Begin typing your search above and press return to search.

'తలైవి' కి పెట్టిన డబ్బుల కంటే ఎక్కువే వెనక్కి వచ్చాయి: నిర్మాత విష్ణు ఇందూరి

By:  Tupaki Desk   |   13 Sep 2021 10:31 AM GMT
తలైవి కి పెట్టిన డబ్బుల కంటే ఎక్కువే వెనక్కి వచ్చాయి: నిర్మాత విష్ణు ఇందూరి
X
బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ప్రధాన పాత్రలో సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ''తలైవి''. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్ లో కనిపించారు. విబ్రి మీడియా - కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. వినాయక చవితి సంధర్భంగా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ‘తలైవి’ మూవీని సెప్టెంబర్ 10న విడుదల చేశారు. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోన్న సందర్భంగా నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి మీడియాతో ముచ్చటించారు.

- 'తలైవి' సినిమా విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. మంచి సినిమా చేశాననే ప్రశంసలు కూడా వచ్చాయి. అదే సమయంలో పెట్టిన డబ్బుల కంటే ఎక్కువే వెనక్కి వచ్చాయి. అలా వ్యాపారపరంగా కూడా లాభాలు వచ్చాయి. మొత్తానికి 'తలైవి' సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉంది.

- నాన్ థియేట్రికల్ రైట్స్ తో బడ్జెట్ మొత్తం రికవరీ అయింది. సినిమాకు పెట్టిన ఖర్చు కంటే ఎక్కువే వచ్చింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ వల్ల థియేటర్ల సమస్య ఏర్పడింది. కానీ నిర్మాతగా నా పరంగా చూస్తే నేను తీసుకున్న నిర్ణయం సరైనదే. ఏ నిర్మాత కూడా తన సినిమాను వారం ముందే అందరికీ చూపించరు. కానీ నేను చూపించాను. నా సినిమా మీద నాకున్న నమ్మకం అదే. ఏ టెన్షన్ లేకుండా రిలీజ్ రోజు హాయిగా నిద్రపోయాను. ఎందుకంటే మేం థియేటర్ రెవెన్యూ మీద ఆధారపడలేదు. తీసుకున్న ఫైనాన్స్ కట్టి సినిమా రిలీజ్ చేయాలంటే నా ముందు ఆప్షన్ అదే. నా నిర్ణయాన్ని మా టీం మొత్తం సమర్థించింది. ఇలాంటి సమయంలో సినిమాను తీయడం కష్టం అనుకుంటే.. రిలీజ్ చేయడం మరింత కష్టం.

- సినిమాను థియేటర్ కోసమే తీశాం. ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ మా మొదటి ప్రాధాన్యం థియేటర్లే. కానీ పరిస్థితుల వల్లే ఇలా చేయాల్సి వచ్చింది. దాంతో నాన్ థియేట్రికల్ రెవెన్యూ బాగానే వచ్చింది. ఇలాంటి సమయంలో సినిమా హిట్ అయిందా? లేదా? అని బాక్సాఫీస్ లెక్కల్ని పట్టి చెప్పలేం. పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చాయా? లేదా? మన సినిమాను ఎంత ఎక్కువ మంది చూశారు అనేది పరిగణలోకి తీసుకోవాలి. ఆ విషయంలో మేం సక్సెస్ అయ్యాం.

- మా సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ బృందా వల్లే ఈ సినిమా ప్రారంభమైంది. జయలలిత గారు చనిపోయినప్పుడు రెండు మూడు రోజులు తిండి తినలేదు.. నిద్రపోలేదు. ఆమె బతికి ఉన్నప్పుడు బృంద అంత కనెక్ట్ అవ్వలేదేమో కానీ.. జయలలిత చనిపోయిన తరువాత మాత్రం చాలా కనెక్ట్ అయింది. జయలలిత గురించి ప్రపంచం తెలుసుకోవాలనేది ఆమె ఐడియా. అయితే ప్రాంతీయ చిత్రంగా కాకుండా పాన్ ఇండియన్ మూవీగా తీయాలని అనుకునన్నాం. తమిళ భావాలు కనిపించాలనే ఉద్దేశ్యంతో విజయ్ ను దర్శకుడిగా తీసుకున్నాం. ఇక ఇలాంటి కథను రాయాలంటే.. విజయేంద్ర ప్రసాద్ కంటే గొప్ప వారు ఎవరని అనుకున్నాం.

