Begin typing your search above and press return to search.

#క‌రోనా: రూ.100 కొట్టు.. ఎస్పీబీ సాంగ్ ప‌ట్టు!

By:  Tupaki Desk   |   2 April 2020 8:50 AM GMT
#క‌రోనా: రూ.100 కొట్టు.. ఎస్పీబీ సాంగ్ ప‌ట్టు!
X
భార‌త్ లాక్ డౌన్ నేప‌థ్యంలో సెల‌బ్రిటీలు విరాళాలు ప్ర‌క‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎవ‌రికి తోచిన సాయం వాళ్లు అందిస్తూ ఎంతో కొంత ఆక‌లి బాధ‌ల‌ను తీరుస్తున్నారు. అయినా స్పందించాల్సిన సెల‌బ్రిటీలు ఇంకా చాలా మందే ఉన్నారు. వాళ్లంతా కూడా వీలైనంత‌ త్వ‌ర‌గా విరాళాలు ఇవ్వ‌గ‌లిగితే బాధితుల క‌ష్టాల‌ను పంచుకున్నవార‌వుతారు. తాజాగా గాన గంధ‌ర్వుడు ఎస్. పి బాల సుబ్ర‌మ‌ణ్యం వినూత్నంగా విరాళాలు సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు. నిజంగా ఆయ‌న ఆలోచ‌న‌కు మెచ్చుకోవాల్సిందే. తెలుగులో పాపుల‌ర్ అయిన‌ ఎంతోమంది సంగీత ద‌ర్శ‌కులు... గాయ‌కులు ఉన్నారు. కానీ వాళ్లెవ్వ‌రు చేయ‌లేనిది ఎస్పీబీ ప‌క‌డ్భంధీ ప్లాన్ తో చేసి శ‌భాష్ అనిపించుకుంటున్నారు.

ఇంత‌కీ విరాళాలు సేక‌రించ‌డానికి ఆయ‌న ఎంచుకున్న మార్గం తెలిస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎస్పీబీ భాష‌తో సంబంధం లేకుండా అన్ని భాష‌ల్లోనూ అన‌ర్గ‌ళంగా ఆల‌పిస్తూ అమృతాన్ఇ కురిపించ‌గ‌ల‌ర‌న్న సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా అదే విధానాన్ని ఇప్పుడు స్టార్ సింగ‌ర్ ఎస్పీబీ అప్రోచ్ అవుతున్నారు. ల‌క్ష‌లాది రూపాయ‌ల నిధిని క‌రోనా బాధితుల‌కు డొనేష‌న్ గా సేక‌రిస్తున్నారు. వంద రూపాయ‌ల నుంచి ఎంత విరాళం ఇచ్చినా పాడ‌మ‌ని కోరుకుంటే ఆ అభిమాని కోరిక మేర‌కు స్వ‌యంగా ఎస్పీబీ పాడ‌తారు. ఆ పాట‌ను పాడి పేస్ బుక్ లో వీడియో రూపంలో పొందుప‌రుస్తారు. తెలుగు- త‌మిళ‌- క‌న్న‌డ భాష‌ల అభిమానుల‌కు బాలు ఈవిధంగా పిలుపునిచ్చారు.

ఇప్ప‌టికే మూడు రోజుల నుంచి ఈ విధంగా ఎస్పీబీ విరాళాలు సేక‌రిస్తున్నారు. పూజించే దేవుడి క‌న్నా సాయం చేసే చేతులు మిన్న!! అన్న నినాదంతో ఆయ‌న ముందుకు వెళ్తున్నారు. మార్చి 31 నాటికి నాలుగు ల‌క్ష‌ల‌కు పైగా విరాళాలు వ‌చ్చాయ‌ట‌. ఇలా ఎన్నాళ్లు న‌డుస్తుందో చూసి మొత్తం వ‌చ్చాక దాన్ని క‌రోనా బాధితుల‌కు విరాళంగా అందిస్తామ‌ని తెలిపారు. అలాగే ఎస్పీబీ ఫ్యాన్స్ చారిటిబుల్ ట్ర‌స్ట్ నుంచి 12 ఏళ్లుగా ఇలాంటి సేవ‌లు అందిస్తున్నామ‌న్నారు. ఆరోగ్యం..విద్య త‌దిత‌ర‌ రంగాల్లో త‌మ సేవ‌లు కొన‌సాగుతున్నాయని ఎస్పీబీ తెలిపారు.