Begin typing your search above and press return to search.

బాబాయి తమ్ముడితో సినిమా చేస్తా

By:  Tupaki Desk   |   21 July 2021 5:21 AM GMT
బాబాయి తమ్ముడితో సినిమా చేస్తా
X
టాలీవుడ్ లో ఫ్యామిలీ మల్టీ స్టారర్ సినిమాలకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు లేదా ముగ్గురు హీరోలు కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు కోరుకుంటూనే ఉంటారు. ఎన్టీఆర్‌.. ఏయన్నార్‌ తరం నుండి కూడా ఈ ఇంట్రెస్ట్ ఉంది. ఎన్టీఆర్‌ మరియు బాలకృష్ణ లు కలిసి నటిస్తే చాలా స్పెషల్‌ గా చూసేవారు.

కృష్ణ మరియు మహేష్‌ బాబుల సినిమాలు చాలా ప్రత్యేకంగా నిలిచాయి. ఇప్పుడు చిరంజీవి మరియు ఆయన తనయుడు రామ్‌ చరణ్‌ కలిసి నటిస్తున్న సినిమా ఆచార్యపై ఎంతటి ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా ఒకే ఫ్యామిలీ కి చెందిన హీరోలు కలిసి నటించిన సినిమాలు అంటే అభిమానులు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్‌ ను చూపిస్తారు. సినిమా ఎలా ఉన్నా వారిద్దరిని కలిపి స్క్రీన్‌ మీద ఒక సారి చూడాలనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూలు కట్టిన సందర్బాలు ఉన్నాయి.

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మల్టీ స్టారర్‌ ను అభిమానులు చాలా కాలంగా వెయిట్‌ చేస్తున్నారు. బాబాయి వెంకటేష్‌ అబ్బాయి రానా కలిసి సినిమా చేస్తారంటూ చాలా సందర్బాల్లో వార్తలు వచ్చాయి. సురేష్‌ బాబు కూడా రెండు మూడు సార్లు మాట్లాడుతూ కథలు వింటున్నామని తప్పకుండా త్వరలోనే మా ఫ్యామిలీ మల్టీ స్టారర్‌ ఉంటుందని నమ్మకంగా చెప్పుకొచ్చాడు.

కాని స్క్రిప్ట్‌ ఇంకా సెట్ అవ్వలేదో మరేమో కాని వెంకీ మరియు రానాల మూవీ పట్టాలెక్కలేదు. ఈ సమయంలోనే రానా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సురేష్‌ బాబు ఫ్యామిలీ నుండి అభిరామ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. భవిష్యత్తులో బాబాయి మరియు తమ్ముడితో కలిసి సినిమా చేస్తానంటూ రానా పేర్కొన్నాడు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రానా స్వయంగా ప్రకటించాడు. తప్పకుండా మా ఫ్యామిలీ మల్టీ స్టారర్‌ ను చూస్తారని రానా హామీ ఇచ్చాడు. వెంకటేష్‌ కూడా ఆమద్య రానాతో సినిమా చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. కనుక ఈ దగ్గుబాటి ముగ్గురు హీరోల సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వెంకటేష్ నటించిన నారప్ప సినిమా థియేటర్లలో కాకుండా ఓటీటీ రిలీజ్ అవ్వడం పట్ల రానా స్పందించాడు. కాస్త నిరాశ కలిగించే విషయమే కాని నిర్మాతల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఓటీటీకి వెళ్లక తప్ప లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. నారప్ప సినిమాకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో రానా ఆనందం వ్యక్తం చేశాడు.

రానా నటించిన విరాట పర్వం సినిమా విడుదలకు సిద్దం గా ఉంది. వారం రోజుల షూటింగ్‌ బ్యాలన్స్ ఉన్నట్లుగా ఇటీవలే సురేష్‌ బాబు పేర్కొన్నాడు. రానా మరో వైపు పవన్‌ కళ్యాణ్‌ తో మలయాళం మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ లో నటిస్తున్న విషయం తెల్సిందే.

ఇక వెంకటేష్‌ వరుసగా సినిమా లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. మొదటగా ఈయన నటించిన నారప్ప ఓటీటీ రిలీజ్ అవ్వగా త్వరలోనే దృశ్యం 2 ను కూడా ఓటీటీ ద్వారా విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. మరో వైపు వరుణ్‌ తేజ్ తో కలిసి ఎఫ్‌ 3 లో నటిస్తున్నాడు.

ఆ సినిమా మాత్రం థియేటర్ల ద్వారా మాత్రమే విడుదల అవ్వబోతుందట. మరో వైపు దగ్గుబాటి అభిరామ్‌ కూడా హీరోగా ప్రేక్షకుల ముందుకు అతి త్వరలో రాబోతున్నాడు. దగ్గుబాటి ఫ్యామిలీ ఓటీటీ కంటెంట్‌ పై కూడా ఆసక్తిగా ఉన్నారు. వీరు ముగ్గురు కలిసి సినిమాతోనే కాకుండా వెబ్‌ సిరీస్ ల ద్వారా కలిసి వచ్చినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలా వచ్చినా కూడా దగ్గుబాటి అభిమానులకు ఈ ముగ్గురు కనువిందు చేయడం ఖాయం.