల్ చేయబడిన 'ఎఫ్ 3' సినిమా వరకు SVP కి పోటీగా మరో రిలీజ్ లేదు. టికెట్ రేట్లు తగ్గిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ వీకెండ్ లో థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. అలానే ఫ్యాన్స్ సైతం రిపీట్ షోలు చూడటానికి ఆసక్తి కనబరుస్తారు. మరి ఈ సినిమా రెండో వారంలో ఎంత వరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

సర్కారు వారి ఫలితం పట్ల మహేష్ బాబు చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. స్టేజీ మీద డైలాగ్ చెప్పడానికే ఇబ్బంది పడే సూపర్ స్టార్.. కర్నూల్ లో జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ ఈవెంట్ లో ఏకంగా డ్యాన్స్ చేసి అభిమానులను ఉత్సాహ పరిచారు.

కాగా, 'సర్కారు వారి పాట' చిత్రానికి పరశురాం పెట్లా దర్శకత్వం వహించారు. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సముద్రఖని - వెన్నెల కిషోర్ - నదియా - సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు.

మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాయి. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందించగా.. ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.