Begin typing your search above and press return to search.

బ్ర‌హ్మాస్త్ర కాదు! `షంషేరా` సిస‌లైన పాన్ ఇండియా అస్త్రం!

By:  Tupaki Desk   |   25 Jun 2022 2:30 AM GMT
బ్ర‌హ్మాస్త్ర కాదు! `షంషేరా` సిస‌లైన పాన్ ఇండియా అస్త్రం!
X
పాన్ ఇండియా స్టార్ డ‌మ్ అనేది ఇప్పుడు బాలీవుడ్ హీరోల క‌ల‌. సౌత్ మార్కెట్ ని కొల్ల‌గొట్ట‌నిదే కంటికి కునుకుప‌ట్ట‌ని స‌న్నివేశంలో ఉన్నారు హిందీ స్టార్లు. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్ కూడా ఉన్నారు. లెజెండ‌రీ క్లాసిక్ హీరో రిషీ కుమార్ వార‌సుడిగా ర‌ణ‌బీర్ ఇన్నాళ్లు ఏలాడు. కానీ అది బాలీవుడ్ వ‌ర‌కే ప‌రిమిత‌మైంది. ఇప్పుడు సౌత్ కి విస్త‌రిస్తేనే పాన్ ఇండియా స్టార్ డ‌మ్ చిక్కిన‌ట్టు. అయితే దీనికోసం బాలీవుడ్ దిగ్గ‌జాలంద‌రితో పోటీప‌డుతున్నాడు ర‌ణ‌బీర్ క‌పూర్.

అత‌డు బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాల‌తో దూసుకొస్తున్నాడు. ఇంత‌కుముందే బ్ర‌హ్మాస్త్ర ట్రైల‌ర్ తో స‌ర్ ప్రైజ్ చేసిన ర‌ణ‌బీర్ ఈ సినిమాని పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌ల చేసేందుకు చాలా శ్ర‌మిస్తున్నాడు. ఇంత‌లోనే త‌దుప‌రి షంషేరా ట్రైల‌ర్ ను లాంచ్ చేసి స‌ర్ ప్రైజ్ చేసాడు. ఈ సినిమాను పాన్ ఇండియా కేట‌గిరీలో స‌క్సెస్ చేయాల‌న్న‌ది అత‌డి త‌ప‌న‌. చూస్తుంటే బ్ర‌హ్మాస్త్ర కంటే ర‌ణ‌బీర్ గురి షంషేరాపైనే ఎక్కువ‌గా ఉంద‌ని కూడా అత‌డి ఫీలింగ్స్ చెబుతున్నాయి. షంషేరాలో అత‌డు బందిపోటు దొంగ‌గా రాబిన్ హుడ్ త‌ర‌హా వారియ‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. ఇది యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న పాత్ర కాబ‌ట్టి అంద‌రికీ క‌నెక్ట‌వుతుంద‌ని న‌మ్ముతున్నాడు. తాజాగా అత‌డు చేసిన కామెంట్ దీనిపై పెద్ద హింట్ ఇచ్చింది.

నిజానికి షంషేరా సినిమాని త‌న తండ్రి గారికి చూపించాల‌న్న ఆశ‌ను కూడా ర‌ణ‌బీర్ క‌లిగి ఉన్నాడు. ``షంషేరాను చూసేందుకు నాన్నగారు జీవించి ఉండాల్సింది..!`` అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఒక పాన్ ఇండియా హీరోగా ర‌ణ‌బీర్ క‌నిపించ‌డం చూసి రిషీజీ ఎంతో సంతోషంగా ఉండేవారోన‌ని ఎమోష‌న‌ల్ అయ్యారు.

రణబీర్ కపూర్ కెరీర్ లో మొదటి యాక్షన్ ఎంటర్ టైనర్ `షంషేరా`. లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్రలో క‌నిపించ‌నున్నాడు. సంజు త‌ర్వాత‌ నాలుగేళ్ల కు వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఉత్కంఠ నెల‌కొంది. ఇక‌ రణబీర్ తన తండ్రి గారైన‌ రిషి కపూర్ త‌న‌ని `షంషేరా`లో చూడడానికి ఇష్టపడేవార‌ని అన్నారు. రిషీజీ ఎల్లప్పుడూ తన కొడుకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు కనెక్ట‌వ్వాల‌ని కోరుకునేవారు. కానీ త‌న తండ్రి కోరిక‌ను ర‌ణీబీర్ నెర‌వేర్చ‌లేక‌పోయాడు. ఇన్నాళ్లు హిందీ చిత్ర‌సీమ‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. త‌న తండ్రి కోరిక మేర‌కు కూడా అత‌డు పాన్ ఇండియా స్టార్ డమ్ కోసం త‌పిస్తున్నాడు.

రణ్‌బీర్ తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ``ఈ సినిమాని చూసేందుకు నాన్నగారు బతికే ఉండాలని కోరుకుంటున్నాను. నాన్న గారు నా విష‌యంలో ఏదైనా ఇష్టపడినా .. ఇష్టపడకపోయినా.. నా పనిని విమ‌ర్శించేందుకు ఎప్పుడూ నిజాయితీగా ఉండేవారు. కాబట్టి ఈ సినిమాని నాన్న గారు చూడకపోవటం బాధాకరం. కానీ ఇలాంటి సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. అక్కడ ఎక్కడో నాన్న‌ నా కోసం చూస్తున్నార‌ని .. నా గురించి గర్వపడతార‌ని ఆశిస్తున్నాను`` అని ఎమోష‌న‌ల్ గా స్పందించారు.

