Begin typing your search above and press return to search.

'చెక్' వేదికపై నవ్వులు పూయించిన రాజమౌళి

By:  Tupaki Desk   |   22 Feb 2021 1:30 AM GMT
చెక్ వేదికపై నవ్వులు పూయించిన రాజమౌళి
X
నితిన్ - ప్రియా వారియర్ జంటగా రూపొందిన 'చెక్' సినిమా, ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. రకుల్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, సాయిచంద్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. హైదరాబాద్ ... మాదాపూర్ .. ఎన్ కన్వెన్షన్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించిన ఈ వేడుక, జోరుగా .. హుషారుగా సాగింది. నితిన్ - ప్రియా వారియర్ అక్కడికి చేరుకోగానే అభిమానులు ఒక్కసారిగా ఉత్సాహంతో కేకలు వేశారు.

దర్శకులు వెంకీ కుడుముల .. గోపీచంద్ మలినేని ఇద్దరూ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. వేదికపై వాళ్లు చంద్రశేఖర్ యేలేటి దర్శక ప్రతిభను గురించి మాట్లాడుతున్న సందర్భంలోనే వరుణ్ తేజ్ అక్కడికి వచ్చాడు. అభిమానుల్లో ఒక్కసారిగా హడావిడి మొదలైంది. ఆ తరువాత పెద్ద గ్యాప్ లేకుండానే రాజమౌళి - రమా రాజమౌళి ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. దాంతో అక్కడి సందడికి మరింత సంబరం తోడైంది. ఈ సమయంలో ప్లే చేసిన 'చెక్' మేకింగ్ వీడియో ఆకట్టుకునేలా సాగింది. ఫస్టు టికెట్ ను రాజమౌళి చేతుల మీదుగా వరుణ్ తేజ్ కొన్నాడు. వరుణ్ తేజ్ డబ్బులు ఎక్కువగా ఇవ్వడంతో, తాను టిక్కెట్ అమ్మింది బ్లాకులో అంటూ రాజమౌళి చమత్కరించారు.

ప్రియా ప్రకాశ్ వారియర్ మొదటి రెండు మూడు మాటలు తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడింది. ఆ తరువాత తనకి అలవాటైన ఇంగ్లిష్ లో దూసుకుపోయింది. తెలుగులో ఇలాంటి ఒక గొప్ప సినిమా ద్వారా పరిచయమవుతున్నందుకు ఆనందంగా ఉందని అంది. భవ్య క్రియేషన్స్ వాటి పెద్ద బ్యానర్లో .. నితిన్ వంటి స్టార్ హీరో జోడీగా చేయడం, చంద్రశేఖర్ యేలేటి వంటి గొప్ప దర్శకుడితో కలిసి పనిచేయడం తన అదృష్టమని చెప్పింది. ఈ సినిమాను అందరూ ఆదరించాలనీ, ఇది తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం తనకి ఉందని చెప్పుకొచ్చింది.