Begin typing your search above and press return to search.

'రిపబ్లిక్' ట్రైలర్: అవినీతిమయమైన వ్యవస్థల పునాదులను సరిచేసే కలెక్టర్

By:  Tupaki Desk   |   22 Sep 2021 6:13 AM GMT
రిపబ్లిక్ ట్రైలర్: అవినీతిమయమైన వ్యవస్థల పునాదులను సరిచేసే కలెక్టర్
X
మెగా మేనల్లుడు సాయి తేజ్ - 'ప్రస్థానం' ఫేమ్ దేవకట్టా కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం ''రిపబ్లిక్''. పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ పంజా అభిరామ్ పాత్రలో తేజ్ కనిపించనున్నారు. ఇందులో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ - జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసారు.

'రిపబ్లిక్' ట్రైలర్ రిలీజ్ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ''సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 1వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష'' అని పేర్కొన్నారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ''సమాజంలో తిరిగే అర్హతే లేని గుండాలు.. పట్టపగలే బాహాటంగా అమాయకుల ప్రాణాలు తీస్తుంటే.. కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వారికి కొమ్ము కాస్తున్నాయి'' అని సాయి తేజ్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైంది.

జిల్లాకు సుప్రీమ్ అథారిటీ కలెక్టర్ అని.. ఆ సుప్రీమ్ అథారిటీ నేనే అని సాయి తేజ్ చెబుతున్నాడు. ''రాజ్యాంగం ప్రకారం చట్టసభల ఆదేశాల మేరకే .. ఉద్యోగస్తులు పనిచేయాలనే విషయం మరిచిపోయినట్టున్నావ్'' అని అధికారంలో ఉన్న పవర్ ఫుల్ పొలిటీషియన్ విశాఖ వాణి (రమ్యకృష్ణ) అంటుండగా.. ''రాజ్యాంగం ప్రకారం చట్టసభల ఆదేశం మారణహోమానికి దారితీస్తే.. ఉద్యోగస్తులు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫాలో అయితే మీలాంటోళ్ళు హిట్లర్లవుతారు'' అని తేజ్ ధీటుగా సమాధానం ఇస్తున్నాడు. దీన్ని బట్టి ఇందులో పంజా అభిరామ్ క్యారక్టర్ ఎలా ఉండబోతోందో అర్థం అవుతుంది.

'రిపబ్లిక్' ట్రైలర్ చూస్తుంటే రాజకీయ నాయకుల వల్ల అవినీతిమయమైన వ్యవస్థ పునాదులను ఓ కలెక్టర్ ఎలా సరి చేసాడు.. ఈ క్రమంలో అతను ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చిందనే అంశాలతో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. 'మీ భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే ఆ సింహాసనానికి నాలుగుకాళ్ళు' అంటూ ప్రజల్ని మోటివేట్ చేయడం ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. శాసన, కార్య నిర్వాహక మరియు న్యాయవ్యవస్థలను సక్రమంగా పని చేసేలా చూసే నిజాయితీ గల కలెక్టర్ పాత్రలో తేజ్ నటన ఆకట్టుకుంటోంది.

'ప్రస్థానం' 'ఆటోనగర్ సూర్య' వంటి దేవకట్టా మరోసారి ''రిపబ్లిక్'' ద్వారా స్ట్రాంగ్ పాయింట్ చెప్పబోతున్నాడని అర్థం అవుతోంది. 'రిపబ్లిక్' సినిమాకు మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలవతోందని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. ఈ చిత్రానికి ఎమ్ సుకుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై జె.భగవాన్ - జె.పుల్లారావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.