Begin typing your search above and press return to search.

ఎస్వీఆర్ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ పోస్ట్‌ పోన్

By:  Tupaki Desk   |   24 Aug 2019 4:38 AM GMT
ఎస్వీఆర్ కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ పోస్ట్‌ పోన్
X
విశ్వ న‌ట‌చ‌క్ర‌వ‌ర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్ర‌హాన్ని తాడేప‌ల్లి గూడెం య‌స్.వి.ఆర్. స‌ర్కిల్, కె.య‌న్.రోడ్ లో ఆవిష్క‌రించేందుకు అభిమానులు ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈనెల 25న ఓ ప్ర‌త్యేక విమానంలో మెగాస్టార్ చిరంజీవి తాడేప‌ల్లి గూడెం చేరుకుని విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో పాల్గొంటార‌ని ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌ను వాయిదా వేశారు.

ఆదివారం ఉద‌యం ఆవిష్క‌ర‌ణ ఉండ‌ద‌ని తెలుస్తోంది. తొలుత ఈ ఆవిష్క‌ర‌ణ మ‌హోత్స‌వానికి మెగాస్టార్ పూర్తి స్తాయిలో ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేశారు. విగ్రహావిష్కరణ కోసం మెగాస్టార్ ప్రత్యేక విమానం లో బయలుదేరి ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్ విమానాశ్ర‌యంలో దిగి అక్కడ నుండి రోడ్ మార్గాన‌ తాడేపల్లిగూడెం చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. 10గం.ల స‌మ‌యంలో విగ్ర‌హావిష్క‌ర‌ణ‌ను ప్లాన్ చేశారు.

కానీ అనూహ్యంగా విగ్ర‌హావిష్క‌ర‌ణ ప్లాన్ ని విర‌మించుకున్నార‌ని తెలుస్తోంది. విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం నుంచి ఇంకా అనుమ‌తులు రాలేదు. పోలీసుల నుంచి క్లియ‌రెన్స్ రావాల్సి ఉంది. అందుకే వాయిదా వేశార‌ని తెలుస్తోంది. ఎస్వీఆర్ కి తెలుగు రాష్ట్రాల్లో అభిమాన సంఘాలు ఉన్నాయి. గ‌తంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరులో శ‌త‌దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా ఎస్వీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ ఏడాది తాడేప‌ల్లి గూడెంలో ఆవిష్క‌రిస్తున్నారు. మునుముందు ఈ త‌ర‌హాలో మ‌రిన్ని ఆవిష్క‌ర‌ణ‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది. మ‌రోవైపు హైద‌రాబాద్, పాల‌కొల్లులో ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి విగ్ర‌హాల్ని ఆవిష్క‌రించారు. అభిమానులు మ‌రిన్ని విగ్ర‌హాల్ని ఆవిష్క‌రించే ఆలోచ‌నలోనూ ఉన్నార‌న్న స‌మాచారం అందింది. తెలుగు సినిమా పాపుల‌ర్ క్లాసిక్ న‌టీన‌టుల విగ్ర‌హావిష్క‌ర‌ణ‌ల‌కు ప్ర‌భుత్వాలకు ఇదివ‌ర‌కూ ప్ర‌తిపాద‌న‌లు పంపించిన సంగ‌తి విధిత‌మే.