Begin typing your search above and press return to search.

'జేమ్స్' స్పెషల్ పోస్టర్.. పునీత్ జయంతి నాడు విడుదలవుతున్న ఆఖరి సినిమా..!

By:  Tupaki Desk   |   26 Jan 2022 8:52 AM GMT
జేమ్స్ స్పెషల్ పోస్టర్.. పునీత్ జయంతి నాడు విడుదలవుతున్న ఆఖరి సినిమా..!
X
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం సినీ అభిమానులను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. అప్పూ తిరిగిరాని లోకాలకు వెళ్లాలిపోయారనే వాస్తవాన్ని ఇప్పటికీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. చివరిగా ‘యువరత్న’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన పునీత్.. చనిపోయే సమయానికి 'జేమ్స్' 'ద్విత్వ' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.

''జేమ్స్'' సినిమాకు షూటింగ్ పునీత్ చనిపోవడానికి ముందే కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా తాజాగా పునీత్ ఆఖరి సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

'జేమ్స్' చిత్రంలో దివంగత పునీత్ రాజ్ కుమార్ స్పెషల్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారని తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. అప్పూ మిలిటరీ డ్రెస్ లో చేతిలో గన్ పట్టుకుని ఉన్నారు. పోస్టర్ బ్యాగ్రౌండ్ లో యుద్ధ వాతావరణాన్ని గమనించవచ్చు. ఈ పోస్టర్ కు ఫ్యాన్స్ నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. పునీత్ సినిమాల ద్వారా ఎప్పటికీ మనతోనే ఉంటారని సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు.

ఇకపోతే ''జేమ్స్'' చిత్రాన్ని పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేసథ్యంలో మార్చి 17- 23 తేదీల మధ్యలో ఇతర సినిమాలేవీ విడుదల చేయకూడదని కన్నడ డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించారు. పునీత్ గౌరవార్థం మరియు ఆయన చివరి చిత్రాన్ని అభిమానులకు మరింత ప్రత్యేకం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

'జేమ్స్' చిత్రానికి చేతన్ కుమార్ దర్శకత్వం వహించగా.. కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్ తో నిర్మించారు. యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిన ఈ చిత్రంలో పునీత్ సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ విలన్ గా నటించగా.. అను ప్రభాకర్ ముఖర్జీ కీలక పాత్రలు పోషించారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ సినిమాలో కొన్ని ఫైట్స్ కంపోజ్ చేశారు. పునీత్ పాత్రకు ఆయన అన్నయ్య శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు.

ఇందులో పునీత్ సోదరులు రాఘవేంద్ర రాజ్ కుమార్ - శివరాజ్ కుమార్ అతిథి పాత్రలు చేశారు. ముగ్గురు అన్నదమ్ములను కలిపి బిగ్ స్క్రీన్ పై చూడాలని ఫ్యాన్స్ దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ తో వారి కోరిక తీర్చబోతోంది. పవర్ స్టార్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

పునీత్ నటించిన 'యువరత్న' సినిమాని కన్నడతో పాటుగా తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ''జేమ్స్'' సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. పునీత్ ఆఖరి సినిమాను చూసేందుకు అభిమానులు ఓవైపు సంతోషంగా మరోవైపు భావోద్వేగంతో వేచి చూస్తున్నారని చెప్పవచ్చు.