Begin typing your search above and press return to search.

'సలార్' షూటింగ్ అప్డేట్: యాక్షన్ షురూ చేసిన మోస్ట్ వైలెంట్ మ్యాన్..!

By:  Tupaki Desk   |   3 Aug 2021 12:30 PM GMT
సలార్ షూటింగ్ అప్డేట్: యాక్షన్ షురూ చేసిన మోస్ట్ వైలెంట్ మ్యాన్..!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''సలార్''. 'కేజీఎఫ్‌' దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకుంది. 'ది మోస్ట్ వైలెంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వైలెంట్' అంటూ ప్రభాస్ ను సరికొత్త అవతారంలో చూపించి ప్రశాంత్ అందరిని సర్ప్రైజ్ చేసాడు. ఇందులో డార్లింగ్ ఓ గ్యాంగ్‌ స్టర్‌ పాత్రలో కనిపించనున్నారని హింట్ ఇచ్చారు.

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో నిలిచిపోయిన 'సలార్' సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ ను, సోమవారం హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ షూటింగ్ లో నిన్న అర్థరాత్రి ఒంటి గంట వరకు పాల్గొన్నట్లు హీరోయిన్ శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ షెడ్యూల్ లో ఆగస్టు 8 నుంచి ప్రభాస్ పాల్గొనే యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ చేయనున్నట్లు సమాచారం.

'సలార్' సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ తెలంగాణలోని గోదావరిఖని - రామగుండం ప్రాంతాల్లో జరిపిన విషయం తెలిసిందే. ప్రభాస్ - శ్రుతి హాసన్ పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత ముంబైలో కూడా కొన్ని సీన్స్ షూట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో షెడ్యూల్ ను మొదలు పెట్టారు. నగరంలోని వివిధ లొకేషన్లలో చిత్రీకరణ చేయడానికి ఇప్పటికే చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసింది.

ఇప్పటికే 'రాధే శ్యామ్' సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసిన ప్రభాస్.. ఇటీవలే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ 'ప్రాజెక్ట్ K' చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకొచ్చాడు. ఈ క్రమంలో తాజాగా ప్రారంభించిన 'సలార్' షెడ్యూల్ పూర్తి చేసిన వెంటనే.. 'ఆదిపురుష్‌' టీమ్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. మొత్తం మీద డిసెంబర్‌ లోపు 'సలార్' చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేయాలని ప్రభాస్‌ భావిస్తున్నారని టాక్. మరి పరిస్థితులు అనుకూలించి ప్రభాస్ అనుకున్నట్లు షూటింగ్ జరుగుతుందో లేదో చూడాలి.

కాగా, పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ''సలార్'' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై 'కేజీయఫ్' నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవి బస్రుర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. 'కేజీయఫ్' చిత్రానికి వర్క్ చేసిన టెక్నికల్ టీమ్ అంతా ఈ చిత్రానికి పని చేస్తున్నారు. 2022 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇకపోతే రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. యూవీ క్రియేషన్స్ - గీతాకృష్ణ ప్రొడక్షన్స్ - టీ సిరీస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అలానే ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న 'ఆదిపురుష్‌' మూవీని కూడా టీ సిరీస్ వారు తెరకెక్కిస్తున్నారు. 3డీ టెక్నాలజీలో రూపొందుతున్న ఈ సినిమాని 2022 ఆగస్ట్ 11న విడుదల చేస్తారు. అంటే 2022 లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి మూడు మూవీస్ రాబోతున్నాయి. ఇక సైన్స్ ఫిక్షన్ జోనర్ లో నాగ్ అశ్విన్ తెరకెక్కించే 'ప్రాజెక్ట్ కె' చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.