Begin typing your search above and press return to search.

బాలయ్య స్పందించకపోవడానికి కారణం అదేనా..?

By:  Tupaki Desk   |   1 April 2020 3:30 PM GMT
బాలయ్య స్పందించకపోవడానికి కారణం అదేనా..?
X
కరోనా ప్రభావానికి వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. ప్రజలంతా గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితులకు సినీ ఇండస్ట్రీలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులు కూడా ఉన్నారు. సినిమా షూటింగులు ఉంటేనే ఉపాధి లభించే కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు కలిపి తెలుగులో వేల సంఖ్యలో ఉన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని చాలా మంది కార్మికులు తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించడంతో ఇండస్ట్రీలో ఆకలి కేకలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉండటం తో ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) 'మనకోసం'ను ప్రారంభించారు. ఈ ఛారిటీకి ఎవరికి తోచిన సాయం వాళ్లు అందించాలని మెగాస్టార్ పిలుపునివ్వడం తో ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. దీనికోసం నాగార్జున కోటి, నాగచైతన్య 25 లక్షలు, మహేష్ బాబు 25 లక్షలు, వరుణ్ తేజ్ రూ.20 లక్షలు, ఫలక్ నామా దాస్ ఫేమ్ విశ్వక్ సేన్ రూ. 5 లక్షలు, ప్రొడ్యుసర్ దిల్ రాజు రూ. 10 లక్షలు, యువ హీరో శర్వానంద్ 15 లక్షలు, రామ్ చరణ్, సురేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్, ప్రభాస్, ఎన్టీఆర్, కార్తికేయ, సంపూర్ణేష్ బాబు, లావణ్య త్రిపాఠి మొదలైన వారు విరాళం ప్రకటించారు.

టాలీవుడ్ కి చెందిన ప్రముఖులంతా తమకు తోచిన విధంగా సహాయం చేయగా, 'సీసీసీ' కి చైర్మన్ గా ఉన్న చిరంజీవి ఇప్పటి వరకూ 6.2 కోట్లు విరాళాలుగా వచ్చాయని ప్రకటించారు. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన బాలయ్య దీని మీద ఎందుకు స్పందించడం లేదనేది ఇప్పుడు సగటు సినీ అభిమానికి ఎదురవుతున్న ప్రశ్న. సామాజిక కార్యక్రమాలకి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుండే బాలకృష్ణ ఈసారి మౌనంగా ఎందుకు ఉన్నాడని తన ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారట. ఇంతకముందు తిత్లీ, లైలా విపత్తులు సంభవించినప్పుడు కూడా బాలయ్య ముందుండి నడిచాడు. కానీ కరోనా విపత్తు విషయానికి వచ్చే సరికి సైలెంటుగా ఉన్నాడని, అయితే కరోనా క్రైసిస్ ఛారిటీకి చైర్మన్ గా చిరంజీవి ఉండటమే దీనికి కారణమని ఇండస్ట్రీలో కొంతమంది అభిప్రాయపడుతున్నారట. దీనిలో చిరంజీవి ఆధిపత్యం ఇష్టం లేకనే బాలయ్య దూరంగా ఉన్నాడట. కానీ వాస్తవానికి కొందరు విరాళాలు ప్రకటించినప్పటికీ దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేకనో, ఇంకేదైనా కారణం చేతనో వాళ్ళు బయటకి చెప్పడం లేదంట. బాలయ్య కూడా వారిలో ఉన్నాడని, నిజానిజాలు తెలియకుండా వాళ్ళని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ తో ముందుకు వచ్చిన వాళ్ళని మనం తప్పకుండా అభినందించాలి.