పాన్-ఇండియన్ ప్రేక్షకులను క‌లుసుకునేందుకు తాను చేసిన ప్రయత్నమే `షంషేరా` అని రణబీర్ చెప్పాడు. నేను ఖచ్చితంగా నటుడిగా స్టార్ గా ఎదగాలని కోరుకుంటున్నాను. `షంషేరా` క‌చ్చితంగా ఆ దిశగా ఒక సానుకూల అడుగు. ఇటీవ‌ల మ‌నం ఎక్కువ మంది ప్రేక్షకుల కోసం సినిమాలు తీయాలనుకుంటున్నాం. విభిన్న తరాల ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే వినోదాన్ని అందించే కథలను తెరపై చూపాల‌నుకుంటున్నాము`` అని అన్నారు. షంషేరా ఆ దిశగా ఒక అడుగు వేస్తోంది కానీ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఈ సినిమాలో ప్రజలు నన్ను ఎలా ఆదరిస్తారో తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉన్నాను. అయితే నేను కూడా ఇలాంటి (బందిపోటు) పాత్ర పోషించినందుకు చాలా సంతోషిస్తున్నాను.. అని అన్నారు.

ఊహాజ‌నితమైన నగరం కాజాలో ఒక యోధ తెగను నిర్దాక్షిణ్యమైన సైన్యాధ్యక్షుడు బానిసలుగా ఖైదు చేసి హింసిస్తాడు. బానిసగా మారిన వ్యక్తి తిరిగి బానిస నాయకుడిగా మారి ఆపై అతని తెగ కోసం ఎలాంటి పోరాటం సాగించాడ‌న్న‌దే ఈ సినిమా క‌థాంశం. ఇది అసాధార‌ణ‌ క‌థ‌తో తెర‌కెక్కింది. 1800ల నాటి భారతదేశం మ‌ధ్య‌మ‌ భూభాగంలో సాగే క‌థాంశ‌మిది. బ్రిటీష్ వారి దురాగతాల నుండి తన తెగను రక్షించే ఏకైక లక్ష్యంతో డేర్ డెవిల్ షంషేరాగా అద‌ర‌గొట్ట‌బోతున్నాడు. ఇందులో క‌థానాయ‌కుడు తన తెగ స్వేచ్ఛ - గౌరవం కోసం అవిశ్రాంతంగా పోరాడుతాడు. అతని పేరు షంషేరా. హై-ఆక్టేన్.. అడ్రినలిన్-పంపింగ్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ అన్ని వ‌ర్గాల‌ను చేరుతుంద‌ని ర‌ణ‌బీర్ ఆశిస్తున్నాడు.

ఈ చిత్రంలో షంషేరా పాత్రలో రణబీర్ కపూర్ న‌టించ‌గా.. సంజయ్ దత్ భీక‌ర‌మైన విల‌న్ గా క‌నిపిస్తారు. రణబీర్ వ‌ర్సెస్ ద‌త్ వార్ మ‌రో లెవ‌ల్లో ఉంటుందని కూడా స‌మాచారం. ఎందుకంటే ఆ ఇద్ద‌రూ ఎదురు ప‌డితే కనికరం అన్న‌దే లేకుండా క్రూరంగా పోరాడ‌తారు. ప్ర‌తిసారీ తెర‌పై ఫ్రేమ్ లో ఒకరినొకరు వెంబడిస్తారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మించారు. 22 జూలై 2022న హిందీ- తమిళం- తెలుగు భాషల్లో మూవీ విడుదల కానుంది.

రణబీర్ కపూర్ పెళ్లి తర్వాత జీవితం గురించి కూడా తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు. భార్య ఆలియా భట్ ని `దాల్ చావల్ విత్ తడ్కా` అని ప్రేమ‌గా పిలిచాడు. పెళ్లయిన కొద్ది నెలలకే మీడియాను కలిసిన ఆర్కే ఇప్పుడు జీవితం ఎలా మారిపోయిందో కూడా చెప్పారు.

షంషేరా ట్రైలర్ లాంచ్ శుక్రవారం ముంబైలో గ్రాండ్ గా జరిగింది. YRF మూవీ ప్రధాన నటుడు రణబీర్ కపూర్ సినిమా గురించి అతని వ్యక్తిగత జీవితం గురించి అన్ని అంశాలను చాలా నిక్కచ్చిగా చెప్పాడు. ఈవెంట్ లో రణ్‌బీర్ తన వైవాహిక జీవితం గురించి బ్రహ్మాస్త్రలో తన సహనటి అలియా భట్ ని పెళ్లి చేసుకున్న తర్వాత అతను ఎలా మారిపోయాడో కూడా మాట్లాడాడు.

2022 సంవత్సరాన్ని గొప్ప సంవత్సరంగా పేర్కొన్నాడు. ప్రత్యేకించి అతను చాలా సంవత్సరాలు వేచి ఉన్న తర్వాత అలియాను వివాహం చేసుకున్నాన‌ని తెలిపాడు. నాకు పెళ్లయ్యాక ఇది చాలా గొప్ప సంవత్సరం. నా సినిమాల్లో నేను ఎప్పుడూ పెళ్లి ప్రాముఖ్యతను తగ్గించాను. ఒకదానిలో నేను వివాహానికి దాల్-చావల్ అని కూడా పిలుస్తాను అని `యే జవానీ..`లోని తన డైలాగ్ ను వినిపించాడు. హాయ్ దీవానీలో అతను తన మాజీ ప్రేయసి దీపికా పదుకొణెతో క‌లిసి నటించిన సంగ‌తి తెలిసిందే.