Begin typing your search above and press return to search.

ట్రైలర్: హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో వచ్చిన పవర్ ఫుల్ 'సామాన్యుడు'

By:  Tupaki Desk   |   19 Jan 2022 12:06 PM GMT
ట్రైలర్: హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో వచ్చిన పవర్ ఫుల్ సామాన్యుడు
X
యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ ''సామాన్యుడు". 'నాట్ ఏ కామన్ మ్యాన్' అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళ్ లో ‘వీరమే వాగై సూదుం’ అనే పేరుతో రూపొందించారు. తూ.పా. శరవణన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం ఆవిష్కరించింది.

'నీకో మంచి క్రైమ్ స్టోరీ చెప్పనా..' అంటూ విశాల్ వాయిస్ ఓవర్ తో ఓ కథ చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమైంది. పోలీసాఫీసర్ అవ్వాలనుకునే వ్యక్తిగా విశాల్ కనిపించగా.. అతని ప్రేయసిగా డింపుల్ హయాతి నటించింది. యోగిబాబు హీరో ఫ్రెండ్ గా కనిపించాడు. అయితే విశాల్ కు ఎదురైన ఓ సమస్య వల్ల తన జీవితం మొత్తం తలక్రిందులు అయినట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది.

ఒక సామాన్యుడు తనకు నష్టాన్ని కలిగించిన శత్రువులకు ఎదురొడ్డి ఎలా నిలబడ్డాడు? వారితో పోరాడి అసమాన్యుడిగా ఎలా మారాడు? అనేది ''సామాన్యుడు'' సినిమాలో చూపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్ - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

''ఒక ఇంట్లో రెండు శవాలు ఉన్నాయి.. ఒక శవానికి ప్రాణం ఉంది.. ఇంకో దానికి ప్రాణం లేదు. ఆ ప్రాణమున్న శవం ప్రాణం లేని శవాన్ని చంపేసింది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి వేరే దారి లేక హత్య చేసే వాడికి.. మిగతా వాళ్ళను చంపి తను బ్రతకాలనుకునే వాడికి చాలా తేడా ఉంది. ఒక నేరాన్ని కనిపెట్టడం కంటే దాన్ని ఏ యాంగిల్ లో చూస్తున్నాం అనేది ఒక పోలీసాఫీసర్ కి ముఖ్యమైన అర్హత అని నేను అనుకుంటున్నాను'' అని విశాల్ 'సామాన్యుడు' నేపథ్యాన్ని వివరించడం ఆకట్టుకుంటోంది.

విశాల్ ఈ చిత్రంలో యాక్షన్ కు ప్రాధాన్యత ఉండేలా చేసుకున్నట్లు ట్రైలర్ లో కనిపిస్తోంది. వాస్తవికతకు దగ్గరగా ఉండేలా హై వోల్టేజ్ రిస్కీ ఫైట్స్ చేసినట్లు తెలుస్తోంది. యువన్ శకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కెవిన్ రాజ్ దీనికి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ఎస్ఎస్ మూర్తి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఎన్బీ శ్రీకాంత్ ఎడిటింగ్ వర్క్ చేశారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే 'సామాన్యుడు' విడుదల తేదీని ప్రకటించనున్నారు.