Begin typing your search above and press return to search.

గుండెను క‌దిలించిన గీత ట్వీట్

By:  Tupaki Desk   |   20 April 2019 4:10 AM GMT
గుండెను క‌దిలించిన గీత ట్వీట్
X
ఛ‌లో - గీత గోవిందం చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానాన్ని సొంతం చేసుకున్న క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మిక మంద‌న‌. దేవ‌ర‌కొండ‌ `గీత గోవిందం` సినిమాతో క్రేజీ నాయిక‌గా స్టార్‌ డ‌మ్‌ ని సొంతం చేసుకున్న ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం `డియ‌ర్ కామ్రేడ్‌` చిత్రంలో న‌టిస్తోంది. ఈ చిత్రం త్వ‌ర‌లోనే ద‌క్షిణాది భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇదిలా వుంటే ర‌ష్మిక సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌ లో పెట్టిన హార్ట్ ట‌చ్చింగ్ పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నిత్యం త‌న అభిమానుల‌తో సోష‌ల్ మీడియాలో అందుబాటులో వుండే ర‌ష్మిక ఈ రోజు పెట్టిన పోస్ట్ ప్ర‌తి ఒక్క‌రినీ క‌దిలిస్తోంది.

గ‌త మంగ‌ళ‌వారం రాయ‌చూర్ అడ‌వుల్లో ఇంజ‌నీరింగ్ విద్యార్థినిని బ‌ల‌వంతం చేసి అటుపై కిరాత‌కంగా హ‌త్య చేసిన దుండ‌గులు ఆ మృత దేహాన్ని ఓ చెట్టుకు వేలాడ‌దీసిన సంగ‌తి తెలిసిందే. ఈ అమాన‌వీయ సంఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. దీనిపై సోష‌ల్ మీడియాలో పెను యుద్ధ‌మే జ‌రుగుతోంది. స్టార్లు సైతం సామాజిక మాధ్య‌మాల్లో ఆ ఘ‌ట‌న‌పై పార‌ద‌ర్శ‌కంగా విచార‌ణ సాగాల‌ని కోరుతున్నారు.

తాజాగా ఈ ఉదంతంపై ర‌ష్మిక మంద‌న్న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించింది. ``అస‌లు మ‌నుషుల్లో మాన‌వ‌త్వం ఎక్క‌డుంది. రాయ‌చూర్‌ కు చెందిన ఇంజ‌నీరింగ్ విద్యార్థిని మ‌ధుపై పాశ‌వికంగా అత్యాచారం చేసి హ‌త్య చేసిన ఘ‌ట‌న నా గుండెను బ‌ద్ద‌లు చేసింది. ఇంకా ఎంత మంది ఇలాంటివి ఎదుర్కోవాలి?. ఆమెకు న్యాయం జ‌ర‌గాల‌ని.. ఇదే చివ‌రి సంఘ‌ట‌న కావాల‌ని ఆశిస్తున్నా`` అని కోరింది. జ‌స్టిస్ ఫ‌ర్ మ‌ధు అని హ్యాష్ ట్యాగ్‌ ని పోస్ట్ చేసింది. దీనిపై మంచు మ‌నోజ్ స్పందించారు. ఈ వార్త‌ను ప‌దిమందికి తెలిసేలా షేర్ చేయండి. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న భ‌యంక‌ర‌మైన ఘ‌ట‌న‌ల‌ను త‌క్కువ చేసి చూపించ‌కండి. మ‌ధుకు న్యాయం జ‌ర‌గాలి అంటూ మీడియా ప్ర‌తినిధుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.