Begin typing your search above and press return to search.

యూరప్ కు పయనమైన 'RRR' టీమ్..!

By:  Tupaki Desk   |   2 Aug 2021 9:30 AM GMT
యూరప్ కు పయనమైన RRR టీమ్..!
X
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగ్గిస్ట్ యాక్షన్ డ్రామా ''ఆర్ ఆర్ ఆర్'' (రౌద్రం రణం రుధిరం). యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ ని అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చిత్రీకరణ వేగవంతం చేసిన చిత్ర యూనిట్.. సినిమాని చివరి దశకు తీసుకొచ్చారు. ఓ సాంగ్ మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. సినిమాలోని ఈ చివరి పాట కోసం ఫారిన్ షెడ్యూల్ ప్లాన్ చేసిన జక్కన్న అండ్ టీమ్.. ఈరోజు ఉదయం యూరప్‌ బయలుదేరినట్లు తెలుస్తోంది.

'ఆర్ ఆర్ ఆర్' చిత్రం కోసం భారీ ఖర్చుతో అక్కడి అందమైన ప్రదేశాలలో విజువల్ వండర్ గా ఈ సాంగ్ ను తెరకెక్కించనున్నారు. ఆగస్టు మూడో వారం వరకు ఉండే ఈ యూరప్ షెడ్యూల్ తో సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. ఆ తర్వాత చిత్ర యూనిట్ హైదరాబాద్‌ కు తిరిగి వచ్చి పోస్ట్ ప్రొడక్షన్ మరియు ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీ కానున్నారు. ఇకపోతే RRR నుంచి నిన్న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా విడుదలైన ''దోస్తీ'' సాంగ్
విశేష స్పందన తెచ్చుకుని ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

ఒకేసారి తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ వంటి ఐదు ప్రధాన భాషల్లో ఆవిష్కరించబడిన 'దోస్తీ' సాంగ్ స్పెషల్ వీడియో మిలియన్ల వ్యూస్ రాబడుతోంది. ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ గీతాన్ని హేమచంద్ర ఆలపించారు. ఇందులో నిప్పు - నీరు థీమ్‌ హైలెట్‌ అయ్యేలా గేయ రచయిత సీతారామశాస్త్రి సాహిత్యం రాశారు. ఇతర భాషల్లో అనిరుధ్ రవిచంద్రన్ - అమిత్ త్రివేది - విజయ్ ఏసుదాసు - యాజిన్ నజీర్‌ ఈ సాంగ్ ను పాడారు. 'దోస్తీ' పాట చూసిన సినీ అభిమానులు ఇందులోని మిగతా పాటలు కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయిని అంచనాలు పెంచుకుంటున్నారు.

కాగా, స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ కలిసి స్నేహం చేస్తే ఎలా ఉంటుందనే కల్పిత కథతో ''ఆర్ ఆర్ ఆర్'' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామరాజు గా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. దీనికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించగా.. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డీవీవీ పార్వతి సమర్పణలో DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తుండగా.. రామ్ చరణ్ కు జంటగా సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్ - సముద్రఖని - శ్రియా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - హీరోల ఇంట్రో టీజర్లు భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ట్రిపుల్ ఆర్ నుంచే వచ్చే ప్రతీ అప్డేట్ కూడా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో రాబోయే రోజుల్లో ప్రమోషన్స్ వేగవంతం చేయనున్నారు. ఇప్పటికే దీని కోసం రాజమౌళి అండ్ టీమ్ ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'బాహుబలి' వంటి వెండితెర అద్భుతాన్ని సృష్టించిన జక్కన్న.. 'RRR' చిత్రంతో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.