Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: ఇంకొన్నాళ్లు స‌గం జీతాల‌తోనే..!!

By:  Tupaki Desk   |   6 July 2020 4:00 AM GMT
ట్రెండీ టాక్‌: ఇంకొన్నాళ్లు స‌గం జీతాల‌తోనే..!!
X
టాలీవుడ్ కి క‌ష్ట‌కాల‌మిది. ప‌ని లేదు.. పాటు లేదు! సా‌పాటు ఎటూ లేదు!! అంటూ ఆక‌లిరాజ్యంనే త‌ల‌పిస్తోంది. ముఖ్యంగా ఈ క‌ష్టం కార్మికుల ఉపాధిపై తీవ్రంగా ప‌డింది. చాలా మందికి ప‌ని లేక‌పోయినా.. ప్రీప్రొడ‌క్ష‌న్ కోసం డైరెక్ష‌న్ టీమ్ మాత్రం వ‌ర్క్ చేస్తోంది. రైట‌ర్లు స్క్రిప్టుకు మ‌రింత‌గా తుదిమెరుగులు దిద్దేందుకు ఈ గ్యాప్ క‌లిసి వ‌స్తోంది. అయితే వీళ్లంద‌రికీ జీతాలిస్తున్నారా? అంటే.. స‌గం జీతం స‌ర్ధేందుకు బ‌డా నిర్మాణ సంస్థ‌లు భేష‌జం చూపించ‌డం లేదుట‌. ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు కాబ‌ట్టి చేసే ప‌ని కూడా హాఫ్. అందువ‌ల్ల జీతాల్లో స‌గం కోత త‌ప్ప‌డం లేదు.

ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్న డివివి దాన‌య్య సైతం స‌గం జీతాలిచ్చి మ‌మ అనిపించేస్తున్నార‌ట‌‌. మునుముందు ప‌రిస్థితిని స‌మీక్షించ‌నున్నార‌ని తెలుస్తోంది. పుష్ప టీమ్ లో కొంద‌రికే జీతాలు వ‌స్తున్నాయ‌ని అక్టోబ‌ర్ లో షూటింగ్ ప్రారంభిస్తే య‌థావిధిగా అంద‌రికీ జీతాలు అందుతాయ‌ని చెబుతున్నారు. ఉపాధి క‌రువైతే కార్మికుల బ‌తుకు భార‌మ‌వుతుంద‌ని నిర్మాత‌లు కొంత‌వ‌ర‌కూ ద‌య త‌ల‌చ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

దాన‌య్య‌.. మైత్రి వాళ్లే కాదు.. ఇత‌రులు ఇదే పంథాలో ఉన్నారు. నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించ‌నున్న తాజా చిత్రానికి జీతాల్లో కోత త‌ప్పద‌ని నిర్మాత మిరియాల ర‌వీంద‌ర్ తెలిపారు.. ద‌ర్శ‌క‌త్వ శాఖలో ప‌ని చేసేవాళ్ల‌‌కు ఇన్నాళ్లు పూర్తి జీతాలు చెల్లించిన ఆయ‌న‌ త‌దుప‌రి స‌గం జీతాలే ఇవ్వ‌నున్నామ‌ని స‌మావేశం పెట్టి మ‌రీ చెప్పార‌ట‌. ఎలానూ ప‌ని లేదు కాబ‌ట్టి ఈ కోత‌. తిరిగి ప‌ని మొద‌లైతే అంద‌రికీ పూర్తి జీతాలు ఉంటాయ‌ని చెప్పార‌ట‌.

క‌ష్ట‌కాలంలోనూ నిల‌బెట్టుకోవాల‌న్న ఆలోచ‌న ప్ర‌శంసించ‌ద‌గిన‌ది. ప్ర‌స్తుత మ‌హ‌మ్మారీకి విరుగుడు కోసం చాలా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. వ్యాక్సినేష‌న్ స‌హా టీకాలు అందుబాటులోకి రావ‌డానికి ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని చెబుతున్నారు. అంత‌వ‌ర‌కూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతుంద‌న్న‌మాట‌. వైర‌స్ క‌ట్ట‌డికోసం మాన‌వాళి చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. సాధ్య‌మైనంత తొంద‌ర‌గా ప‌రిష్కారం దొర‌కాల‌నే ఆశిద్దాం.