Begin typing your search above and press return to search.

ఏడుస్తూ వీడియో రిలీజ్ చేసిన రియా చక్రవర్తి...!

By:  Tupaki Desk   |   31 July 2020 4:00 PM GMT
ఏడుస్తూ వీడియో రిలీజ్ చేసిన రియా చక్రవర్తి...!
X
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ ఆత్మహత్య కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సుశాంత్ బాలీవుడ్ లోని నెపోటిజం మరియు ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు కారణమంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ వచ్చారు. ఈ క్రమంలో సుశాంత్ సూసైడ్ కేసులో చాలా అనుమానాలున్నాయని.. కేసుని సీబీఐకి అప్పిగించి మిస్టరీని ఛేదించాలని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు డిమాండ్ చేసారు. సుశాంత్ ప్రేయసి రియా నెల రోజుల తర్వాత బయటకి వచ్చి ఈ కేసుని సీబీఐకి అప్పగించి నిజానిజాలు బయటపెట్టమని హోమ్ మినిస్టర్ అమిత్ షాని సోషల్ మీడియా వేదికగా కోరింది. అయితే సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా రియా చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. రియా తన కొడుకు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని మోసం చేసి వెళ్లిపోయిందని.. సుశాంత్‌ ను తమకు దూరం చేసిందని.. ఆమె కారణంగానే తన కొడుకు డిప్రెషన్‌ లోకి వెళ్ళాడు.. చివరికి సుశాంత్ ని ఒంటరిగా వదిలేసి వెళ్లిందని సుశాంత్‌ తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. దీంతో గత కొన్ని రోజులుగా సుశాంత్ ని ఆత్మహత్య చేసుకునేలా రియా ప్రేరేపించి ఉంటుందని.. ఓవర్ డోస్ మెడిసిన్ సుశాంత్ కి ఇచ్చి ఉంటుందని.. అతన్ని ఆర్థికంగా కూడా దెబ్బతీసిందని అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వార్తలు వస్తున్నాయి. రియాపై కేసు నమోదు చేసిన బీహార్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా రెండు రోజుల నుండి రియా చక్రవర్తి పరారీలో ఉంది అని వార్తలు వస్తున్న తరుణంలో రియా ఓ వీడియో ద్వారా మీడియా ముందుకొచ్చింది. తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ రికార్డ్ చేసిన ఒక వీడియో సందేశాన్ని ఆమె తరపు లాయర్ మీడియాకి రిలీజ్‌ చేశారు. దీంట్లో దేవుడిపై అలాగే న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందని.. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని రియా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ''నాకు దేవుడుపై న్యావ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. నాకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాను. ఎలక్ట్రానిక్ మీడియాలో నా గురించి చాలా భయకరంగా చెడు వార్తలు వస్తున్నాయి. ఇది న్యాయపరమైన విషయం కాబట్టి నా లాయర్‌‌ సూచన మేరకు నేనేమీ మాట్లాడటం లేదు. సత్యమేవ జయతే. నిజం గెలుస్తుంది'' అని వీడియోలో చెప్పుకొచ్చింది. ఈ వీడియోలో రియా చక్రవర్తి ఏడుస్తూ కనిపించింది.