Begin typing your search above and press return to search.

సంక్రాంతి పుంజులు.. ఫ్యాన్స్ ఘ‌ర్ష‌ణ దేనికి?

By:  Tupaki Desk   |   22 Oct 2019 5:51 AM GMT
సంక్రాంతి పుంజులు.. ఫ్యాన్స్ ఘ‌ర్ష‌ణ దేనికి?
X
ఒకేరోజు రెండు అగ్ర‌హీరోల సినిమాలు పోటీ ప‌డుతున్నాయి అంటే అభిమానుల మ‌ధ్య యుద్ధం ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నేలేదు. ప్ర‌స్తుత సోష‌ల్ మీడియా యుగంలో వార్ అంతా ఫేస్ బుక్-ట్విట్ట‌ర్- ఇన్ స్టా మాధ్య‌మాల్లోనే సాగుతోంది. 2020 సంక్రాంతి పుంజులేవో డిసైడ్ అయిపోయిన‌ప్ప‌టి నుంచి ఈ వార్ మ‌రింత‌గా పీక్స్ కు చేరుకుంటోంది.

పొరుగు నుంచి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సంక్రాంతిపై క‌న్నేసినా.. టాలీవుడ్ స్టార్ హీరోలైన సూప‌ర్ స్టార్ మ‌హేష్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలపైనే అభిమానుల్లో భారీ అంచ‌నాలున్నాయి. ఆ ఇరువురి ఫ్యాన్స్ మ‌ధ్య ప్ర‌స్తుతం వార్ మ‌రో లెవ‌ల్ కి చేరుకుంది. సంక్రాంతి పుంజుల్లో నువ్వా నేనా? అంటూ సాగే యుద్ధంలో గెలుపు మాదే అంటే మాదే! అంటూ అభిమానులు సోష‌ల్ మీడియాలో కాలు దువ్వుతున్నారు.

పైగా రిలీజ్ తేదీల విష‌యంలోనూ పోటీ అనివార్యంగా మార‌డంతో అది కాస్తా ఫ్యాన్స్ మ‌ధ్య అగ్గి రాజేసింద‌నే అర్థ‌మ‌వుతోంది. మ‌హేష్‌- అల్లు అర్జున్ మ‌ధ్య వార్ ప్రారంభోత్స‌వాల నుంచే మొద‌లైంది. పూజా కార్య‌క్ర‌మాల‌ రోజునే సంక్రాంతి రిలీజ్ అంటూ పోస్ట‌ర్ పై ముద్రించింది మ‌హేష్ బృందం. మ‌హేష్ క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో అనీల్ సుంక‌ర‌- దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతి బ‌రిలో రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. మొన్న ద‌స‌రా ముందు వ‌ర‌కూ జ‌న‌వ‌రి 11వ‌ తేదీన రిలీజ్ చేయాల‌ని భావించారు. అయితే ఈ సినిమాతో పాటే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న 'అల వైకుంఠ‌పురంలో' సినిమాని సంక్రాంతి రిలీజ్ అంటూ స‌డెన్ గా క‌న్ఫామ్ చేశారు. మొన్న ద‌స‌రా వ‌ర‌కూ జ‌న‌వ‌రి 14న రిలీజ్ చేయాలని భావించినా చిత్ర‌బృందం సెల‌వు దినాల్ని దృష్టిలో పెట్టుకుని తేదీని ముందుకు జ‌రిపింది. జ‌న‌వ‌రి 12 బెస్ట్ అని ఎస్.రాధాకృష్ణ‌- అల్లు అర‌వింద్ బృందం క‌న్ఫామ్ చేసేశారు. ఇలా అనూహ్యంగా అల వైకుంఠ‌పురంలో చిత్రాన్ని జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌గానే.. వెంట‌నే 'స‌రిలేరు నీకెవ్వ‌రు' టీమ్ అలెర్ట్ అయ్యింది. తాము అనుకున్న తేదీకి ఒక‌రోజు గ్యాప్ తోనే బ‌న్ని టీమ్ బ‌రిలో దిగ‌డంతో స‌రిలేరు రిలీజ్ తేదీని మార్చారు. బ‌న్నికి పోటీగా అదే రోజు(జ‌న‌వ‌రి 12న‌) మ‌హేష్ సినిమా రిలీజ్ ని ఖాయం చేశారు. మొత్తానికి మ‌హేష్‌- బ‌న్ని టీమ్ ల మ‌ధ్య ఏదో తేడా కొట్టింద‌నే ఈ స‌న్నివేశం చెబుతోంది.

రిలీజ్ తేదీల విష‌యంలో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స‌రైన అండ‌ర్ స్టాండింగ్ లేనేలేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఒకేరోజు రెండు భారీ చిత్రాల్ని రిలీజ్ చేయ‌కూడ‌దు అన్న బేసిక్ రూల్ ని ఆ ఇరువురూ తుంగ‌లో తొక్కేశారు. సంక్రాంతి సెల‌వుల్ని క్యాష్ చేసుకోవ‌డం.. దాంతో పాటే ఎవ‌రు బెస్ట్ అన్న‌ది నిరూపించ‌డం అన్న టాస్క్ కి రెడీ అయిపోయారు. దీంతో ఫ్యాన్స్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం పీక్స్ కి చేరిపోయింది. మ‌రి రూల్ ని బ్రేక్ చేసి ఇలానే బాక్సాఫీస్ పోరుకు రెడీ అవుతారా? మాట‌ల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్ అని భీష్మించుకుని కూచుంటారా.. లేక మునుముందు స‌ర్ధుబాటు ఏదైనా ఉంటుందా? అన్న‌ది చూడాలి.