Begin typing your search above and press return to search.

'రాజమౌళి - ప్రభాస్' కాంబో సెట్ చేస్తున్న మైత్రీ..?

By:  Tupaki Desk   |   15 Sep 2021 11:30 PM GMT
రాజమౌళి - ప్రభాస్ కాంబో సెట్ చేస్తున్న మైత్రీ..?
X
టాలీవుడ్ లో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ల కాంబినేషన్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'ఛత్రపతి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వీరిద్దరూ.. 'బాహుబలి: ది బిగినింగ్' 'బాహుబలి: ది కన్ క్లూజన్' చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. తెలుగు మూవీ సత్తా ఏంటో వరల్డ్ సినిమాకి చూపించారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన 'బాహుబలి 2'.. ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. అందుకే ఈ కాంబోలో మరో సినిమా చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి - ప్రభాస్ కలయికలో మరో సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. డార్లింగ్ ప్రభాస్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ వీరికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. సరైన దర్శకుడి కోసం చాన్నాళ్లుగా వెతుకుతున్న మైత్రీ టీమ్.. గత వారం రాజమౌళి ని కలిసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మైత్రీ బ్యానర్ లో జక్కన్న - ప్రభాస్ కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాజమౌళి ఓ లైన్ అనుకొని ప్రభాస్ కి చెప్పేశాడని టాక్. అయితే ఈ ప్రాజెక్ట్ 'బాహుబలి' అంత గ్రాండియర్ మూవీ కాదని అనుకుంటున్నారు.

'బాహుబలి' రెండు భాగాల కోసం ఐదేళ్లు కేటాయించిన రాజమౌళి - ప్రభాస్.. ఈ కొత్త ప్రాజెక్ట్ ని కేవలం 200 రోజుల్లో కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రాథమిక చర్చలు మాత్రమే నడిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' నిర్మాణానంతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేస్తానని దర్శకుడు ఇది వరకే క్లారిటీ ఇచ్చాడు. దీని కోసం ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ కథను రెడీ చేస్తున్నట్లు రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. మహేష్ తో సినిమా అయిపోయిన తర్వాత జక్కన్న - ప్రభాస్ సినిమా ఉండే అవకాశం ఉంది. ఆలోపు ప్రభాస్ ఇప్పటికే కమిటైన ఇతర ప్రాజెక్ట్స్ ని పూర్తి చేస్తారు. మరి త్వరలోనే ఈ క్రేజీ కాంబోలో సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.