Begin typing your search above and press return to search.

పంజాగుట్ట పోలీస్టేష‌న్ లో ఆర్జీవి

By:  Tupaki Desk   |   28 May 2022 8:31 AM GMT
పంజాగుట్ట పోలీస్టేష‌న్ లో ఆర్జీవి
X
వివాదాల‌కు, సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారిన సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ పై గ‌త కొంత కాలంగా వ‌రుస వివాదాలు తెర‌పైకొస్తున్న విష‌యం తెలిసిందే. ఆర్జీవీ 50 ల‌క్ష‌లు తీసుకుని తిరిగి ఇవ్వ‌మంటే త‌న‌నే బెదిరిస్తున్నార‌ని శేఖ‌ర్ రాజు అనే వ్య‌క్తి తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ ఇటీవ‌ల వ‌ర్మ‌పై కేసు పెట్టిన విష‌యం తెలిసిందే. అంత‌కు ముందే నిర్మాత‌, ఎగ్జిబిట‌ర్ న‌ట్టికుమార్ వ‌ర్మ‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌ని న‌మ్మించి వ‌ర్మ మోసం చేశార‌ని, ఇంత వ‌ర‌కు త‌న‌కు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వ‌లేదంటూ మీడియా కెక్కారు.

త‌న‌తో పాటు సినిమాలు నిర్మిస్తామంటూ వ‌ర్మ ఎంతో మందిని మోసం చేశార‌ని, ఇప్ప‌టికీ మోసం చేస్తూనే వున్నార‌ని నిర్మాత‌ న‌ట్టికుమార్ ఇటీవ‌ల మీడియా సాక్షిగా వ‌ర్మ‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో త‌న‌పై వ‌రుస‌గా విమ‌ర్శ‌లు, కేసులు పెడుతున్న వాళ్ల‌కు గ‌ట్టి షాక్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న రామ్ గోపాల్ వ‌ర్మ శ‌నివారం ఉన్న‌ట్టుండి పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు.

నాపై కేసులు పెడ‌తారా? నేను కూడా తిరిగి కేసులు పెడ‌తానంటూ పోలీస్ స్టేష‌న్ మెట్లెక్కారు. త‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దిగుతున్న నిర్మాత‌లు న‌ట్టికుమార్, న‌ట్టి క్రాంతిల‌పై పంజాగుట్టా పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

త‌న సంత‌కాన్ని ఫోర్జ‌రీ చేసి త‌న‌ని మోసం చేశారంటూ న‌ట్టి కుమార్‌,న‌ట్టి క్రాంతిల‌పై పోలీసుల‌కు వ‌ర్మ ఫిర్యాదు చేయ‌డంతో డామిట్ క‌థ అడ్డం తిరిగింది. నిర్మాత‌లు న‌ట్టికుమార్, న‌ట్టి క్రాంతి ఇద్ద‌రూ క‌లిసి `మా ఇష్టం` సినిమాకు సంబంధించిన లెట‌ర్ హెడ్ పై త‌న సంత‌కాన్ని ఫోర్జరీ చేశార‌ని వ‌ర్మ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

అంతే కాకుండా ఫోర్జరీ డాక్యుమెంట్ ల‌తో న‌ట్టి ఎంట‌ర్ టైన్ మెంట్ కు చెందిన నిర్మాత‌లు న‌ట్టికుమార్, న‌ట్టి క్రాంతి తాను తీసిన `మా ఇష్టం` సినిమా రిలీజ్ ను అడ్డుకుంటున్నార‌ని, వాళ్లిద్ద‌రు క్రిమిన‌ల్ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని వ‌ర్మ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. నిర్మాత‌లు న‌ట్టికుమార్, న‌ట్టి క్రాంతి ల‌పై 406, 466, 467, 471, 121B సెక్ష‌న్ ల కింద పంజా గుట్ట పోలీసులు కేసు న‌మోదు చేశారు.

అప్స‌ర‌రాణి, నైనా గంగూలీల క‌ల‌యిక‌లో లెస్బియ‌న్ ల మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రామ్ గోపాల్ వ‌ర్మ `మా ఇష్టం` మూవీని రూపొందించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ముందు మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్స్ గ్రూప్ పీవీఆర్ సినిమాస్ ఈ మూవీని త‌మ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌లేమంటూ షాకిచ్చింది. ఆ త‌రువాత వ‌ర్మ కోర్టుకు వెళ్లినా ఎలాంటి ఉప‌యోగం లేకుండా పోయింది.