Begin typing your search above and press return to search.

15 భాష‌ల్లో 40 వేల పాట‌లు.. ఈ రికార్డ్ ఇప్ప‌ట్లో ఎవ‌రికి సాధ్యం?

By:  Tupaki Desk   |   26 Sep 2020 7:30 AM GMT
15 భాష‌ల్లో 40 వేల పాట‌లు.. ఈ రికార్డ్ ఇప్ప‌ట్లో ఎవ‌రికి సాధ్యం?
X
సుస్వ‌రాల పూదోట‌లో వ‌న‌మాలిలా విహ‌రించిన గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాలు అజేయంగా వేలాది పాట‌లు ఆల‌పించారు. ఆయ‌న రికార్డు ను వేరొక‌రు అందుకోగ‌ల‌రా? అంటే ఇప్ప‌ట్లో అసాధ్య‌మే. నేటి నుంచి యాభై ఏళ్ల పాటు ఓ గాయ‌కుడు రోజుకో పాట రికార్డింగ్ చేసినా దాదాపుగా 20 వేల పాట‌లు పాడ‌లేడు. కానీ ఎస్పీ బాలు మాత్రం 50 ఏళ్ల‌లో దాదాపుగా 40000 పాట‌లు పాడారు. ఈ రికార్డుని బ‌హుశా ఎవ‌రూ అందుకోలేరన్న‌ది విశ్లేష‌కుల మాట‌.

అదొక్క‌టేనా ఆయ‌న ఏకంగా 15 భాష‌ల్లో పాట‌లు పాడారు. ఇది కూడా ఎవ్వ‌రి త‌రం కాదు. బాలు ఆర్టిస్టులా మారి మిమిక్రీ చేస్తూ పాటలు పాడిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఇక ఈటీవిలో వ‌చ్చే ఫేమెస్ సింగింగ్ షో `పాడుతా తీయ‌గా`కు ముగింపు ప‌డిన‌ట్టేనా? అన్న క‌ల‌త అభిమానుల్లో నెల‌కొంది.

రంగుల ప్ర‌పంచంలో ఆప‌న్న హ‌స్తం ఇవ్వ‌డం ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డం అనే గొప్ప వ్య‌క్తిత్వం అంద‌రికీ ఉండ‌దు. కానీ ఎంద‌రో యువ గాయ‌నీగాయ‌కులు పాడుతా తీయ‌గా షో ద్వారా చిత్ర సీమ‌కు ప‌రిచయం చేశారు బాలు. వారిలో ఉష‌- స్మిత - గీతా మాధురి- శ్రీరామ్- శ్రీ కృష్ణ- హేమ‌చంద్ర‌- శ్రావ‌ణ భార్గ‌వి త‌దిత‌ర‌లు ఉన్నారు. ఇంకా ఎంద‌రో గాయ‌ని గాయ‌కులు ప‌రిశ్ర‌మ‌కు ఎస్పీబీ స్ఫూర్తితో వ‌చ్చిన వారు ఉన్నారు. నేడు చెన్న‌య్ లోని ఆయ‌న ఫామ్ హౌస్ లోనే ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో ఎస్పీబీ అంతిమ సంస్కారాలు జ‌రుగుతున్నాయి.