Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న బూరెబుగ్గల సుందరి...!

By:  Tupaki Desk   |   27 May 2020 5:30 PM GMT
కోలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న బూరెబుగ్గల సుందరి...!
X
దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు తమ అప్‌ డేట్స్‌ తో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. తమలోని టాలెంట్లన్నీ బయటకి తీస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ అభిమానులతో పంచుకుంటున్నారు. కొంతమంది మాత్రం అనుకోకుండా కలసి వచ్చిన ఈ సమయాన్ని కొత్త కొత్త విషయాలను.. భాషలను నేర్చుకోడానికి ఉపయోగించుకుంటున్నారు. మన టాలీవుడ్ బొద్దుగుమ్మ రాశీ ఖన్నా కూడా న్యూ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే పనిలో పడింది. గత రెండు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో పాటు పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వడంతో రాశీ ఖన్నా గిటార్ వాయించడం నేర్చుకుంది. ఇప్పుడు కొత్త భాష నేర్చుకుంటుంది. నార్త్ ఇండియన్ అయిన రాశీ ఖన్నా తెలుగులో అనర్గళంగా మాట్లాడే స్టేజికి వచ్చేసింది.

రాశీకి ఇప్పుడు తెలుగులో కంటే పక్క ఇండస్ట్రీ తమిళ నాట ఎక్కువ అవకాశాలొస్తున్నాయి. అందువలన తమిళ్ నేర్చుకోవాలని డిసైడ్ అయింది. దీనికోసం ఒక టీచర్ ని పెట్టుకొని తమిళ భాషను అవపోషణ పట్టే పనిలో పడింది. సోషలో మీడియాలో ఈ విషయం గురించి రాశీ తెలియాజేస్తూ ''బ్యాక్ టూ స్కూల్..! అమేజింగ్ టీచర్ శ్రీమతి లీలాతో తమిళ మాట్లాడే స్కిల్స్ పెంచుకున్నాను. ఇప్పుడు నాకు క్లాస్ వర్క్ మరియు హోమ్ వర్క్.. క్లాస్ టెస్ట్ ఉన్నాయి !! ఈ లాక్‌ డౌన్‌ లో మీరు ఎలాంటి నిర్మాణాత్మక పనులు చేస్తున్నారు?'' అంటూ పోస్ట్ పెట్టింది. దీనికి ఒక ల్యాప్ టాప్ ముందుపెట్టుకుని నోట్స్ రాసుకుంటున్న ఒక ఫోటో జత చేసింది. మొత్తం మీద కోలీవుడ్ లో వరుస ఆఫర్స్ కొట్టేస్తున్న రాశీ ఖన్నా పర్ఫెక్షన్ కోసం తమిళ్ నేర్చుకుంటోంది అంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. కొందరు మాత్రం టాలీవుడ్ లో అవకాశాలు లేక కోలీవుడ్ లో పాగా వేయాలని చూస్తోందని కామెంట్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీఖన్నా. ఆ సినిమాలో నాగశౌర్య సరసన మెరిసి తెలుగువారి హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతూ టాలీవుడ్ లో పాగా వేసుకు కూర్చుంది ఈ బూరెబుగ్గల సుందరి. గోపిచంద్‌ తో చేసిన 'జిల్' మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లుమనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ ‘జైలవకుశ’ మూవీలో ఎన్టీఆర్ వంటి టాప్ హీరో సరసన కథానాయకగా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ'లో నటించి సూపర్ హిట్ అందుకుంది. టాలీవుడ్ లో 'శివమ్' 'బెంగాల్ టైగర్' 'సుప్రీమ్' 'హైపర్' 'రాజా ది గ్రేట్' 'టచ్ చేసి చూడు' 'శ్రీనివాస కల్యాణం' సినిమాల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. గతేడాది చివరలో ఆమె నటించిన 'వెంకీమామ' 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది. కాకపోతే ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ దేవరకొండతో నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫలితంతో ఓ భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. రాశీఖన్నా చేతిలో ప్రస్తుతానికి ఏ తెలుగు సినిమా లేదు. తమిళ్‌ లో ఓ నాలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయని టాక్ వినిపిస్తోంది.