Begin typing your search above and press return to search.

'మా' ఎన్నికల రోజు సీసీటీవీ ఫుటేజీ చూసి ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే..?

By:  Tupaki Desk   |   18 Oct 2021 10:53 AM GMT
మా ఎన్నికల రోజు సీసీటీవీ ఫుటేజీ చూసి ప్రకాశ్ రాజ్ ఏమన్నారంటే..?
X
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' ఎన్నికలు ముగిసి వారం గడిచినా.. ఆ వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు 'మా' అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఓటమి చెందిన ప్రకాశ్ రాజ్ 'మా' ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల రోజు దురదృష్టకర సంఘటనలు జరిగాయని.. మోహన్ బాబు - నరేశ్ 'మా' సభ్యులపై దాడి చేశారని.. సీసీ కెమెరాలు అన్నింటినీ రికార్డు చేసుంటాయని భావిస్తున్నామని.. అందుకే సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని ఎన్నికల అధికారికి లేఖ రాశారు.

దీనిపై స్పందించిన ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సీసీటీవీ ఫుటేజ్ భద్రంగా ఉందని.. నిబంధనల ప్రకారం దాన్ని ఇస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ సీసీటీవీ ఫుటేజ్ రూమ్ ను పోలీసులు సీజ్ చేశారు. ఈ క్రమంలో నేడు సోమవారం మధ్యాహ్నం 'మా' ఎన్నికల పోలింగ్ సీసీటీవీ ఫుటేజీని ప్రకాశ్ రాజ్ పరిశీలించారు. తన ప్యానెల్ సభ్యులైన బెనర్జీ - తనీష్ లతో కలిసి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ కు వచ్చారు. పోలీసుల సమక్షంలో సీసీ ఫుటేజీలను పరిశీలించారు.

అంతకుముందు ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయన్నారు. సీసీ ఫుటేజీ పరిశీలించుకోవచ్చని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పారని.. ఎన్నికల అధికారి కృష్ణమోహన్ మాత్రం కోర్టుకు వెళ్లమని సూచించారని అన్నారు. 'మా' ఎన్నికల అధికారితోనే తమకు ప్రధాన సమస్య అని.. తమ ఫిర్యాదులపై ఆయన స్పందించడం లేదని ఆరోపించారు. 'మా'ఎన్నికల ఓట్ల లెక్కింపుపై కొన్ని సందేహాలు ఉన్నాయని.. వాటిని నివృత్తి చేసుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వచ్చామని ప్రకాష్ రాజ్ తెలిపారు.

సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ''అనుమానాలను నివృత్తి చేసుకోవడం కోసమే పోలింగ్ సెంటర్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాం. ఇంకా ఎన్నికల అధికారి వద్ద ఏడు కెమెరాల ఫుటేజీ ఉంది. దానిని కూడా పరిశీలించిన తర్వాత మేము మీడియా ముందుకు వస్తాం. సీసీ ఫుటేజీ పరిశీలించడానికి అంగీకారం తెలిపిన మంచు విష్ణుకి ధన్యవాదాలు. మాకు కేవలం ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తోనే ఇబ్బందులున్నాయి. ఫుటేజీ ఇవ్వాలని కోరుతూ ఇటీవల ఆయనకు లేఖ రాశాను. మొదట ఆయన ఓకే అన్నారు. కానీ, ఆ తర్వాత ఫుటేజీ ఇవ్వడం కుదరదు.. దానికంటూ ఓ ప్రోటోకాల్ ఉంటుందని అన్నారు. త్వరలోనే మిగిలిన ఫుటేజీ పరిశీలించి మీడియా ముందుకు వస్తాం'' అని వివరించారు.

ఇకపోతే 'మా' సీసీటీవీ ఫుటేజీ వివాదం పై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పందించారు. 'మా' ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం వరకే తన బాధ్యత అని.. ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఏం జరిగినా తనకు సంబంధం లేదని అన్నారు. సీసీటీవీ ఫుటేజీ కావాలంటే కోర్టుకు వెళ్లాలని.. కోర్టు తీర్పునకు అనుగుణంగానే తాను వ్యవహరిస్తానని తెలిపారు.