Begin typing your search above and press return to search.

మైత్రీకి తప్పని లీకుల బెడద.. సర్కారు వారి మొదటి పాట లీక్..!

By:  Tupaki Desk   |   12 Feb 2022 2:30 PM GMT
మైత్రీకి తప్పని లీకుల బెడద.. సర్కారు వారి మొదటి పాట లీక్..!
X
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు నిర్మిస్తూ టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలుగొందుతోన్న సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. అయితే భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణంలో బిజీగా ఉన్న మైత్రీ టీమ్ కు లీకుల బెడద తప్పడం లేదు. ఎంతో కేర్ తీసుకొని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నా.. ఈ బ్యానర్ లో రూపొందే సినిమాలకు సంబంధించి ఏదొక కంటెంట్ లీక్ అవుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా 'సర్కారు వారి పాట' సినిమాలోని మొదటి పాట లీకవడం మేకర్స్ పెద్ద షాక్ ఇచ్చింది.

ఇప్పటికే ''సర్కారు వారి పాట'' షూటింగ్ లొకేషన్ లోని ఫోటోలు - మహేష్ బాబు లుక్ - బ్లాస్టర్ టీజర్ లీక్ అయ్యాయి. ఈ క్రమంలో వాలెంటైన్స్ డే స్పెషల్ గా ప్లాన్ చేసిన ఫస్ట్ సింగిల్ 'కళావతి' ప్రోమో కూడా ముందే బయటకు వచ్చేసింది. మరో రెండు రోజులలో ఫిబ్రవరి 14న రాబోతున్న ఫుల్ సాంగ్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఇప్పుడు ఏకంగా పూర్తి పాట నెట్టింట ప్రత్యక్షం అయింది.

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఈ పాట కోసం తన టీమ్ తో కలిసి ప్రత్యేకంగా కవర్ వీడియో షూట్ చేయించారు. ఇందులో పాట విజువల్స్ కూడా చూపించారు. సిద్ శ్రీరామ్ ఆలపించగా.. అనంత్ శ్రీరామ్ సాహిత్యం రాశారు. అయితే ముందుగా ప్లాన్ చేసిన సమయం కంటే ముందు కంటెంట్ బయటకు రావడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు పాటకు రికార్డులు రాకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ఎవరో కావాలనే లీక్ చేసారని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై నిర్మాతలు ఇంకా స్పందించలేదు.

ఏదేమైనా మైత్రీ మేకర్స్ టీమ్ కు లీకులు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇంతకముందు 'పుష్ప' కంటెంట్ బయటకు వచ్చినప్పుడు ఈ వ్య‌వ‌హారాన్ని చాలా సీరియ‌స్‌ గా తీసుకున్నట్లు ఓ నోట్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేసారు. త‌ప్పు చేసిన వారిని ప‌ట్టుకుని శిక్ష‌ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పుడు సర్కారు వారి 'కళావతి' పాట లీక్ అవడం.. నిర్మాతలతో పాటుగా హీరో అభిమానులను కూడా ఇబ్బంది పెడుతోంది.

కాగా, 'సర్కారు వారి పాట' చిత్రాన్ని GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. ప్రపంచ వ్యాప్తంగా మే 12వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది.