Begin typing your search above and press return to search.

సంక్రాంతి పోరు మళ్ళీ మొదటికి??

By:  Tupaki Desk   |   5 Dec 2019 9:35 AM GMT
సంక్రాంతి పోరు మళ్ళీ మొదటికి??
X
తెలుగు సినిమాలకు సంక్రాంతి పెద్ద సీజన్ కావడంతో పెద్ద స్టార్ హీరోల సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతాయి. ఒకటిఅరా చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పటికీ వాటికి బడా నిర్మాతల సపోర్ట్ తప్పనిసరి. ఇక సాధారణ ప్రేక్షకులకు సంక్రాంతి సినిమాలపై ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. ఈసారి మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కళ్యాణ్ రామ్ సినిమా కూడా బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఈ రెండు సినిమాల మధ్యే ఉంది.

ప్రతి ఏడాది సంక్రాంతి సినిమాల మధ్య కనీసం ఒక రోజు గ్యాప్ ఉండేది. దీంతో ఓపెనింగ్ డే కలెక్షన్స్ కు కోత పడేది కాదు. ఈసారి మాత్రం మహేష్.. అల్లు అర్జున్ సినిమాలు ఒకే రోజు విడుదల కానుండడంతో హాట్ టాపిక్ అయింది. ఈ రెండు సినిమాలను పంపిణీ చేసే వారు నష్టపోతారని ఆందోళన వ్యక్తం అయింది. దీంతో ఈమధ్య రెండు సినిమాల నిర్మాతలు ఒక అంగీకారానికి వచ్చారని.. మహేష్ సినిమా ఒకరోజు ముందుగా వస్తుందని అన్నారు. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పుడు లేటెస్ట్ టాక్ ఏంటంటే రెండు సినిమాల మధ్య అలాంటి డీల్ ఏమీ కుదరలేదని.. ఒకేరోజు రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయని అంటున్నారు. అంటే రెండు సినిమాలకు ప్రత్యక్ష పోరుకు సిద్ధమైనట్టే.

ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల కథ విషయంలో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. రెండు సినిమాల బేసిక్ స్టొరీలైన్ ఇతర సినిమాల నుంచి కాపీ కొట్టిందేనని అంటున్నారు. 'అల వైకుంఠపురములో' సినిమా కథకు మాలయాళ చిత్రం 'మై బాస్' నుండి ప్రేరణ పొందారని.. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కథ 'ఊరికి మొనగాడు' సినిమా నుంచి ఇన్ స్పైర్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఈమధ్య చాలా సినిమాలపై ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి. సినిమా రిలీజ్ అయితే తప్ప ఈ ఆరోపణలలో నిజం ఎంత ఉందనేది తెలియదు.