- జయలలిత సినిమాలో ఆమె కంటే ఎక్కువగా ఎంజీఆర్ పాత్ర ఉంటుంది. అంత ఇంపార్టెంట్ రోల్ కాబట్టే అరవింద్ స్వామిని తీసుకున్నాం. తక్కువ సీన్లు ఉన్నా కూడా ఇంపాక్ట్ కనిపించాలని అనుకున్నాం. అయితే కరోనా దెబ్బ పడటంతో బడ్జెట్, క్యాస్టింగ్ అన్నింటిని తగ్గించేద్దామని అన్నారు. కానీ మా నిర్మాతలు అందరూ సపోర్ట్ చేశారు. జయలలిత ఎన్ని కష్టాలు పడ్డారో గానీ.. సినిమాను తీయడానికి, రిలీజ్ చేయడానికి మేము ఎన్నో కష్టాలు పడ్డాం.

- కంగనా రనౌత్ ను హీరోయిన్ గా తీసుకున్నప్పుడు అందరూ బ్యాడ్ చాయిస్ అని అన్నారు. కంగనా తమిళనాడులో అంతగా తెలియదు. మొదట్లో అందరూ నెగెటివ్ కామెంట్ చేశారు. కానీ సినిమా చూశాక ప్రతీ ఒక్కరూ నాడు చేసిన ట్వీట్లను రీ ట్వీట్ చేస్తూ.. క్షమాపణలు చెబుతున్నారు. మేం తప్పుగా అనుకున్నాం.. మీ నిర్ణయమే సరైనది అని చెబుతున్నారు. అది నాకు సంతోషంగా అనిపిస్తోంది. మంచి సినిమా చేశామని వస్తోన్న ప్రశంసలు నిర్మాతగా నాకు సంతోషాన్ని ఇస్తోంది.

- 'తలైవి' సినిమాపై ఎలాంటి విమర్శలు రాలేదు. మొదట్లో సినిమాపై జయలలిత కుటుంబ సభ్యులు కేస్ వేశారు. కానీ సినిమా చూశాక వారి నిర్ణయం మారింది. జయలలితకు ఇంత కంటే గొప్ప నివాళిని ఎవరూ ఇవ్వలేరు అని అన్నారు. ఆమె మేనళ్లుడు దీపక్ ఫోన్ చేసి అభినందించాడు. తమిళనాడులో స్క్రీన్లు పెంచే ఆలోచనలో ఉన్నాం. రోజురోజుకూ థియేటర్లో జనాలు పెరుగుతున్నాయి. మొదటి సారి సింగిల్ స్క్రీన్లో సినిమా చూశామని అందరూ చెబుతున్నారు. ఇక కొంత మంది అయితే రెండు వారాల్లో ఓటీటీలో వస్తుంది కదా? అని అనుకుంటూ ఉంటారు.

- నాకు బయోపిక్స్ అంటే ఇష్టం. కథలో ఏదైనా ఫీల్ ఉంటేనే చెప్పాలనిపిస్తుంది. ఇంకా మూడు నాలుగు చిత్రాలు ప్లాన్ చేశాం. హిందీలో మంచి లైనప్స్ ఉన్నాయి. త్వరలోనే అన్ని వివరాలు చెబుతాను. కపిల్ దేవ్ బయోపిక్ '1983' పెద్ద సినిమా. థియేటర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం.

- ఒకరిని గొప్పగా చూపించేందుకు మరొకరిని తక్కువ చూపించాల్సిన అవసరం లేదు. మా సినిమా కథ అది కాబట్టి అలా తీశాం. అవతల ఉన్న కరుణానిధి కూడా గొప్ప వ్యక్తి. కరుణానిధి - ఎంజీఆర్ ఇద్దరూ కూడా పరిస్థితుల వల్ల అపొజిషన్ అయిపోయారు.

- సోషల్ మీడియా మీద ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాను. దాని పేరు ట్రెండింగ్. ఓ పెద్ద దర్శకుడు ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా వైడ్ గా విడుదల చేస్తాం. ప్రధానమంత్రి అధికారిక కార్యాలయం చుట్టూ తిరిగే మరో కథను తెరకెక్కిస్తున్నాం. 'ఆజాద్ హింద్' అనే దేశభక్తి సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాం.